Rohit Sharma: ఫామ్లో లేడు.. ఇక రిటైర్మెంట్ తప్పదు.. ఇదే చివరి మ్యాచ్.. ఇలా ఎన్నో ప్రచారాలకు ఒకే ఇన్నింగ్స్తో తెర దించాడు హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ మరోసారి తన క్లాస్ను నిరూపించాడు. 39 ఏళ్ల వయసులో, తన కెరీర్ ముగింపు దశకు చేరుకుందని, 2027 వన్డే ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కడం కష్టమనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్న సమయంలో లార్డ్స్ మైదానంలో 138 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఈ శతకం కేవలం ఒక వ్యక్తిగత మైలురాయి మాత్రమే కాదు.. తనపై వచ్చిన విమర్శలకు, రిటైర్మెంట్ చర్చలకు బ్యాట్తో ఇచ్చిన సమాధానంగా మారింది.
ఇంగ్లండ్తో జరిగిన తొలి రెండు వన్డేల్లో రోహిత్ శర్మ వరుసగా 11, 26 పరుగులకే పరిమితమయ్యాడు. దీంతో అతని ఫామ్పై సందేహాలు వ్యక్తమయ్యాయి. 2027 ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని భారత జట్టు మార్పుల దిశగా అడుగులు వేస్తోందని, సెలెక్టర్లు కూడా యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో లార్డ్స్ వన్డే రోహిత్కు కీలక పరీక్షగా మారింది.
388 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సిన ఒత్తిడి ఒకవైపు, తన భవిష్యత్తుపై జరుగుతున్న చర్చ మరోవైపు ఉన్నా, రోహిత్ మాత్రం తన సహజ శైలిని మార్చుకోలేదు. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్లపై ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. స్పిన్నర్లు కట్టడి చేయాలని ప్రయత్నించినా వారికి అవకాశం ఇవ్వలేదు. మొత్తం 110 బంతుల్లో 17 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 138 పరుగులు చేసి మరోసారి తన బ్యాటింగ్ క్లాస్ను చాటాడు. ఇక, ఈ ఇన్నింగ్స్లో ప్రత్యేకత కేవలం పరుగులు మాత్రమే కాదు. మ్యాచ్ అనంతరం రోహిత్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. సోషల్ మీడియాలో కూడా స్పందించలేదు. తన బ్యాట్నే సమాధానంగా నిలిపాడు. క్రికెట్లో గొప్ప ఆటగాళ్లు మాటలతో కాదు, ఆటతోనే సమాధానం చెబుతారనే విషయాన్ని మరోసారి నిరూపించాడు.
ఈ సెంచరీతో 2027 ప్రపంచకప్లో రోహిత్ స్థానం ఖాయమైందని ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. ఎందుకంటే జాతీయ జట్టులో ఎంపికకు ఫిట్నెస్, నిలకడైన ప్రదర్శన, జట్టు అవసరాలు వంటి అంశాలు కూడా కీలకమే. అయినప్పటికీ లార్డ్స్ ఇన్నింగ్స్ సెలెక్టర్ల ఆలోచనను మళ్లీ మార్చేలా చేసింది. ఇప్పటి వరకు “రోహిత్ను ఎప్పుడు తప్పించాలి?” అనే ప్రశ్న వినిపిస్తే, ఇప్పుడు “ఇలాంటి ఫామ్లో ఉన్న ఆటగాడిని ఎలా పక్కన పెడతారు?” అనే చర్చ మొదలైంది.
రోహిత్ శర్మ కెరీర్లో ఇప్పటికే ఎన్నో చారిత్రక ఇన్నింగ్స్ ఉన్నాయి. వన్డేల్లో ప్రపంచ రికార్డు 264 పరుగులు, ప్రపంచకప్ల్లో ఐదు సెంచరీలు, ఐసీసీ టోర్నీల్లో అద్భుత ప్రదర్శనలు అతని ఖాతాలో ఉన్నాయి. అయితే లార్డ్స్లో చేసిన ఈ 138 పరుగుల ఇన్నింగ్స్ గణాంకాల కంటే పరిస్థితుల పరంగా మరింత ప్రత్యేకంగా నిలిచింది. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో, వ్యక్తిగతంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో వచ్చిన ఈ శతకం అతని మానసిక దృఢత్వానికి నిదర్శనంగా నిలిచింది.
భారత క్రికెట్లో పరివర్తన దశ కొనసాగుతున్నప్పటికీ, అనుభవం ఎంత విలువైనదో రోహిత్ మరోసారి చూపించాడు. గొప్ప ఆటగాళ్లను కేవలం వయసుతో అంచనా వేయలేమని, వారి సామర్థ్యాన్ని నిర్ణయించేది క్యాలెండర్ కాదు.. బ్యాట్ అని ఈ ఇన్నింగ్స్ స్పష్టం చేసింది. భారత్ మ్యాచ్లో ఓడిపోయినా, రోహిత్ శర్మ లార్డ్స్లో ఆడిన 138 పరుగుల ఇన్నింగ్స్ మాత్రం చాలా కాలం పాటు క్రికెట్ అభిమానుల మదిలో నిలిచిపోతుంది. ఇది ఒక సెంచరీ మాత్రమే కాదు.. ‘నా కథ ఇంకా ముగియలేదు’ అని ప్రపంచానికి చెప్పిన ప్రకటనగా నిలిచింది.. ఎప్పుడు అవకాశం దొరికితే రోహిత్పై పడిపోదాం.. పని అయిపోయిందని ప్రచారం చేద్దాం.. విమర్శలు, ఆరోపణలు చేసేద్దాం అనుకునేవారికి మాత్రం.. ఇది మింగుడు పడకపోవచ్చు.. కానీ, హిట్ మ్యాన్ సూపర్ షో మాత్రం.. నాకు ఇంకా పరుగుల దాహం తీరలేదు.. రికార్డుల వేట ఆగలేదు.. అని స్పష్టం చేస్తోంది..

