AB de Villiers on Vaibhav Sooryavanshi Debut: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం ఎప్పుడా? ఆమె అంశంపై ప్రపంచ క్రికెట్లో తీవ్ర చర్చ జరుగుతోంది. 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శన చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన వైభవ్కు ఇప్పటివరకు భారత జట్టులో అవకాశం రాకపోవడంపై పలువురు మాజీ క్రికెటర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ కూడా ఈ అంశంపై స్పందిస్తూ.. భారత జట్టు మేనేజ్మెంట్ ఆలోచనతో తాను ఏకీభవించడం లేదని స్పష్టం చేశాడు. బుడ్డోడికి ఐర్లాండ్ సిరీస్లోనే ఛాన్స్ ఇవ్వాల్సిందని, అలా చేయని బీసీసీఐ పెద్ద తప్పు చేసిందని ఏబీడీ అభిప్రాయపడ్డాడు.
వైభవ్ సూర్యవంశీని వెంటనే జట్టులోకి తీసుకోవాలా? లేదా కొంతకాలం వేచి చూడాలా? అనే విషయంలో మాజీ క్రికెటర్లు రెండు వర్గాలుగా విడిపోయారు. రవిశాస్త్రి, మైకేల్ వాన్, అలిస్టర్ కుక్ వంటి దిగ్గజాలు ఐర్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లోనే వైభవ్కు అరంగేట్రం చేసే అవకాశం ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డారు. మరోవైపు భారత మాజీ ఆటగాళ్లు చేతేశ్వర్ పుజారా, సబా కరీమ్ మాత్రం సీనియర్ ఆటగాళ్లను పక్కనబెట్టి వైభవ్కు అవకాశం ఇవ్వడం సరైన నిర్ణయం కాదని అంటున్నారు.
భారత సహాయ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే ఇటీవల మాట్లాడుతూ.. వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నాడనే విషయంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నాడు. అయితే టీ20 ప్రపంచకప్ 2026 విజయంలో కీలక పాత్ర పోషించిన సంజు శాంసన్ వంటి ఆటగాళ్లకు తగినంత అవకాశాలు ఇవ్వాల్సిన బాధ్యత తమపై ఉందని స్పష్టం చేశాడు. వైభవ్ ప్రతిభపై తమకు పూర్తి నమ్మకం ఉందని, కానీ అతడూ మిగతా ఆటగాళ్లలాగే అరంగేట్ర ప్రక్రియను అనుసరించాల్సిందే అని స్పష్టం చేశాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా వైభవ్ కోసం సీనియర్ ఆటగాళ్లను పక్కన పెట్టలేం అని చెప్పుకొచ్చాడు.
అయితే ర్యాన్ టెన్ డస్కటే వ్యాఖ్యలతో ఏబీ డివిలియర్స్ విభేదించాడు. తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ.. ఐర్లాండ్ సిరీస్ వైభవ్కు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టడానికి సరైన వేదిక అని అభిప్రాయపడ్డాడు. ‘వైభవ్ను ఎప్పుడు మైదానంలోకి దింపుతారు?. ఐర్లాండ్ సిరీస్ అతడికి అంతర్జాతీయ అరంగేట్రంకు అద్భుతమైన అవకాశం. కానీ దురదృష్టవశాత్తూ అతడికి ఒక్క మ్యాచ్లో కూడా అవకాశం ఇవ్వలేదు. ప్రతి ఆటగాడిలాగే వైభవ్ కూడా అరంగేట్రం ప్రక్రియను అనుసరించాలని చెప్పడం నాకు సరైన వాదనగా అనిపించడం లేదు. ఐపీఎల్లో అతడు చేసిన ప్రదర్శన తర్వాత ఐర్లాండ్ లాంటి చిన్న జట్టుపై ఆడించి అనుభవం కల్పించాల్సింది’ అని ఏబీ డివిలియర్స్ పేర్కొన్నాడు.
ఐర్లాండ్ చేతిలో 0-2తో సిరీస్ కోల్పోయిన భారత జట్టు.. ఇంగ్లండ్ పర్యటనలో కూడా ఇంకా విజయాన్ని నమోదు చేయలేదు. తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో జట్టు ఇంకా విజయ ఖాతా తెరవలేదు. భారత జట్టు ఇంగ్లండ్ పరిస్థితులకు అనుగుణంగా తమ ఆటతీరును మార్చుకోవాలని ఏబీ డివిలియర్స్ సూచించాడు. ‘టీమిండియా ఇంకా చాలా విషయాల్లో మెరుగుపడాల్సి ఉంది. ఇంగ్లండ్ పరిస్థితుల్లో ఐపీఎల్ తరహాలో 250-260 పరుగుల స్కోర్లు రావు. అక్కడ ప్రతి పరుగూ విలువైనదే. కొన్ని సందర్భాల్లో 140-160 పరుగుల స్కోరే మ్యాచ్ గెలిపించడానికి సరిపోతుంది. అందుకే వ్యూహాత్మకంగా, తెలివిగా ఆడాల్సిన అవసరం ఉంది’ అని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. రెండో టీ20లో అయినా బుడ్డోడికి అవకాశం దక్కుతుందా? అని ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

