India vs Pakistan: అంపైర్లు కూడా భారత్‌కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..

  • అంపైర్లు కూడా భారత్‌కే అనుకూలం..
  • పాక్ ఆల్‌రౌండర్ వ్యాఖ్యలతో దుమారం..
Ind Vs Pak

Ind Vs Pak

India vs Pakistan: గ్రౌండ్‌లో భారత్‌ను జయించలేని పాకిస్తాన్ అనవసరపు ఆరోపణలు చేస్తోంది. ఐసీసీ టోర్నమెంట్లలో వరసగా భారత్ చేతిలో ఘోర పరాజయాలు పాలవుతున్నా, ఆటపై దృష్టి పెట్టకుండా భారత్‌పై ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకుంది. తాజాగా పాక్ ఆల్‌రౌండర్ ఖుష్‌దిల్ షా చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారి తీశాయి. ఒక పోడ్‌కాస్ట్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఏకంగా అంపైర్ల పైనే ఆరోపణలు చేశాడు.

భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లలో అనేక అంశాలు భారత్ జట్టుకు అనుకూలంగా ఉంటాయని ఆరోపించాడు. అంపైరింగ్ నిర్ణయాల నుంచి మ్యాచ్ నిర్వహణ వరకు కొన్ని విషయాలు భారత్‌కు ప్రయోజనం చేకూరేలా ఉంటాయని ఆరోపించాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భారత్- పాక్ మ్యాచ్‌లో ఒత్తిడి, భావోద్వేగాలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పాడు. మ్యాచ్ ప్రారంభంలో ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి ఉంటుందని, కానీ ఆట కొనసాగే కొద్దీ ఆ ఒత్తిడి తగ్గుతుందని పేర్కొన్నాడు. మా కాలంలో కూడా మేము భారత్‌ను ఓడించామని, మంచి మ్యాచ్‌లు ఆడామని చెప్పాడు. పాకిస్తాన్ భారత్‌ను ఓడిస్తే, ఆ విజయానికి ప్రాముఖ్యత పెరుగుతుందని ఖుష్‌దిల్ షా అన్నాడు. పాక్, భారత్‌ను ఓడిస్తే ఆ విజయం ఇచ్చే ఆనందం వేరే స్థాయిలో ఉంటుందని చెప్పుకొచ్చాడు.

×
×
Ad

రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల వల్ల ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. ఐసీసీ టోర్నీల్లోనే దాయాదులు తలపడుతున్నారు. ఐసీసీ టోర్నీల్లో ఇటీవల కాలంలో పాకిస్తాన్ ఎప్పుడూ భారత్‌ను ఓడించలేకపోయింది. ప్రతీ సందర్భంలో భారత్ చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. పాకిస్థాన్ చివరిసారిగా 2022 సెప్టెంబర్‌లో జరిగిన ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌లో భారత్‌ను ఓడించింది. అప్పటి నుండి, ఈ రెండు జట్ల మధ్య జరిగిన వరుసగా ఆరు మ్యాచ్‌లలో భారత్ విజయం సాధించింది. వన్డే క్రికెట్‌లో భారత్‌పై పాకిస్థాన్ చివరి విజయం కూడా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లోనే నమోదైంది. అప్పటి నుండి, భారత్ ప్రతిసారీ పాకిస్థాన్‌ను ఓడించి, ప్రధాన టోర్నమెంట్లలో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.