Virat Kohli React on IPL 2024 Strike-Rate: ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడిన విరాట్.. 500 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2024 ‘ఆరెంజ్ క్యాప్’ కోహ్లీ వద్దే ఉంది. బెంగళూరు తరఫున ప్రతి మ్యాచ్లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడినా.. కోహ్లీ ఆటతీరుపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ ఎడిషన్లో తక్కువ స్ట్రైక్రేట్తో పరుగులు చేస్తున్నాడనే విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా సన్రైజర్స్ హైదరాబాద్పై కోహ్లీ 43 బంతుల్లో 51 పరుగులు చేయడాన్ని మాజీలు తప్పుపట్టారు.
సన్రైజర్స్ హైదరాబాద్పై విరాట్ కోహ్లీ కొట్టిన హాఫ్ సెంచరీ ఎంతో విలువైనదే అయినా.. అతడి ఇన్నింగ్స్ చాలా నెమ్మదిగా సాగిందని టీమిండియా మాజీ దిగ్గజం, కామెంటేటర్ సునీల్ గవాస్కర్ అన్నారు. విరాట్ నుంచి జట్టు కోరుకుంటోంది ఇది కాదని, కోహ్లీ పెద్ద షాట్లను ప్రయత్నించాలన్నారు. తనపై వచ్చిన కామెంట్లపై గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్ అనంతరం కోహ్లీ తీవ్రంగా స్పందించాడు. స్ట్రైక్రేట్ తక్కువగా ఉందని కామెంట్లు చేసేవారికి ఆటపై పెద్దగా అవగాహన ఉండి ఉండదని ఎద్దేవా చేశాడు. బాక్స్లో కూర్చొని కామెంటరీ చేయడం సులువే అన్నాడు. బయట కూర్చొని కామెంట్లు చేసే చాలా మందికి మ్యాచ్ పరిస్థితి తెలియదని మండిపడ్డాడు.
Also Read: T20 World Cup 2024: న్యూజిలాండ్ ప్రపంచకప్ జట్టు ప్రకటన.. స్టార్లకు దక్కని చోటు!
‘స్పిన్ను సరిగ్గా ఆడలేనని, స్ట్రైక్రేట్ తక్కువగా ఉందని నాపై కామెంట్లు చేసేవారికి ఆటపై పెద్దగా అవగాహన ఉండి ఉండదు. ప్రతి మ్యాచ్లో విజయం కోసమే నేను కష్టపడతా. అందుకే 15 ఏళ్లుగా ఆటలో కొనసాగుతున్నా. మేం ప్రతి రోజూ జట్టు కోసం ఆలోచిస్తాం. బయట కూర్చొని కామెంట్లు చేసే వారికి మ్యాచ్ పరిస్థితి ఏంటో తెలియదు. అభిమానులు మా నుంచి ఇంకా మెరుగైన ప్రదర్శన ఆశిస్తారు. అందులో తప్పేం లేదు కానీ.. మ్యాచ్ ఎలాంటి స్థితిలో ఉందనేది కూడా మాకు చాలా కీలకం. ఉన్నతస్థాయిలో క్రికెట్ ఆడిన వారెవరూ విమర్శలు చేయరు. తెలిసీతెలియని వారే విమర్శలు చేస్తుంటారు. మేం ఆత్మగౌరవంతో మ్యాచ్లను ఆడతాం. బయట నుంచి వచ్చే కామెంట్లను నేను పెద్దగా పట్టించుకోను’ అని విరాట్ కోహ్లీ అన్నాడు.