IND vs ENG 1st ODI: భారత్–ఇంగ్లండ్ మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతోంది.. 2027 వన్డే ప్రపంచకప్కు సన్నాహకంగా ఇరు జట్లకూ ఈ సిరీస్ ఎంతో కీలకంగా మారింది. ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో జరిగిన టీ20 సిరీస్లలో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయిన టీమిండియా, ఈ వన్డే సిరీస్లో గెలుపుతో పుంజుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ సిరీస్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి రావడం భారత జట్టుకు పెద్ద బలంగా మారింది. కెప్టెన్ శుభ్మన్ గిల్తో పాటు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ వంటి బ్యాటర్లు భారత బ్యాటింగ్ను మరింత పటిష్టం చేస్తున్నారు. అయితే, హార్దిక్ పాండ్యా కాలి కండరాల గాయం కారణంగా ఈ సిరీస్కు దూరమయ్యాడు.
ఇక, టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు.. సొంతగడ్డపై ఆడుతున్న ఇంగ్లండ్ జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగింది. ముఖ్యంగా ఎడ్జ్బాస్టన్ వేదిక ఇంగ్లండ్కు అచ్చొచ్చిన మైదానంగా పేరుంది. 2014లో భారత్ చేతిలో ఓడిన తర్వాత ఈ వేదికపై ఇంగ్లండ్ ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఓడిపోలేదు. వరుసగా ఏడు వన్డేల్లో విజయం సాధించి అద్భుతమైన రికార్డును కొనసాగిస్తోంది.
ఇటీవల భారత్ వన్డేల్లో మిశ్రమ ఫలితాలను నమోదు చేసింది. జూలై 2024 నుంచి ఆడిన ఆరు ద్వైపాక్షిక వన్డే సిరీస్లలో మూడు గెలిచి, మూడు కోల్పోయింది. శ్రీలంక, ఆస్ట్రేలియా పర్యటనల్లో ఓటములు చవిచూడగా, స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో కూడా సిరీస్ కోల్పోయింది. దీంతో ఈ సిరీస్లో మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం టీమిండియాపై ఉంది.
ఇంగ్లండ్ తుది జట్టు: జాకబ్ బెతెల్, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), సామ్ కరన్, విల్ జాక్స్, జోఫ్రా ఆర్చర్, లియామ్ డాసన్, జోష్ టంగ్, ఆదిల్ రషీద్.
భారత్ తుది జట్టు: రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ.
ఈ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్లో ఆధిక్యం సాధించాలనే లక్ష్యంతో ఇరు జట్లు బరిలోకి దిగడంతో అభిమానులకు ఉత్కంఠభరితమైన పోరు కనిపించనుంది.

