IPL 2026 Final: ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్ రేసు రసవత్తరంగా మారింది. ఈరోజు (మే 31, ఆదివారం) జరిగే టైటిల్ పోరులో గుజరాత్ టైటాన్స్ (GT), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తలపడనున్నాయి. క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ విధించిన 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ముల్లన్పూర్ వేదికగా రికార్డ్ స్థాయిలో ఛేదించి గుజరాత్ జట్టు మూడోసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది. గుజరాత్ రికార్డు ఛేజింగ్లో కెప్టెన్ శుభ్మన్ గిల్ 53 బంతుల్లో 104 పరుగులతో సంచలన సెంచరీ చేయగా, సాయి సుదర్శన్ 32 బంతుల్లో 58 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే సాయి సుదర్శన్ వరుసగా రెండో మ్యాచ్లోనూ హిట్-వికెట్గా వెనుతిరగడం గమనార్హం. ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలోనే అతిపెద్ద లక్ష్యాన్ని ఉధృతంగా ఛేదించిన గుజరాత్, ఫైనల్లో ఆర్సీబీతో మరోసారి తలపడటానికి సిద్ధమైంది. ఇక ఈ సారి కప్పు పక్కా గుజరాత్దే అని టీమిండియా మాజీ స్టార్ వివరించారు.
ఆర్సీబీ అద్భుతమైన ఫామ్లో ఉన్నప్పటికీ, టీమిండియా మాజీ క్రికెటర్, 2011 ప్రపంచకప్ విజేత పీయూష్ చావ్లా మాత్రం గుజరాత్ టైటాన్స్ జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేశారు. ఈ సీజన్లో గుజరాత్ తమ హోమ్ గ్రౌండ్ అయిన నరేంద్ర మోడీ స్టేడియంలో ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఐదు గెలిచి అజేయంగా నిలవడమే దీనికి కారణమని పేర్కొన్నారు. “జియోస్టార్ (JioStar)” టాక్ షోలో చావ్లా మాట్లాడుతూ.. “ప్రస్తుతం ఆర్సీబీ బ్యాటర్లు, బౌలర్లు అద్భుతమైన ఫామ్లో ఉంటూ ప్లాన్స్ పక్కాగా అమలు చేస్తున్నారు. కాబట్టి గుజరాత్కు ఇది కఠినమైన సవాలే. కానీ ఈ మ్యాచ్ అహ్మదాబాద్లో జరగనుండటం గుజరాత్కు కలిసొచ్చే అంశం. ఈ సీజన్లో నరేంద్ర మోడీ స్టేడియంను గుజరాత్ ఒక బలమైన కోటగా మార్చేసింది” అని అన్నారు. సొంత మైదానంలో పిచ్ పరిస్థితులను చక్కగా ఉపయోగించుకుంటూ లక్ష్యాలను కాపాడుకోవడంలో, ఛేదించడంలో గుజరాత్ ఆరితేరిందని చావ్లా కొనియాడారు. సొంత అభిమానుల మద్దతు, పిచ్పై ఉన్న అవగాహన ఈ పెద్ద ఫైనల్లో కీలక పాత్ర పోషిస్తాయని స్పష్టం చేశారు. అందుకే తాను ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్కు 60 శాతం, ఆర్సీబీకి 40 శాతం గెలిచే అవకాశాలు ఇస్తున్నట్లు చావ్లా వెల్లడించారు.
