Virat Kohli: నిన్న(శుక్రవారం) జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), గుజరాత్ టైటాన్స్(GT) మ్యాచ్లో రజత్ పాటిదార్ (Rajat Patidar) సేన విజయం సాధించింది. 7 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో గుజరాత్ను ఓడించింది. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 205/3 స్కోరును నమోదు చేసింది. ఇక ఛేజింగ్ బరిలోకి దిగిన ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అద్భుత (81) ప్రదర్శన కనబరిచాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ సొంతం చేసుకుని మరోసారి హీరోగా నిలిచాడు. మ్యాచ్ అనంతరం కింగ్ కోహ్లీ మాట్లాడుతూ.. తన మనసులోని మాటలను పంచుకున్నాడు. తన ఇన్నింగ్స్ కంటే యువ ఆటగాడు దేవదత్ పడిక్కల్(55) ఇన్నింగ్స్పై ప్రశంసల వర్షం కురిపించాడు.
మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. “నిజాయితీగా చెప్పాలంటే, గుజరాత్ బౌలింగ్ అటాక్ చాలా అద్భుతంగా ఉంది. 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు ఒక మంచి భాగస్వామ్యం అవసరమని మాకు తెలుసు. ఈ సీజన్లో పడిక్కల్ ఇలాంటి అద్భుత ఇన్నింగ్స్ ఆడటం ఇది రెండోసారి. అతను ఎక్కడా అనవసరంగా బ్యాట్ ఊపకుండానే (slogging) చాలా ఫ్రీగా షాట్లు ఆడాడు. ఆ ఇన్నింగ్స్ వల్లే మాపై ఒత్తిడి తగ్గింది. అతనిపై భారం పడకుండా నేను మరో ఎండ్ నుంచి బౌండరీలు బాదుతూ మద్దతుగా నిలిచాను. మా మధ్య ఉన్న స్పష్టత, ఒకరికొకరు ఇచ్చుకున్న ఫీడ్బ్యాక్ వల్లే ఈ విజయం సాధ్యమైంది” అని తెలిపాడు. పిచ్ పరిస్థితుల గురించి స్పందిస్తూ.. ఈ సీజన్లో చిన్నస్వామి స్టేడియంలో ఇదే అత్యుత్తమ బ్యాటింగ్ పిచ్ అని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ప్రత్యర్థి జట్టు ఒక దశలో 230-235 పరుగులు చేసేలా కనిపించినా, తమ బౌలర్లు అద్భుతంగా పుంజుకుని వారిని కట్టడి చేశారని అన్నాడు. బంతి బ్యాట్పైకి బాగా వస్తుండటంతో క్రీజులో నిలదొక్కుకుంటే బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టడం సులభమని పడిక్కల్తో చర్చించినట్లు కోహ్లీ పేర్కొన్నాడు. తన వికెట్ పడిన తర్వాత జట్టు బ్యాటింగ్ కాస్త తడబడినప్పటికీ, ఆర్సీబీ బ్యాటింగ్ అంశంపై కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు. “మా జట్టులో అద్భుతమైన ప్రతిభ ఉంది. టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్ లాంటి పవర్ హిట్టర్లతో పాటు కృనాల్ పాండ్యా వంటి తెలివైన ఆటగాళ్లు ఉన్నారు. అందుకే బ్యాటర్లకు ఇచ్చే సందేశం ఒక్కటే.. కొట్టగలిగే బంతి కనిపిస్తే ఏమాత్రం ఆలోచించకుండా బాదేయండి, ఎందుకంటే మనకు బ్యాటింగ్ డెప్త్ ఉంది” అని చెప్పుకొచ్చాడు.
