IPL 2026 Final: టాటా ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధమైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈరోజు (మే 31) డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు తలపడనున్నాయి. ఇరు జట్లు తమ రెండో ఐపీఎల్ టైటిల్ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉండగా, ఈ మ్యాచ్కు ముందు ఒక ఆసక్తికరమైన రికార్డు ఆర్సీబీ అభిమానుల్లో జోష్ నింపుతోంది. అదే సమయంలో గుజరాత్ క్యాంప్లో ఆందోళన కలిగిస్తోంది. నిజానికి, ఐపీఎల్లో 2018 సీజన్ నుంచి ఒక విచిత్రమైన సెంటిమెంట్ (ట్రెండ్) బలంగా కొనసాగుతోంది. అదేంటంటే.. క్వాలిఫయర్-1 లో గెలిచిన జట్టే ప్రతిసారీ ఫైనల్లోనూ విజయం సాధించి ట్రోఫీని ముద్దాడుతోంది. గత ఎనిమిదేళ్లుగా ఇదే తరహా ట్రెండ్ కొనసాగింది.
2018: చెన్నై సూపర్ కింగ్స్ (క్వాలిఫయర్-1 విజేత, టైటిల్ విజేత)
2019: ముంబై ఇండియన్స్
2020: ముంబై ఇండియన్స్
2021: చెన్నై సూపర్ కింగ్స్
2022: గుజరాత్ టైటాన్స్
2023: చెన్నై సూపర్ కింగ్స్
2024: కోల్కతా నైట్ రైడర్స్
2025: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఈ ఐపీఎల్ ప్లేఆఫ్ ఫార్మాట్ జట్లకు రెండో అవకాశం ఇచ్చినప్పటికీ, గత కొన్నేళ్లుగా క్వాలిఫయర్-1 విజేతలే ఆ ఆధిక్యతను పూర్తిగా వాడుకుని ఛాంపియన్లుగా నిలిచారు. ఈ సీజన్ క్వాలిఫయర్-1 లో ఆర్సీబీ జట్టు గుజరాత్ టైటాన్స్ను ఏకపక్షంగా ఓడించి నేరుగా ఫైనల్ చేరింది కాబట్టి, చరిత్ర ప్రకారం బెంగళూరుకే విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చరిత్ర ఆర్సీబీ వైపు ఉంటే, ప్రస్తుత హోమ్ రికార్డ్ మాత్రం గుజరాత్ టైటాన్స్ వైపు ఉంది. నరేంద్ర మోడీ స్టేడియం గుజరాత్కు సొంత మైదానం కావడం, ఇక్కడ ఆ జట్టు వరుసగా 4 మ్యాచ్ల్లో (ఇందులో ఆర్సీబీపై సాధించిన విజయం కూడా ఉంది) గెలవడం శుభ్మన్ గిల్ సేనకు కొండంత బలాన్ని ఇస్తోంది.
అహ్మదాబాద్లోని మిశ్రమ మట్టి (Mixed-soil) పిచ్పై ఫాస్ట్ బౌలర్లకు మంచి సహకారం లభించే అవకాశం ఉంది. కాబట్టి మ్యాచ్ ఫలితం తొలి 6 ఓవర్ల పవర్ప్లేలోనే తేలిపోవచ్చు. గుజరాత్ వద్ద కగిసో రబడా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ లాంటి వికెట్ టేకింగ్ బౌలర్లు ఉండగా, ఆర్సీబీ బ్యాటింగ్ అంతా విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ల చుట్టూ తిరగనుంది. ఇక, ఈ సీజన్లో గుజరాత్ బ్యాటర్లు శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ రన్ మెషీన్లలా మారి చెరో 700+ పరుగులు సాధించారు. వీరికి తోడు జోస్ బట్లర్ రాకతో గుజరాత్ టాప్ ఆర్డర్ మరింత ప్రమాదకరంగా మారింది. మరోవైపు ఆర్సీబీ రథసారథి విరాట్ కోహ్లీ ఈ సీజన్లోనూ 600+ పరుగులు దాటేశాడు. 2024 నుంచి ఇప్పటివరకు కోహ్లీ బ్యాట్ నుంచి దాదాపు 2000 పరుగులు రావడం విశేషం. లైమ్లైట్లోకి రాకుండా నిలకడగా రాణిస్తున్న దేవదత్ పడిక్కల్పై సైతం ఆర్సీబీ భారీ ఆశలు పెట్టుకుంది. రజత్ పాటిదార్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృణాల్ పాండ్యాలతో కూడిన ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ చాలా బలంగా కనిపిస్తోంది. దీనికి భిన్నంగా గుజరాత్ మిడిల్ ఆర్డర్ బాధ్యతలు రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్, నిశాంత్ సింధు భుజాలపై ఉన్నాయి. ఫైనల్ లాంటి ఒత్తిడితో కూడిన మ్యాచ్ల్లో ఈ మిడిల్ ఆర్డర్ ప్రదర్శనే గెలుపోటములను శాసిస్తుంది.
మరోవైపు.. ఈ సీజన్లో ఇప్పటికే 28 వికెట్లు పడగొట్టిన గుజరాత్ పేసర్ కగిసో రబడా మరో రెండు వికెట్లు తీస్తే 30 వికెట్ల మార్కును అందుకుంటాడు. ఐపీఎల్ చరిత్రలో రెండు వేర్వేరు జట్ల తరఫున రెండు వేర్వేరు సీజన్లలో 30+ వికెట్లు తీసిన అరుదైన బౌలర్ల క్లబ్లో అతడు చేరుతాడు. అదే సమయంలో ఆర్సీబీ పేసర్ భువనేశ్వర్ కుమార్ సైతం 26 వికెట్లతో రేసులో ఉన్నాడు. ఐపీఎల్ సుదీర్ఘ చరిత్రలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు మాత్రమే తమ టైటిల్ను విజయవంతంగా డిఫెండ్ (వరుసగా రెండోసారి ట్రోఫీని గెలవడం) చేసుకోగలిగావు. ఇప్పుడు రజత్ పాటిదార్ నేతృత్వంలోని ఆర్సీబీకి ఆ రికార్డును సమం చేసే సువర్ణావకాశం దక్కింది. మరి క్వాలిఫయర్-1 సెంటిమెంట్ను నిజం చేస్తూ ఆర్సీబీ వరుసగా రెండో ఏడాది కప్ కొడుతుందా, లేక సొంత గడ్డపై శుభ్మన్ గిల్ చరిత్రను తిరగరాస్తాడా అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది!
