India Won 3rd ODI Against Zimbabwe In Harare Sports Club: హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన మూడో మ్యాచ్లోనూ భారత్ విజయం సాధించి, సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. చివరివరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో భారత్ 13 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 289 పరుగులు చేయగా.. లక్ష్య చేధనకు దిగిన జింబాబ్బే 276 పరుగులకి ఆలౌటైంది. ఒకానొక దశలో ఈ మ్యాచ్ జింబాబ్వే గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ చివర్లో భారత బౌలర్లు బంతితో తమ మాయాజాలం చూపించి జింబాబ్వే బ్యాట్స్మన్లను అడ్డుకోవడంతో, మ్యాచ్ భారత్ వశమైంది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న భారత్.. ఆరంభం నుంచే బాగా రాణించింది. ఓపెనర్లు శుభారంభమే ఇచ్చారు. ఆ వెనువెంటనే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత వచ్చిన శుభ్మన్ గిల్ (97 బంతుల్లో 130 పరుగులు), ఇషాన్ కిషన్ (61 బంతుల్లో 50 పరుగులు) .. మరో వికెట్ పడకుండా భారీ భాగస్వామ్యమే జోడించారు. శుభ్మన్ సెంచరీతో విజృంభిస్తే, ఇషాన్ అర్థశతకంతో చిచ్చరపడిగులా చెలరేగిపోయాడు. ఆచితూచి ఆడుతూ.. వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లు బాదారు. శుభ్మన్కి ఇది తొలి అంతర్జాతీయ శతకం. వీళ్లిద్దరు క్రీజులో కుదురుకోవడం వల్లే.. భారత్ 289 పరుగులు చేయగలిగింది. మిగతా బ్యాట్స్మన్లు కనీసం ప్రయత్నం చేయకుండానే పెవిలియన్ చేరారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఇవాన్స్ ఐదు వికెట్లతో అదరహో అనిపించాడు.
ఇక 290 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన జింబాబ్వే.. మొదట్లో కాస్త తడబడింది. ఓపెనర్లు వెంటనే ఔటయ్యారు. సీన్ విలియన్స్ కాసేపు క్రీజులో కుదుర్కొని.. జట్టుకి ఊపు తీసుకొచ్చాడు. ఇక సికందర్ రాజా భారత బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడనే చెప్పుకోవాలి. ఒకవైపు జింబాబ్వే వికెట్లు పడుతున్నా.. అతడు ఒత్తిడికి లోనవ్వకుండా పరుగుల వర్షం కురిపిస్తూ వచ్చాడు. చివర్లో ఇతనికి బ్రాడ్ ఇవాన్స్ కాసేపు తోడు ఇవ్వడంతో.. జింబాబ్వేనే మ్యాచ్ గెలుస్తుందని అంతా అనుకున్నారు. అయితే.. భారత బౌలర్లు స్వల్ప వ్యవధిలోనే ఆ ఇద్దరిని ఔట్ చేయడంతో మ్యాచ్ టర్న్ తీసుకుంది. 13 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఫలితంగా.. 3-0 తేడాతో భారత్ సిరీస్ నెగ్గింది.