ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య జరిగిన మ్యాచ్లో యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ ప్రదర్శనపై వస్తున్న విమర్శలను ప్రముఖ వ్యాఖ్యాత ఇయాన్ బిషప్ ఖండించారు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ఐపీఎల్, యువ ప్రతిభను వెలికితీయడంలో ఎప్పుడూ ముందుంటుంది. 2024 సీజన్లో తన బుల్లెట్ వేగంతో అందరినీ ఆశ్చర్యపరిచిన మయాంక్ యాదవ్, ఆ తర్వాత గాయాల బారిన పడి దాదాపు 353 రోజుల పాటు మైదానానికి దూరమయ్యాడు. తీవ్రమైన వెన్నునొప్పితో కెరీర్ ప్రమాదంలో పడిన తరుణంలో.. ఎంతో కష్టపడి కోలుకుని రాజస్థాన్తో జరిగిన మ్యాచ్ ద్వారా మళ్లీ ఐపీఎల్ బరిలోకి దిగాడు.
ఈ మ్యాచ్లో మయాంక్ యాదవ్ తన పూర్తి కోటా 4 ఓవర్లు వేసి 56 పరుగులు ఇచ్చాడు. దురదృష్టవశాత్తూ అతనికి ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ముఖ్యంగా తన చివరి ఓవర్లో రవీంద్ర జడేజా బ్యాటింగ్లో 20 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు అతడిపై విమర్శల వర్షం కురిపించారు. వికెట్లు తీయకుండా ఇన్ని పరుగులు ఇస్తావా అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. అంతే కాదు ఇంకొంతమంది నెటిజన్లు ‘నీకు బౌలింగ్ రాదు.. వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకో’ అంటూ విమర్శిస్తున్నారు.
ఇయాన్ బిషప్ అండ..
ఈ విమర్శలపై వెస్టిండీస్ మాజీ దిగ్గజం ఇయాన్ బిషప్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఘాటుగా సమాధానమిచ్చారు. “మయాంక్ యాదవ్పై వస్తున్న నెగెటివ్ కామెంట్లను చూడటం భయానకంగాఉంది. 21 ఏళ్ల వయసులో అతడు దాదాపు తన కెరీర్ను, జీవనోపాధిని కోల్పోయే స్థితికి వెళ్ళాడు. అలాంటి పరిస్థితుల నుంచి కోలుకుని మళ్ళీ మైదానంలోకి రావడం పెద్ద విషయం. అతడు మళ్ళీ 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగలగడం ఒక అద్భుతం. ప్రస్తుతం అతడు ఫిట్గా ఉండాలని కోరుకోండి, లైన్ అండ్ లెంగ్త్పై నియంత్రణ మెల్లగా వస్తుంది” అని బిషప్ అతడికి మద్దతుగా నిలిచారు.
