Royal Challengers Bengaluru: ఆర్‌సీబీ విజయ రహస్యం విరాట్ కోహ్లీ కాదా..? ‘గుర్తింపు లేని ఈ హీరో’నేనా..?

Rajat Patidar

Rajat Patidar

Royal Challengers Bengaluru: ఐపీఎల్ 2026లో వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. ఈ ఐపీఎల్‌లో ప్రతీ మ్యాచ్‌లో తన దైన శైలిలో బ్యాటింగ్‌ చేస్తూ.. జట్టు విజయం కోసం ఎంతగానో కృషి చేశారు కింగ్‌ కోహ్లీ.. అయితే, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, భువనేశ్వర్ కుమార్ వంటి స్టార్ ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్న వేళ, ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మాత్రం జట్టు విజయానికి అసలైన కారణం కెమెరాలకు దూరంగా పనిచేసే ఒక ‘గుర్తింపు లేని హీరో’ అని పేర్కొన్నాడు. ఆ హీరో మరెవరో కాదు.. ఆర్‌సీబీ బౌలింగ్ కోచ్ ఓంకార్ సాల్వీ. ఈ సీజన్‌లో జట్టు బౌలింగ్ విభాగాన్ని పూర్తిగా మార్చి విజయపథంలో నడిపించిన వ్యక్తిగా పాటిదార్ ఆయనను కొనియాడాడు. ఫైనల్ మ్యాచ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన పాటిదార్, ఓంకార్ సాల్వీ చేసిన కృషిని ప్రత్యేకంగా గుర్తు చేశాడు.

“నా తొలి రంజీ సీజన్ నుంచే ఓంకార్ సాల్వీ సార్‌ను చూస్తున్నాను. ప్రతి బౌలర్‌తో వ్యక్తిగతంగా సమయం గడుపుతూ వారి బలహీనతలు, బలాలను అర్థం చేసుకుని పనిచేస్తారు. జట్టు మీటింగ్‌లలో కంటే బౌలర్లతో గ్రౌండ్‌లోనే ఎక్కువ సమయం కనిపిస్తారు. ఆయన కష్టానికి ఈ విజయం పెద్ద నిదర్శనం” అని పాటిదార్ పేర్కొన్నాడు.. ఆర్‌సీబీ బౌలింగ్ విభాగంలో వచ్చిన మార్పుకు ఓంకార్ సాల్వీయే ప్రధాన కారణమని క్రికెట్ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. 2024 చివర్లో బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన సాల్వీ, ముంబై జట్టుకు రంజీ ట్రోఫీ, ఇరానీ కప్ విజయాలు అందించిన అనుభవాన్ని ఆర్‌సీబీకి ఉపయోగించాడు. ఆయన మార్గదర్శకత్వంలో ఆర్‌సీబీ బౌలర్లు ఈ సీజన్‌లో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించారు.

×
×
Ad

భువనేశ్వర్ కుమార్ ఈ సీజన్‌లో 28 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో చివరి వరకు పోటీ పడ్డాడు. బ్యాటర్లకు అనుకూలమైన పిచ్‌లపై కూడా అతను 7.95 ఎకానమీతో బౌలింగ్ చేయడం విశేషం. మరోవైపు ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌వుడ్ 13 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు సాధించగా, యువ బౌలర్ రసిక్ సలాం దార్ ఆర్‌సీబీకి దొరికిన పెద్ద ఆణిముత్యంగా నిలిచాడు. రసిక్ కేవలం 12 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు తీసి టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఏడో స్థానంలో నిలిచాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్‌లో మూడు కీలక వికెట్లు తీసి మ్యాచ్‌ను ఆర్‌సీబీ వైపు తిప్పడంలో ప్రధాన పాత్ర పోషించాడు. అలాగే న్యూజిలాండ్ పేసర్ జాకబ్ డఫీ తన తొలి ఐపీఎల్ సీజన్‌లోనే ఆరు మ్యాచ్‌ల్లో తొమ్మిది వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.

ఈ సందర్భంగా హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్‌ను కూడా రజత్ పాటిదార్ ప్రశంసించాడు. “నా ఐపీఎల్ కెరీర్‌లో నేను పనిచేసిన కోచ్‌లలో ఆండీ ఫ్లవర్ అత్యుత్తముడు. తుది జట్టులో ఉన్న ఆటగాళ్లకే కాకుండా, బెంచ్‌పై ఉన్న ప్రతి ఆటగాడికీ సమాన ప్రాధాన్యత ఇస్తారు. జట్టులోని ప్రతి ఒక్కరిని సమానంగా చూసే సంస్కృతిని ఆయన తీసుకొచ్చారు” అని తెలిపాడు. మొత్తంగా.. కోచ్‌ల సూచనలు ఆచరణలో పెట్టిన ఆటగాళ్లు.. సమిష్టి కృషితో.. రెండో సారి ఐపీఎల్ టైటిల్‌ అందుకున్నారు..