ముంబై వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా రెండో రోజు లంచ్ సమయానికి 6 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. 221/4 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు బ్యాటింగ్ ఆరంభించిన భారత్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మరో నాలుగు పరుగులు జోడించిన వెంటనే టీమిండియా సాహా (27) వికెట్ను కోల్పోయింది. ఈ వికెట్ కూడా అజాజ్ పటేల్ ఖాతాలోకే వెళ్లింది.
అయితే వెంటనే అదే ఓవర్లో భారత్కు మరో షాక్ తగిలింది. ఆల్రౌండర్ అశ్విన్ ఎదుర్కొన్న తొలి బంతికే డకౌట్ అయ్యాడు. దీంతో టీమిండియా కోల్పోయిన ఆరు వికెట్లు అజాజ్ పటేల్ ఒక్కడే తీయడం విశేషం. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ ఆచితూచి ఆడి సెంచరీ హీరో మయాంక్ అగర్వాల్కు సహకారం అందించాడు. దీంతో తొలి సెషన్ ముగిసే సరికి 64 పరుగులు మాత్రమే టీమిండియా జోడించింది. క్రీజులో మయాంక్ (146), అక్షర్ పటేల్ (32) ఉన్నారు.