Dhoni gets supreme courts notice in arbitration proceedings against Amrapali Group:
ఆమ్రపాలి గ్రూప్ కేసులో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు సూచించిన మధ్యవర్తిత్వాన్ని నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. గతంలో ఆమ్రపాలి కన్స్ట్రక్షన్ కంపెనీకి ధోనీ బ్రాండ్ అంబాసిడర్గా పనిచేశాడు. అయితే ఆ సమయంలో తనకు రావాల్సిన రూ.40 కోట్ల పారితోషికాన్ని ఆమ్రపాలి కంపెనీ ఎగ్గొట్టిందని ఆరోపిస్తూ 2019 మార్చిలో ధోనీ సుప్రీంకోర్టు ఆశ్రయించాడు. ఈ మేరకు ధోనీ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు ఆమ్రపాలి గ్రూప్పై మధ్యవర్తిత్వ ప్రక్రియను ప్రారంభించింది. ధోనీ బ్రాండ్ను ప్రమోట్ చేస్తున్న రితి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (RSMPL)తో ఆమ్రపాలి గ్రూప్ ‘షామ్ ఒప్పందాలు’ కుదుర్చుకుని ఇంటి కొనుగోలుదారుల సొమ్మును అక్రమంగా మళ్లించిందని సుప్రీంకోర్టు నియమించిన ఫోరెన్సిక్ ఆడిటర్లు హైకోర్టు ధర్మాసనానికి తెలిపారు. 2009-2015 మధ్యకాలంలో RSMPLకి పలువురు ఇంటి కొనుగోలుదారులు రూ.42.22 కోట్లు చెల్లించారని వివరించారు.
Read Also: State Bank Of India: ఎస్బీఐ యూజర్లకు అలర్ట్.. రూ.10వేలకు మించి ఏటీఎంలో విత్డ్రా చేస్తున్నారా?
కాగా ఆమ్రపాలి, దాని డైరెక్టర్లకు నిరుపయోగంగా ఉన్న ఆస్తులను విక్రయించడం ద్వారా 700 కోట్ల రూపాయలను ఎలా సమకూర్చుకోవచ్చో అన్వేషించాలని నోయిడా, గ్రేటర్ నోయిడా అధికారులను ఢిల్లీ హై కోర్టు కోరింది. గృహ కొనుగోలుదారులపై అనవసరంగా భారం పడకూడదని పేర్కొంది. ప్రాజెక్టుల నిర్మాణానికి లోటును తీర్చేందుకు గృహ కొనుగోలుదారులు తమ ఫ్లాట్ల కోసం చదరపు అడుగుకు రూ. 200 చొప్పున అదనపు మొత్తాన్ని విధించవద్దని సూచించింది. మరోవైపు ఆమ్రపాలి కంపెనీ మాత్రం ధోనీ తమకు రూ.42 కోట్లు చెల్లించాలని వాదిస్తోంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాగా జనవరి 2019లో నిలిచిపోయిన రెండు ఆమ్రపాలి హౌసింగ్ ప్రాజెక్ట్లను పూర్తి చేసే ప్రక్రియను ప్రారంభించడానికి ప్రభుత్వ యాజమాన్యంలోని నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ (NBCC)కి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది.