Site icon NTV Telugu

IND vs ENG: నేటి నుంచే ఇంగ్లాండ్‌తో భారత్‌ ఆఖరి టెస్టు.. సమమా.. సమర్పణమా!

Ind Vs Eng

Ind Vs Eng

IND vs ENG: ఇంగ్లండ్‌- భారత్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ చివరి దశకు చేరుకుంది. ఇరు జట్ల మధ్య ఇవాళ్టి నుంచి ఓవల్‌ స్టేడియంలో ఐదో టెస్టు జరగనుంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 2–1తో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. భారత్‌ ఈ మ్యాచ్‌లో గెలిస్తే 2–2తో సిరీస్‌ సమం అవుతుంది.. మ్యాచ్‌ గెలిచినా లేక ‘డ్రా’ అయినా ‘అండర్సన్‌–టెండూల్కర్‌ ట్రోఫీ’ సిరీస్‌ను ఇంగ్లండ్‌ కైవసం చేసుకుంటుంది. జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్‌ లేకపోవడంతో పాటు పలు మార్పులతో భారత్‌ రెడీ కాగా, ఇక, బెన్ స్టోక్స్‌ దూరం కావడంతో పాటు నాలుగు మార్పులతో ఇంగ్లండ్‌ రంగంలోకి దిగుతుంది. 2007లో ఇంగ్లండ్‌ గడ్డపై సిరీస్‌ గెలిచిన తర్వాత ఆడిన నాలుగు సిరీస్‌లనూ భారత్‌ ఓడిపోయింది. ఓవల్‌లో గెలిస్తే సమంగా నిలిచి సగర్వంగా స్వదేశానికి టీమిండియా చేరవచ్చు.

Read Also: Bomb Threat: పాకిస్తాన్ నుంచి భారత్ పై బాంబు దాడి చేస్తాం.. హౌసింగ్ సొసైటీ గోడపై బెదిరింపు సందేశాలు

అయితే, ఈ సిరీస్‌కు ముందు అనుకున్నట్లుగానే బుమ్రా మూడు టెస్టులే ఆడాడు. అతని స్థానంలో మరో పేసర్‌ ఆకాశ్‌దీప్‌ ఆడటం ఫిక్స్ అయింది. గత టెస్టులో పూర్తిగా విఫలమైన అన్షుల్‌ కంబోజ్‌ను కూడా జట్టు నుంచి తప్పించి ప్రసిధ్‌ కృష్ణను తుది టీమ్‌లోకి తీసుకోనున్నారు. వీరితో పాటు సిరాజ్‌ పేస్‌ బౌలింగ్‌ను ముందుండి నడిపించనున్నారు. ఓవల్‌ పిచ్, వాతావరణాన్ని బట్టి చూస్తే స్పిన్నర్‌ల కంటే పేసర్‌లకే ఎక్కువగా సహకరిస్తుంది. పైగా ముందే చెప్పినట్లు టీమిండియా స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ కంటే బ్యాటింగ్‌ చేయగలిగే ఆటగాడికే అధిక ప్రాధాన్యం ఇస్తుంది. అదే జరిగితే గత మ్యాచ్‌లో విఫలమైనా సరే.. శార్దుల్‌కే మరో ఛాన్స్ దొరికే అవకాశం ఉంది. లేదంటే అర్ష్ దీప్‌ సింగ్‌ టెస్టుల్లో అరంగేట్రం చేసే ఛాన్స్ కూడా ఉంది. ఎలా చూసినా ‘చైనామన్‌ స్పిన్నర్‌’ కుల్దీప్‌ యాదవ్‌ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడకుండానే ఈ సిరీస్‌ను ముగించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రిషబ్ పంత్‌ స్థానంలో గత రెండు టెస్టుల్లో సబ్‌స్టిట్యూట్‌గా చేసిన ధృవ్ జురేల్‌ తుది జట్టులోకి రానున్నాడు.

Read Also: Astrology: జులై 31, గురువారం దినఫలాలు

ఇక, బ్యాటింగ్‌కు సంబంధించి టీమిండియా సానుకూల స్థితిలో ఉంది. ఈ సిరీస్‌లో టాప్‌–5 పరుగుల జాబితాలో గిల్, రాహుల్, జడేజా కొనసాగుతున్నారు. ఈ ముగ్గురూ మరో సారి సత్తా చాటితే భారత్ భారీ స్కోరు చేయడం ఖాయం. యశస్వి జైస్వాల్‌ కాస్త మెరుగ్గా ఆడాల్సిన అవసరం ఉండగా, సాయి సుదర్శన్‌ కూడా రాణించడం చాలా అవసరం ఉంది. వాషింగ్టన్ సుందర్‌ తన బ్యాటింగ్‌ పదునేమిటో ఇప్పటికే మాంచెస్టర్‌లో ప్రత్యర్థి జట్టుకు చూపించాడు. ఓల్డ్‌ ట్రఫోర్డ్‌ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 143 ఓవర్ల పాటు ఫీల్డింగ్‌ చేసి ఇంగ్లాండ్‌ జట్టు బాగా అలసిపోయింది. కోలుకునేందుకు 3 రోజుల విరామం సరిపోదు. అటు శారీరకంగా, ఇటు మానసికంగా కూడా ఆ టీమ్ కాస్త ఇబ్బందుల్లో ఉండగా.. ఇలాంటి పరిస్థితిలో కెప్టెన్ బెన్‌ స్టోక్స్‌ భుజం గాయంతో మ్యాచ్‌ నుంచి తప్పుకోవడం ఆ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పుకోవాలి.

Read Also: Pawan Kalyan: మరోసారి పవన్ కళ్యాణ్ మంచి మనసు.. 222 కుటుంబాలకు రగ్గుల పంపిణి!

కానీ ఈ మ్యాచ్‌ కూడా బెన్ స్టోక్స్ ఆడితే గాయం మరింత ముదిరే ప్రమాదం ఉండటంతో దూరంగా ఉన్నాడు. సారథిగా, బ్యాటర్‌గా కూడా ఓలీ పోప్‌ ప్రభావం చూపించాల్సిన అవసరం ఉంది. క్రాలీ, బెన్ డకెట్‌ శుభారంభం ఇవ్వాల్సిన అవసరం ఉండగా, జో రూట్‌ బ్యాటింగ్‌ ఆ జట్టుకు ప్రధాన బలం. గత టెస్టులో విఫలమైన హ్యారీ బ్రూక్‌ ఇక్కడ రాణించాలనే పట్టుదలతో ఉండగా.. ఆరో ప్లేస్ లో బెతెల్‌కు ఛాన్స్ దొరికింది. అయితే, ఇంగ్లాండ్‌ బౌలింగ్‌ ఒక్కసారిగా బలహీనంగా ఉంది. జోఫ్రా ఆర్చర్, కార్స్‌లకు రెస్ట్ ఇవ్వగా.. గత టెస్టులో మొత్తం విఫలమైన స్పిన్నర్‌ డాసన్‌ను ముందే పక్కన పెట్టేశారు. నాలుగు టెస్టుల్లో కేవలం 10 వికెట్లు తీసిన వోక్స్‌ మళ్లీ బౌలింగ్‌ భారాన్ని మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిగతా ముగ్గురు పేసర్లలో టంగ్‌కు మళ్లీ ఛాన్స్ దక్కగా… అట్కిన్సన్, ఓవర్టన్‌లకు సిరీస్‌లో ఇదే తొలి మ్యాచ్‌ కావడం గమనర్హం.

Exit mobile version