Shubman Gill: రాజస్థాన్ రాయల్స్తో జరిగిన క్వాలిఫైయర్-2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో అద్భుత సెంచరీతో జట్టును గెలిపించిన గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా మ్యాచ్ అనంతరం ప్రెజెంటేషన్లో గిల్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే టాస్ దగ్గర ఒక చిన్న డ్రామా జరిగింది. టాస్ వేసినప్పుడు రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఏం ఎంచుకున్నాడో మ్యాచ్ రేఫరీకి సరిగ్గా వినిపించలేదు. దాంతో రూల్స్ ప్రకారం టాస్ను మళ్లీ రెండోసారి వేయాల్సి వచ్చింది. ఈ రెండో టాస్లో గిల్ ఓడిపోయాడు. దీనిపై గిల్ స్పందిస్తూ.. టాస్ సమయంలో అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ జరిగిందని.. టాస్ ఓడిపోవడం మొదట్లో కాస్త అసంతృప్తి కలిగించినా, చివరికి మ్యాచ్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. ఇక, సాయి సుదర్శన్, తాను కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రత్యర్థి బౌలర్లను ఎలా ముప్పితిప్పలు పెట్టారో గిల్ వివరించాడు. “మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ చాలా బాగుంటుంది. ఒకరి ఆటను ఒకరం బాగా అర్థం చేసుకుంటాం. మేమిద్దరం క్రీజులో ఉన్నప్పుడు కమ్యూనికేషన్ పక్కాగా ఉంటుంది. ప్రత్యర్థి బౌలర్లలో ఏ బౌలర్ను టార్గెట్ చేయాలి, ఎవరు అటాక్ చేయాలనేది ముందే ప్లాన్ చేసుకుంటాం. ఆ అవగాహనే మా భాగస్వామ్యాల విజయ రహస్యం” అని గిల్ తెలిపాడు. సాయి సుదర్శన్ వరుసగా రెండో మ్యాచ్లోనూ హిట్ వికెట్ కావడంపై గిల్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇలాంటి వింత అవుట్ను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నాడు. బహుశా ఎవరూ కూడా చూసి ఉండరన్నాడు. బ్యాక్ టు బ్యాక్ మ్యాచుల్లో ఒకేలా అవుట్ అవ్వడం నమ్మశక్యం కానిదని.. సోషల్ మీడియాలో ఎవరో సాయి సుదర్శన్ చేతికి టేప్ వేసుకోవాలని ఒక వీడియో పెట్టారని తెలిపాడు. వచ్చే మ్యాచ్లో తానే స్వయంగా అతని చేతికి టేప్ వేయాలేమో అంటూ గిల్ సరదాగా వ్యాఖ్యానించాడు.
తాను ఈరోజు ఒక ప్రత్యేకమైన మైండ్ సెట్లో (జోన్లో) ఉన్నానని.. కేవలం గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయి, బౌలర్ ఎక్కడ వేస్తున్నాడు, బంతిని ఎటు కొట్టాలనే దానిపైనే తన ఫోకస్ ఉందని వెల్లడించాడు. బంతిని గట్టిగా బాదాలనే ఆలోచన లేదని.. బంతి ఎక్కడ పడుతుందో చూసి, తన జోన్లోకి వస్తే టైమింగ్తో షాట్లు ఆడానంతే అంటూ వివరించాడు. మనం బాగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గ్రౌండ్లో ఫీల్డర్లు ఎవరూ లేనట్లే అనిపిస్తుంది, కేవలం గ్యాప్స్ మాత్రమే కనిపిస్తాయి. బంతి కూడా బ్యాట్ మధ్యలో తగులుతుందని గిల్ చెప్పుకొచ్చాడు. రాజస్థాన్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ (96 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో రాజస్థాన్ మొదట 214 పరుగుల భారీ స్కోరు చేసింది. దీనిపై గిల్ మాట్లాడుతూ.. “ఒక దశలో వారిని 180-190 పరుగులకే కట్టడి చేస్తామనుకున్నాం, కానీ వారు 220 (214) పరుగుల టార్గెట్ పెట్టారు. ఇంత పెద్ద ఛేజింగ్లో మాకు మంచి ఓపెనింగ్ లభించింది. అయితే మ్యాచ్ను నేనే స్వయంగా పూర్తి చేయాలనుకున్నాను. కానీ సెంచరీ అయ్యాక అలా అవుట్ అవ్వడం కొంచెం బాధ కలిగించింది” అన్నాడు. ఫైనల్గా గుజరాత్ జట్టు బౌలింగ్ ఆప్షన్స్ గురించి వివరించాడు. తమ జట్టులో చాలా మంది మంచి బౌలర్లు ఉన్నారు. తమకు 6 నుంచి 7 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయని స్పష్టం చేశాడు. అందుకే ఈరోజు సాయి కిషోర్కు ఒక ఓవర్ వేసే అవకాశం సైతం రాలేదన్నాడు. తమ బ్యాటింగ్ లైనప్ సైతం చాలా డీప్గా ఉందని వెల్లడించాడు. ఇప్పుడు తామంతా ఫైనల్ మ్యాచ్ కోసం సిద్ధంగా ఉన్నామి నమ్మకం వ్యక్తం చేశాడు.
