శ్రీలంకతో మార్చి 4 నుంచి ఆరంభమయ్యే తొలి టెస్టు టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీకి ఎంతో ప్రత్యేకంగా నిలవనుంది. దానికి కారణం ఆ మ్యాచ్ ద్వారా కోహ్లీ టెస్టుల్లో 100వ మ్యాచ్ ఆడనున్నాడు. టెస్టుల్లో 100వ మ్యాచ్ ఆడటం ఏంటే ఎంతో ప్రత్యేకం. దిగ్గజ ప్లేయర్లకు సైతం టెస్టుల్లో 100 మ్యాచ్ ఆడటం సాధ్యం అయ్యే పని కాదు. అయితే శ్రీలంకతో జరిగే ఈ టెస్టు ద్వారా కోహ్లీ ఈ ఘనతను అందుకోనున్నాడు.
ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. మొహాలీ వేదికగా జరిగే తొలి టెస్టుకు స్టేడియంలోకి 50శాతం మంది ప్రేక్షకులను అనుమతించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. బుధవారం నుంచి ఈ మ్యాచ్ టికెట్లను ఆన్లైన్లో విక్రయించనున్నారు. కరోనా కారణంగా స్టేడియంలోకి అభిమానులకు అనుమతి లేదని మొదట ప్రకటించారు. దీంతో కోహ్లీ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే తాజా నిర్ణయంతో వాళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రేక్షకులను అనుమతించే విషయమై పంజాబ్ క్రికెట్ సంఘంతో చర్చించామని, కోహ్లీ కెరీర్ లో ముఖ్యమైన 100వ టెస్టుకు ప్రేక్షకులను అనుమతించడంపై వారు సానుకూలంగా స్పందించారని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు.
