Site icon NTV Telugu

RCB: మ్యాచ్ గెలిచినా ఆర్బీబీ ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎల్‌లోనే తొలి టీమ్‌గా..

Rcb Unwanted Record

Rcb Unwanted Record

RCB: చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఓ చెత్త రికార్డును నమోదు చేసింది. మ్యాచ్ గెలిచినప్పటికీ.. ఐపీఎల్‌లో ఓ అవాంఛనీయ రికార్డును ఖాతాలో వేసుకుంది. నిన్నటి మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్ సెంచరీ బాదిన విషయం తెలిసిందే. ఈ సెంచరీతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా సెంచరీలు సమర్పించుకున్న జట్టుగా ఆర్‌సీబీ నిలిచింది. ఇప్పటివరకు ఆర్‌సీబీ బౌలర్లపై ప్రత్యర్థి బ్యాటర్లు ఏకంగా 15 సెంచరీలు సాధించారు. ఈ జాబితాలో కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ (14) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఈ మ్యాచ్‌లో సాయి సుదర్శన్ ఆకాశమే హద్దుగా చెలరేగి 57 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేశాడు. ఇది అతనికి ఐపీఎల్‌లో మూడో సెంచరీ కాగా, 2026 సీజన్‌లో ఇదే మొదటిది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి మొదటి వికెట్‌కు 128 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి గుజరాత్ భారీ స్కోరుకు బలమైన పునాది వేశాడు. ఇదే క్రమంలో సుదర్శన్ మరో అద్భుత రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా (47 ఇన్నింగ్స్‌ల్లో) 2000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచి, క్రిస్ గేల్ (48 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉన్న రికార్డును తుడిచిపెట్టేశాడు.

ఇక, మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. గాయపడిన ఫిల్ సాల్ట్ స్థానంలో ఇంగ్లండ్ బ్యాటర్ జాకబ్ బెథెల్ ఈ సీజన్‌లో తన మొదటి మ్యాచ్ ఆడే అవకాశం దక్కించుకున్నాడు. అటు గుజరాత్ జట్టులో కూడా మార్పులు జరిగాయి. విండీస్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్ అరంగేట్రం చేయగా, మానవ్ సుతార్ తిరిగి తుది జట్టులోకి వచ్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 205/5 పరుగులు చేసింది. సుదర్శన్ సెంచరీతో చెలరేగినప్పటికీ, ఆర్‌సీబీ బౌలర్లు డెత్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి పరుగులను కొంతవరకు నియంత్రించగలిగారు.

Exit mobile version