ఐర్లాండ్తో జరిగిన రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే! ముఖ్యంగా.. రెండో మ్యాచ్ అయితే ఉత్కంఠభరితంగా సాగింది. చివరి వరకూ ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఫైరల్గా భారత్ 4 పరుగుల తేడాతో రికార్డ్ విజయం నమోదు చేసింది. ఇదే సమయంలో ఓ చెత్త రికార్డ్ కూడా తన ఖాతాలో వేసుకుంది. భారత్ ఇన్నింగ్స్లో ముగ్గురు ఆటగాళ్లు గోల్డెన్ డకౌట్ అవ్వడమే ఆ చెత్త రికార్డ్. దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్లు తొలి బంతికే ఔటై పెవిలియన్ బాట పట్టారు. ఓ ఇన్నింగ్స్లో టీ20ల్లో టీమిండియా తరఫున ఇన్ని గోల్డెన్ డకౌట్లు నమోదు కావడం ఇదే తొలిసారి.
కాగా.. రెండో టీ20 మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. దీపక్ హుడా (57 బంతుల్లో 104; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) అద్భుతమైన శతకంతో చెలరేగగా.. సంజూ శాంసన్ (42 బంతుల్లో 77; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్థసెంచరీతో రప్ఫాడించాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ అద్భుతమైన పోరాటపటిమ కనబర్చింది కానీ.. ఆఖరి బంతి వరకు వచ్చి ఓటమిపాలైంది. ఆఖరి బంతికి 6 పరుగులు కావాల్సి ఉండగా.. ఉమ్రాన్ మాలిక్ అద్భుతంగా బౌల్ చేసి కేవలం ఒక్క పరుగే ఇచ్చాడు. దీంతో.. ఐర్లాండ్ ఓడిపోయింది. 20 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు 5 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది.