ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యంత నిలకడైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్న టీమిండియా కీపర్ సంజు శాంసన్.. ఐపీఎల్ 2026 వేలానికి ముందు ట్రేడ్ డీల్ ద్వారా రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) నుంచి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)లోకి చేరాడు. అయితే కొత్త జట్టు సీఎస్కేతో ఆరంభం అతడికి కలిసి రాలేదు. తన మాజీ జట్టు రాయల్స్తో జరిగిన మొదటి మ్యాచ్లో సంజు కేవలం 6 పరుగులకే పెవిలియన్ చేరారు. ఆర్ఆర్ బౌలర్ నాంద్రే బర్గర్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ చివరి బంతికి క్లీన్ బౌల్డ్ అయి అభిమానులను నిరాశకు గురిచేశాడు. దాంతో సంజు ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసున్నాడు.
2020 నుంచి 2025 వరకు ప్రతి ఐపీఎల్ సీజన్ తొలి మ్యాచ్లలో సంజు శాంసన్ అద్భుతంగా ఆడాడు. ప్రతి మ్యాచ్లో అర్ధ శతకం లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేస్తూ ఒక అరుదైన రికార్డును కొనసాగించాడు. కానీ ఐపీఎల్ 2026 మొదటి మ్యాచ్లో 6 పరుగులకే అవుట్ అవ్వడంతో ఆ రికార్డుకు తెరపడింది. 2020లో సీఎస్కేపై 74 పరుగులు, 2021లో పంజాబ్ కింగ్స్పై 119 పరుగులు, 2022లో సన్రైజర్స్ హైదరాబాద్పై 55 పరుగులు, 2023లో మరోసారి సన్రైజర్స్పై 55 పరుగులు, 2024లో లక్నో సూపర్ జెయింట్స్పై 82 నాటౌట్, 2025లో సన్రైజర్స్ హైదరాబాద్పై 66 పరుగులు చేశాడు.
Also Read: Ravindra Jadeja: పింక్ కలర్ నాకు బాగా సూట్ అయింది.. దూబేను అలా బుట్టలో వేశా!
ఐపీఎల్ 2026 సీజన్కు ముందు సంజును రూ.18 కోట్ల భారీ మొత్తానికి సీఎస్కే కొనుగోలు చేసింది. యెల్లో జెర్సీలో అతడు ఎలా ఆడతాడో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అంతేకాదు 2026 టీ20 వరల్డ్ కప్లో అద్భుత ప్రదర్శన చేసిన సంజుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ తొలి మ్యాచ్లోనే తక్కువ స్కోర్ చేయడంతో అభిమానులు నిరాశ చెందారు. తొలి మ్యాచ్లోనే సంజు విఫలం కావడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ‘సంజుకు చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ కలిసి రాలేదా?’ అని కొందరు, ‘రాజస్థాన్ రాయల్స్లోనే సంజు బాగుండేవాడు’ అని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే తిరిగి ఫామ్లోకి వచ్చి భారీ ఇన్నింగ్స్ ఆడతాడని చెన్నై అభిమానులు ఆశిస్తున్నారు. సంజుకు ఐపీఎల్లో మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు 177 మ్యాచ్ల్లో 4704 పరుగులు చేశాడు.