జింబాబ్వేపై ఎదురైన అనూహ్య పరాజయంపై శ్రీలంక కెప్టెన్ దాసున్ షనక తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. సొంత గడ్డపై టీ20 ప్రపంచకప్లో జరిగిన మ్యాచ్లో జింబాబ్వేపై ఓడిపోవడం నిజంగా అవమానకరమని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్లో ఓడిపోతామని తాను కలలో కూడా ఊహించలేదని చెప్పాడు. లంక జట్టు ప్రదర్శనపై షనక అసంతృప్తి వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్లో భాగంగా గురువారం కొలంబోలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో లంక 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 179 పరుగుల లక్ష్యాన్ని జింబాబ్వే మరో మూడు బంతులు ఉండగానే ఛేదించింది.
‘బ్యాటింగ్లో మాకు మంచి ఆరంభం లభించింది. నిజం చెప్పాలంటే.. మేము చేసిన స్కోరు డిఫెండ్ చేయడానికి సరిపోతుందని మేము అనుకున్నాం. మ్యాచ్లో ఇంకాస్త మెరుగ్గా రాణించాల్సి ఉండేది. పాతుమ్ నిస్సాంక, పవన్ రత్నాయకే ఆట పట్ల నేను సంతోషంగా ఉన్నాను. ఈ పిచ్లో 178 పరుగులు మంచి స్కోర్. దురదృష్టవశాత్తు మాకు బౌలింగ్లో మంచి ఆరంభం దక్కలేదు. బౌలింగ్, ఫీల్డింగ్ రెండూ చాలా దారుణంగా ఉన్నాయి. ముఖ్యంగా ఫీల్డింగ్లో చేసిన తప్పిదాలు మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేశాయి. ఇలాంటి ప్రదర్శనతో గెలవడం అసాధ్యం. జట్టు అన్ని విభాగాల్లో మెరుగుపడాల్సిన అవసరం ఉంది’ అని దాసున్ షనక చెప్పాడు.
Also Read: IND Playing 11 vs SA: దక్షిణాఫ్రికాతో సూపర్-8 మ్యాచ్.. టీమిండియాలో ఊహించని మార్పు?
‘మా నిర్ణయాలలో కొన్ని తప్పులు జరిగాయి. ఈ రోజు చమీరకు విశ్రాంతి ఇచ్చాము. ఈ ఓటమికి ఎలాంటి సాకులు చెప్పడం లేదు. ఓటమిని నిజాయిగా ఒప్పుకుంటున్నా. సొంత గడ్డపై, అదీనూ టీ20 ప్రపంచకప్లో ఓడిపోవడం నిజంగా అవమానకరం. ఈ ఓటమిపై తీవ్ర నిరాశలో ఉన్నాం. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని సూపర్ ఎయిట్ దశలో మంచి క్రికెట్ ఆడుతాం. ప్రత్యర్థి జట్టు జింబాబ్వే అద్భుతంగా ఆడింది. వారి ఆటతీరు అద్భుతంగా ఉంది’ అని దాసున్ షనక తెలిపాడు. మొత్తంగా ఈ మ్యాచ్ జట్టుకు గట్టి హెచ్చరికగా మారిందని, ముందున్న మ్యాచ్ల్లో తప్పకుండా మెరుగైన ప్రదర్శన ఇస్తామని షనక చెప్పుకొచ్చాడు.