Virat Kohli: “జట్టుకు పనికొస్తానో లేదో నా ముఖం మీద చెప్పేయండి”.. గంభీర్, అగార్కర్‌పై కోహ్లీ ఫైర్..

Virat Kohli Indirect

Virat Kohli Indirect

Virat Kohli: భారత క్రికెట్‌లో మరోసారి ప్రకంపనలు సృష్టిస్తూ.. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌లను ఉద్దేశించి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆర్‌సీబీ పాడ్‌కాస్ట్‌లో మయాంతి లాంగర్‌తో మాట్లాడిన కోహ్లీ.. జట్టు మేనేజ్‌మెంట్‌తో తనకు జరుగుతున్న ‘అప్ అండ్ డౌన్’ కమ్యూనికేషన్ (స్పష్టత లేని మాటలు) గురించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. 2027 వన్డే వరల్డ్ కప్‌పై కన్నేసిన 38 ఏళ్ల ఈ రన్ మెషీన్, తాను ఇకపై ఎవరికీ తన విలువను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని కుండబద్దలు కొట్టాడు. కోహ్లీ తన ప్రస్తుత మానసిక స్థితిని వివరిస్తూ.. “ఈరోజు నా ఆలోచనా విధానం చాలా స్పష్టంగా ఉంది. నా వల్ల టీమ్‌కు మేలు చేకూరుతుందని నేను నమ్మినప్పుడు, అలాగే నా అవసరం జట్టుకు ఉందని అవతలి వాళ్లు భావించినప్పుడు మాత్రమే నేను అక్కడ కనిపిస్తాను. అంతేగానీ, నేను ఇంకా నా విలువను, నా సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితిని కల్పిస్తే అక్కడ ఉండలేను. ఎందుకంటే నా ఆట పట్ల, నా ప్రిపరేషన్ పట్ల నేను చాలా నిజాయితీగా ఉన్నాను” అని స్పష్టం చేశాడు.

2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ప్రదర్శన తర్వాత పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన కోహ్లీ.. గత ఏడాది (2025) మే నెలలో ఇంగ్లాండ్ పర్యటనకు ముందు అకస్మాత్తుగా టెస్ట్ క్రికెట్‌కు సైతం రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టెస్టుల్లో 10,000 పరుగుల మైలురాయిని అందుకోవాలనే బలమైన లక్ష్యం ఉన్నప్పటికీ.. కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్టర్ అజిత్ అగార్కర్‌లు అతడిని బలవంతంగా టెస్ట్ సెటప్ నుంచి పక్కన పెట్టేలా చేశారనే వార్తల నడుమ కోహ్లీ ఆ నిర్ణయం తీసుకున్నాడు. అయితే, ఆ తర్వాత వన్డే క్రికెట్‌లో సెంచరీల వర్షం కురిపిస్తూ తన విమర్శకుల నోళ్లు మూయించిన కోహ్లీ.. సుదీర్ఘ విరామం తర్వాత, ఏకంగా 15 ఏళ్ల తర్వాత దేశీవాళీ టోర్నీ అయిన ‘విజయ్ హజారే ట్రోఫీ’లోనూ బరిలోకి దిగి తన నిలకడను చాటుకున్నాడు.

సెలెక్టర్లు, కోచ్‌ల ద్వంద్వ ప్రమాణాలను విరాట్ కోహ్లీ ఎండగట్టాడు. “కొందరు వ్యక్తులు నా విషయంలో విషయాలను అనవసరంగా క్లిష్టతరం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది అలా.. ఇది ఇలా అంటూ ఏవేవో మాట్లాడుతున్నారు. నా ముఖం మీదే ముందే స్పష్టంగా, నిజాయితీగా చెప్పండి లేదా నోరు మూసుకుని నన్ను ప్రశాంతంగా ఆడుకోనివ్వండి. ఒక వారం ఏమో ‘మాకు నీ సామర్థ్యాలపై నమ్మకం ఉంది’ అంటారు, కట్ చేస్తే వారం తిరగకముందే నువ్వు ఆడే విధానాన్ని ప్రశ్నిస్తారు” అని కోహ్లీ మండిపడ్డాడు. “అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? నేను జట్టుకు పనికిరాననో లేదా నా అవసరం లేదనో మొదటి రోజే నా ముఖం మీద చెప్పేయండి. లేదు, నువ్వు జట్టుకు చాలా ముఖ్యం, నీ గురించి మేం వేరేలా ఆలోచించడం లేదు అని చెప్తే.. ఇక సైలెంట్‌గా ఉండండి, మధ్యలో వేళ్లు పెట్టకండి. కేవలం వచ్చే ఫలితాలను బట్టి వారం వారానికి మీ మాటలు, నిర్ణయాలు మారుస్తూ ఉంటే.. మీరు ఎప్పటికీ ఒక స్థిరమైన స్టాండ్ తీసుకోలేరు” అంటూ కోహ్లీ తీవ్రమైన పదజాలంతో గంభీర్, అగార్కర్ ద్వయానికి గట్టి కౌంటర్ ఇచ్చాడు.