Hardik Pandya vs Jasprit Bumrah Argument: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ జట్టు వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్లలో ఒకటే గెలిచి.. నాలుగు పరాజయాలను చవిచూసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో విఫలమవుతున్న ముంబై.. పట్టికలో 9వ స్థానంలో ఉంది. వరుస వైఫల్యాల నేపథ్యంలో ముంబై జట్టు, కెప్టెన్ హార్దిక్ పాండ్యపై తీవ్ర విమ్మర్శలు వస్తున్నాయి. ఇది చాలదన్నట్లు ఆటగాళ్ల మధ్య సరైన సఖ్యత లేనట్లు తెలుస్తోంది. తాజాగా ముంబై, పంజాబ్ మ్యాచ్లో జరిగిన ఓ ఆసక్తికర ఘటన ఇందుకు మరింత బలమిస్తోంది. ఇది సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
కెప్టెన్ హార్దిక్ పాండ్య, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మధ్య ఫీల్డ్ సెట్టింగ్ విషయంలో చిన్న వాగ్వాదం జరిగింది. మ్యాచ్ సందర్భంగా బుమ్రా బౌలింగ్ చేస్తున్న సమయంలో హార్దిక్ ఫీల్డింగ్లో మార్పులు చేస్తూ సూచనలు ఇచ్చాడు. అయితే ఆ ఫీల్డ్ సెట్టింగ్ బుమ్రా ప్లాన్కు అనుకూలంగా లేదు. దీంతో బుమ్రా ఒక్కసారి తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. హార్దిక్తో చర్చకు దిగాడు. ఇద్దరి మధ్య కాసేపు సీరియస్ డిస్కషన్ జరిగింది. చివరకు కెప్టెన్ నిర్ణయానికే తలొగ్గిన బుమ్రా.. ఏమీ అందకుండా మళ్లీ బౌలింగ్ చేయడానికి వెళ్లిపోయాడు. అయితే బుమ్రా ముఖంలో నిరాశ మాత్రం స్పష్టంగా కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ముంబై జట్టులో సమన్వయం లోపించిందా?, ముంబైలో అంతా బాగానే ఉందా? అనే సందేహాలు అభిమానుల్లో కలుగుతున్నాయి.
ముంబై ఇండియన్స్ అంటే ఒకప్పుడు అద్భుతమైన టీమ్ స్పిరిట్, స్పష్టమైన ప్లానింగ్, సమన్వయానికి పేరుగాంచిన జట్టు. కానీ ప్రస్తుతం కనిపిస్తున్న ఇలాంటి ఘటనలు జట్టు లోపల ఏదో జరుగుతోందనే సంకేతాలు ఇస్తున్నాయి. వరుస ఓటములతో పాటు ఇలాంటి విభేదాలు జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపే అవకాశముంది. టాప్ స్టార్స్ అయిన హార్దిక్ పాండ్య, జస్ప్రీత్ బుమ్రా మధ్య జరిగిన ఈ సంఘటన ముంబై ఇండియన్స్ అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. జట్టు త్వరగా సమస్యలను పరిష్కరించుకుని.. మళ్లీ గెలుపు బాట పట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.