T20 World Cup: T20 ప్రపంచ కప్ వివాదాలకు కేంద్రంగా మారింది. భారత్లో భద్రతా కారణాలు చూపుతూ, బంగ్లాదేశ్ ఆడటానికి నిరాకరించింది. తమ వేదికను శ్రీలంకకు మార్చాలని కోరింది. దీంతో ఐసీసీ బంగ్లాదేశ్ను టోర్నీ నుంచి బహిష్కరించింది. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ను తీసుకుంది. అయితే, బంగ్లాదేశ్కు మద్దతుగా భారత్ మ్యాచ్ బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ), ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది.
ఇదిలా ఉంటే, క్రికెట్ చరిత్రలోనే అత్యంత విలువైన మ్యాచ్గా పేరున్న భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ రుద్దు అయితే, ఇది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ), ఇతర దేశాల క్రికెట్ బోర్డు వార్షిక ఆదాయాలపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో శ్రీలంక వంటి కొన్ని బోర్డులు పాకిస్తాన్ను భారత్తో ఆడాలని కోరుతున్నాయి. ఇదే సమయంలో పాక్, భారత్ మ్యాచ్ను బాయ్కాట్ చేస్తే పీసీబీకి తీవ్ర ఆర్థిక నష్టంతో పాటు న్యాయపరమైన చిక్కులు ఏర్పడే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే, ఈ సమస్యను పరిష్కరించడానికి ఐసీసీ చేయబోయే అత్యవసర సమావేశానికి కొన్ని గంటల ముందు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్(బీసీబీ) అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం బుల్బుల్ లాహోర్ వెళ్లారు. పాకిస్తాన్ పీసీబీ చీఫ్ మోహ్సిన్ నక్వితో భేటీ అయ్యారు. దీంతో, ఈ బాయ్కాట్ వివాదానికి ఏదో ఒక ముగింపు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Read Also: Shocking Wedding Twist: పెళ్లి మండపంలో ఊహించని ట్విస్ట్.. రూపాయి కట్నం తీసుకొని వివాహం!
భారత్-పాక్ మ్యాచ్ ప్రపంచంలోనే అత్యధిక ఆదాయ వచ్చే క్రీడాపోటీ. ఈ మ్యాచ్ రద్దు అయితే ఐసీసీకి బ్రాడ్కాస్ట్ నష్టం, స్పాన్సర్ షిప్, ప్రకటనల విలువ పడిపోతుంది. మొత్తం టోర్నమెంట్ కమర్షియల్గా దెబ్బతింటుంది. ఇది జరగకుండా ఉండేందుకు ఐసీసీ సీఈఓ సన్జోగ్ గుప్తా, పాక్ బంగ్లాదేశ్ బోర్డులతో జూమ్ ద్వారా అత్యవసర చర్చలు జరపబోతున్నారు.
అయితే, తమను బహిష్కరించినందుకు భారత్తో మ్యాచ్ ఆడకపోవడంపై పాక్కు బంగ్లాదేశ్ థాంక్స్ చెబుతోంది. మొత్తం టోర్నమెంట్ను రెండు దేశాలు రాజకీయ వివాదంగా మార్చాయి. బంగ్లాదేశ్ లోని యూనస్ తాత్కాలిక ప్రభుత్వం పాక్తో సంబంధాలు పెంచుకుంది. భారత్లో మ్యాచ్ ఆడకపోవడంలో కూడా ఆ దేశ రాజకీయాలు ముడిపడి ఉన్నాయి. ఇప్పుడుకలిసి ఉంటే భవిష్యత్తులో రాజకీయ, దౌత్య ప్రయోజనాలు ఉండొచ్చని రెండు దేశాలు భావిస్తున్నాయి. ఇటీవల బంగ్లాదేశ్ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్, పాకిస్తాన్కు బహిరంగంగా ‘‘థాంక్యూ పాకిస్తాన్’’ అని చెప్పారు.