మాస్ మహారాజ్ రవితేజ మేనల్లుడుగా జగమెరిగిన సత్యం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు అవినాష్ వర్మ. ఆద్య రెడ్డి హీరోయిన్ గా నటించగా తిరుపతి పాలే దర్శకత్వం వహించారు. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమాను అమృత సత్యనారాయణ క్రియేషన్స్ బ్యానర్ పై అచ్చ విజయ భాస్కర్ నిర్మించారు. అన్ని హంగులు పూర్తి చేసుకును నేడు గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది. మరి రవితేజ మేనల్లుడు ఏ మేరకు మెప్పించాడో తెలుసుకుందాం రండి.
కథ:
తెలంగాణలోని ఓ చిన్న ఊరులో సత్యం (అవినాష్ వర్మ) అనే యువకుడు జీవిస్తున్న జీవితం ఆధారంగా కథ సాగుతుంది. అతని జీవితం సాదాసీదాగా కనిపించినా, ఆ లోతుల్లో ఆత్మవిస్వాసం, ప్రేమ, బాధ, త్యాగం మిళితమై ఉంటాయి. సత్యం కథ కేవలం ఒక వ్యక్తి గాథ కాదు… అది ఒక ఊరి జీవితం, ఒక భూమి మనసు. సత్యం చుట్టూ నడిచే పాత్రలన్నీ మనం ఎక్కడో ఓ మూల చూసినట్టే ఉంటాయి. చిన్న చినమ్మతో అతని బంధం, గ్రామంలోని రాజకీయాలు, మనిషి విలువలపై వచ్చిన సవాళ్లు ఇవన్నీ కథలో బలంగా రూపుదిద్దుకున్నాయి. తెలంగాణ మట్టికి వాసన ప్రతి సీన్లోనూ ఊరి వాతావరణం, భాష, ఆచారాలు చూపించిన విధానం బాగుంది. సినిమా ఆసాంతం పల్లెటూరు వాతావరణంలో జరగడంతో ఆ పాత కాలపు రోజులను మరొకసారి గుర్తు చేసినట్టు అనిపించింది. సత్యం జీవితంలో వచ్చిన తిరుగుబాటు, తాను నిలిచిన విలువలు, చివరికి ఊరిని ఒక కొత్త దిశలో తీసుకెళ్లే అతని కృషిని దర్శకుడు ఎంగేజింగ్ గా తెరకెక్కించారు. క్లైమాక్స్లో వచ్చే ఎమోషనల్ హైపాయింట్ సినిమాకు కీలకం. సత్యం ఏడిచినప్పుడు సినిమా చూసే ఆడియెన్ లో నీళ్లు రావడం గ్యారెంటీ. అంతటి బలమైన భావోద్వేగంతో కథ ముగుస్తుంది.
విశ్లేషణ:
“జగమెరిగిన సత్యం” సినిమా ఓ జీవన చిత్రణ. ఇందులో కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్.. గ్లామర్ షో ఉండకపోవచ్చు, కానీ తాను నమ్మిన కథను నిజాయితీగా తెరపై మలిచాడు దర్శకుడు. కథ, పాత్రలు, నటన, సినిమాటోగ్రఫీ తమ తమ భాద్యతను చక్కగా నిర్వర్తిచారు. డైలాగ్స్ బాగున్నాయి. అయితే ఇలాంటి సినిమాలో ఉండే మేజర్ డ్రాబ్యాక్ స్లో టేకింగ్. కొన్ని సన్నివేశాలలో మరి సాగతీసిన ఫీలింగ్ కలుగుతుంది. అలానే హీరో పాత్రతో పాటు మిగిలిన నటీనటుల పాత్రలో మరింత డెప్త్ ఉంటే బాగుండేది. చిన్న సినిమా అని చూడకుండా నిర్మాత బాగా ఖర్చు పెట్టాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సురేష్ బొబ్బిలి సంగీతం ఓకే. అవినాష్ వర్మ తొలిసినిమా అయినా మెప్పించాడు.
చివరిగా : మెచ్చుకోదగ్గ ప్రయత్నం ఈ “జగమెరిగిన సత్యం”