Virat Kohli: రాయ్పూర్ మైదానంలో వర్షం కారణంగా మ్యాచ్ 75 నిమిషాల పాటు ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ, అక్కడి ప్రేక్షకుల నిరీక్షణకు తగిన ప్రతిఫలం దక్కింది. ‘ఛేజ్ మాస్టర్’ విరాట్ కోహ్లీ తన బ్యాట్తో మరో అద్భుతాన్ని ఆవిష్కరించి అందరినీ అలరించాడు. ఈ మ్యాచ్కు ముందు వరుసగా రెండు మ్యాచ్ల్లో డకౌట్ అయిన కోహ్లీ, ఈ మ్యాచ్లో తాను ఎదుర్కొన్న మొదటి బంతికే పరుగు తీసి గట్టిగా గాలిలో పిడికిలి బిగించి తన ఆనందాన్ని చాటుకున్నాడు. అంతేకాదు 60 బంతుల్లో 11 ఫోర్లు, మూడు సిక్సర్లతో అజేయంగా 105 పరుగులు చేశాడు. ఐపీఎల్లో 9వ సెంచరీ బాదడమే కాకుండా, టీ20 క్రికెట్లో 14,000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి భారతీయ ఆటగాడిగా చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ, ఈ విజయంపై చాలా లోతైన విశ్లేషణ చేశాడు. ఈ సెంచరీ తర్వాత పెద్దగా సంబరాలు చేసుకోకపోవడానికి కారణాన్ని వివరిస్తూ.. “ప్రస్తుతం మాకు పాయింట్ల ప్రాధాన్యత తెలుసు, అందుకే ఈ సెంచరీ తర్వాత వేడుకలు పెద్దగా లేవు. జట్టు స్కోరులో నా వంతు సహకారం అందించాలనేది నా స్పష్టమైన ప్రయత్నం. నేను బాగా ఆడుతున్నప్పటికీ, గత మ్యాచ్లలో పరుగులు రాకపోవడం నన్ను లోలోపల కలచివేసింది. ఎందుకంటే మైదానంలో జట్టు కోసం అత్యుత్తమంగా రాణించడమే ఎప్పుడూ నా లక్ష్యం. సెంచరీ సాధించామా లేదా అనే దానికంటే మ్యాచ్ను ఫినిష్ చేయడం, చివరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించడమే అత్యంత ముఖ్యం.” అని విరాట్ తెలిపాడు.
ఒత్తిడి ఒక అద్భుతమైన వరం..
ఒత్తిడిని ఎలా స్వీకరిస్తారన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. “ఒత్తిడి అనేది ఒక గౌరవం (Pressure is a privilege) అని ఎందుకు అంటారో కారణం ఉంది. అది మనల్ని ఎప్పుడూ వినయంగా ఉంచుతుంది. ఆటపై దృష్టి పెట్టేలా చేస్తుంది. సరైన ఒత్తిడి ఎప్పుడూ మన ఆటను మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుంది. ఈ మ్యాచ్లో ఖాతా తెరవడానికి ముందు నేను కొంత కంగారు పడ్డాను. నిరంతరం మెరుగుపడటానికి చాలా శ్రమ అవసరం, కానీ అదే మనల్ని ఒక స్థాయి పైకి తీసుకెళ్తుంది. మన అపజయాలే మనల్ని మళ్ళీ పాత రోజుల్లోకి తీసుకెళ్లి, మునుపటి ప్రదర్శనలు ఇచ్చేలా పురికొల్పుతాయి. అవి మనల్ని మళ్ళీ సరైన దారిలోకి తెస్తాయి” అని కోహ్లీ వివరించారు. తన రికార్డుల గురించి మాట్లాడుతూ.. “ఇన్ని ఏళ్ల తర్వాత కూడా నాకు బ్యాటింగ్ అంటే అమితమైన ఇష్టం. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లతో పోటీ పడటాన్ని నేను ఒక గౌరవంగా భావిస్తాను. ఈ ఆట ఏదో ఒక రోజు ముగిసిపోతుందని నాకు తెలుసు, అందుకే మైదానంలో ఉన్న ప్రతి క్షణం నా మనసును, ఆత్మను పెట్టి ఆడతాను. ప్రతి రోజును సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను. క్లిష్ట పరిస్థితుల్లో, ఒత్తిడి ఉన్నప్పుడు నన్ను నేను సవాలు చేసుకుని బరిలోకి దిగుతాను. క్రీడలు మనకు వ్యక్తిగా ఎంతో నేర్పుతాయి, మన క్యారెక్టర్ను నిర్మిస్తాయి” అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. చివరగా ఆటపై తనకున్న అంతులేని ప్రేమ గురించి చెబుతూ.. ఎన్ని ఏళ్లు గడిచినా, ఎన్ని రికార్డులు వచ్చినా ఆటపై తనకున్న ప్రేమ తగ్గలేదన్నాడు.
