భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), సెలక్షన్ కమిటీ మధ్య గత కొంతకాలంగా విభేదాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో.. అగార్కర్ కొనసాగింపుపై త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం అగార్కర్తో బీసీసీఐ పెద్దలు ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు సమాచారం. అగార్కర్ ప్రస్తుత కాంట్రాక్ట్ సెప్టెంబర్లో ముగియనుంది. 2027 వన్డే ప్రపంచ కప్కు ఇంకా ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో ఆయనను కొనసాగించాలా? లేదా కొత్త చీఫ్ సెలెక్టర్ను నియమించాలా? అనే అంశంపై బీసీసీఐ చర్చించనున్నట్లు తెలుస్తోంది. గతంలో అగార్కర్ కాంట్రాక్ట్ను బీసీసీఐ పొడిగించిన విషయం తెలిసిందే.
గత కొన్ని నెలలుగా అజిత్ అగార్కర్కు సంబంధించి రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాలని అగార్కర్ ఒత్తిడి తెచ్చారనే ప్రచారం జరిగింది. 2027 వన్డే ప్రపంచ కప్ను దృష్టిలో పెట్టుకుని జట్టులో యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు వార్తలు వచ్చాయి. రోహిత్ ఇప్పటికే టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికినా.. వన్డేల్లో మాత్రం కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లోని లార్డ్స్ మ్యాచ్నే రోహిత్కు చివరి మ్యాచ్గా భావించినప్పటికీ.. అతడు అద్భుతమైన సెంచరీతో తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్తోనే సమాధానం చెప్పాడు.
రోహిత్ స్థానంలో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ను తీసుకురావాలనే ఆలోచన సెలక్షన్ కమిటీలో ఉన్నట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, అజిత్ అగార్కర్ మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయనే ప్రచారం మరింత ఊపందుకుంది. అగార్కర్ చీఫ్ సెలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత జట్టు ఎంపికలో యువ ప్రతిభకు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోందనే అభిప్రాయం ఉంది. మరోవైపు సీనియర్ ఆటగాళ్లను వయసు ఆధారంగా పక్కన పెట్టే విషయంలో సెలక్షన్ కమిటీ వైఖరిపై కూడా చర్చ జరుగుతోంది.
దాదాపు 40 ఏళ్లకు చేరువైన రోహిత్ శర్మను 2027 ప్రపంచ కప్ ప్రణాళికల్లో కొనసాగించాలా? లేదా భవిష్యత్ జట్టును ఇప్పటి నుంచే నిర్మించాలా? అనే అంశం బీసీసీఐ, సెలక్షన్ కమిటీ మధ్య కీలక చర్చగా మారినట్లు తెలుస్తోంది. బీసీసీఐ నిర్వహించిన పనితీరు సమీక్ష సమావేశానికి అగార్కర్ హాజరు కాకపోవడం కూడా కొత్త ఊహాగానాలకు కారణమైంది. సెప్టెంబర్ 3న జరిగిన ఈ సమావేశానికి ఆయన గైర్హాజరు కావడంతో బీసీసీఐ, సెలక్షన్ కమిటీ మధ్య విభేదాలు మరింత ముదిరాయనే ప్రచారం జరిగింది. తాజాగా ‘స్పోర్ట్స్టార్’ కథనం ప్రకారం.. అగార్కర్, బీసీసీఐ కార్యవర్గ సభ్యులు త్వరలో సమావేశమై ఆయన కాంట్రాక్ట్ పొడిగింపుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాబోయే రెండు రోజుల్లో ఇరువర్గాల మధ్య చర్చలు జరిగి, చీఫ్ సెలెక్టర్గా అగార్కర్ కొనసాగింపుపై రోడ్మ్యాప్ రూపొందించనున్నట్లు సమాచారం.

