Ravichandran Ashwin: ఐపీఎల్ (IPL 2026) సీజన్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ సైతం ఆడకపోయినప్పటికీ మహేంద్ర సింగ్ ధోనీ నిరంతరం వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK), సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య సోమవారం (మే 18) చేపాక్ స్టేడియంలో జరగబోయే మ్యాచ్ ఇప్పుడు కేవలం ప్లేఆఫ్స్ పోరాటమే కాకుండా, పూర్తిగా ధోనీ పునరాగమనం చుట్టూ తిరుగుతోంది. నేడు చెన్నై మైదానంలో ‘కెప్టెన్ కూల్’ మళ్లీ పసుపు రంగు జెర్సీలో కనిపిస్తాడా? లేదా? అనేదే అభిమానుల మనసులో ఉన్న అతిపెద్ద ప్రశ్న. సీజన్ ప్రారంభానికి ముందే ధోనీ కాఫ్ స్ట్రెయిన్ (పిక్క కండరాల గాయం)తో బాధపడుతున్నాడని, అందుకే ప్రారంభ మ్యాచ్లకు అందుబాటులో ఉండడని సీఎస్కే తెలిపినప్పటికీ, ఆ నిరీక్షణ కాస్తా సుదీర్ఘంగా సాగింది. ధోనీ నెట్స్లో బాగానే బ్యాటింగ్ చేస్తున్నాడని, కానీ అతని రన్నింగ్, ఫిట్నెస్ గురించే అసలు ఆందోళన అని సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ ముందే స్పష్టం చేశారు. మరోవైపు, హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఓ పెద్ద విషయాన్ని వెల్లడిస్తూ.. తాము ధోనీని త్వరగా జట్టులోకి తీసుకురావాలని ప్రయత్నించామని, కానీ వార్మప్ మ్యాచ్లో అతని గాయం మళ్లీ తిరగబెట్టిందని చెప్పారు.
అయితే, తాజాగా టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇచ్చిన ఓ ప్రకటన క్రికెట్ ప్రపంచంలో తీవ్ర సంచలనం సృష్టించింది. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగే మ్యాచ్లో ధోనీ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, తాను విన్నంతవరకు అతను గత 2-3 మ్యాచ్ల నుంచే ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్లో పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో #DhoniReturn ట్రెండ్ అవ్వడం మొదలైంది. అభిమానుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ధోనీ గతంలో ఇచ్చిన ఓ స్టేట్మెంట్కి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 2021 సీజన్లో చెన్నై టైటిల్ గెలిచిన తర్వాత ధోనీ మాట్లాడుతూ.. “నా చివరి టీ20 మ్యాచ్ చెన్నైలోనే జరుగుతుందని ఆశిస్తున్నాను” అని అన్నాడు. ఇప్పుడు దాదాపు ఐదేళ్ల తర్వాత చెన్నైలో సీఎస్కే తన చివరి లీగ్ మ్యాచ్ ఆడుతోంది. పైగా ధోనీ ఈ సీజన్ అంతా మైదానానికి దూరంగా ఉన్నాడు. అందుకే రిటైర్మెంట్ గురించి ధోనీ ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, అభిమానులు ఈ మ్యాచ్ను ఒక రకమైన ఫేర్వెల్ మ్యాచ్లా భావిస్తున్నారు.
