ఆ జిల్లాలో జరిగిన పల్లెపోరులో టీడీపీ సాధించుకున్న పంచాయతీల కంటే.. మంత్రి ఇలాకాలో సైకిల్ పాగా వేసిన స్థానాలపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఎక్కడ తేడా కొట్టిందో అధికారపార్టీ వర్గాలకు అంతు చిక్కడం లేదట. అసలే కష్టకాలంలో ఉన్న అమాత్యునికి ఇప్పుడీ షాక్ ఏంటని చెవులు కొరుక్కుంటున్నాయి పార్టీ వర్గాలు.
మంత్రి జయరాం నియోజకవర్గంలో టీడీపీ పాగా!
అసెంబ్లీ ఎన్నికల మాదిరే.. పంచాయతీ ఎన్నికల్లోనూ వార్ వన్సైడ్ అనుకున్నారు వైసీపీ నాయకులు. కానీ.. అధికారపార్టీ నేతలకు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యి టీడీపీ బొమ్మ కనిపించింది. ముఖ్యంగా జిల్లా మంత్రి గుమ్మనూరు జయరాం నియోజకవర్గం ఆలూరులో గణనీయంగానే పాగా వేసింది టీడీపీ. ఆలూరు మేజర్ పంచాయతీతోపాటు టీడీపీ మద్దతుదారులు చెప్పుకోదగ్గ స్థానాల్లో గెలిచారు. పంచాయతీ ఎన్నికల్లో మంత్రి ఎంపిక చేసిన వైసీపీ అభ్యర్థులపై చాలాచోట్ల రెబల్స్ పోటీ చేశారు. దీంతో అక్కడ పోటీ చేసిన టీడీపీ వర్గీయులు మధ్యేమర్గంగా లాభం పొందినట్టు తెలుస్తోంది.
మంత్రిపైనా.. మంత్రి అనుచరులపైనా వ్యతిరేకత ఉందా?
ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 108 పంచాయతీలు ఉన్నాయి. వీటిల్లో 11చోట్లే వైసీపీ అనుచరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలు జరిగిన 97 పంచాయతీలలో 67 వైసీపీ ఖాతాలో పడగా.. టీడీపీ 27చోట్ల గెలిచింది. మూడుచోట్ల ఇతరులు సత్తా చాటారు. వైసీపీ గెలుపొందిన 67లో దాదాపు 15 స్థానాలు వైసీపీ రెబల్స్ గెలుచుకున్నవే. మంత్రి జయరాం సొంతూరు గుమ్మనూరు పంచాయతీని ఏకగ్రీవంగా గెలుపొందినా.. ఆయన నివాసం ఉండే ఆలూరు మేజర్ పంచాయితీని మాత్రం గెలిపించుకోలేకపోయారు. ఈ ఓటమికి కారణాలను వైసీపీ వర్గాలు రకరకాలుగా విశ్లేషిస్తున్నాయి. మంత్రి అనుచరులతోపాటు మంత్రిపై ఉన్న వ్యతిరేకత వల్లే ఆలూరు మేజర్ పంచాయతీని టీడీపీ గెలుచుకుందని తేల్చారట.
టీడీపీ బలపడిందా? టీడీపీని గెలిపించారా?
ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా స్థానికంగా ఉన్న పరిస్థితుల కారణంగా వైసీపీ ఎక్కువ పంచాయతీలలో ఓడిపోయిందట. గుమ్మనూరులో పేకాట రగడ, నియోజకవర్గంలో విచ్చలవిడిగా కర్ణాటక మద్యం వ్యాపారం వంటివి కూడా వైసీపీ ఓటమికి కారణమట. మంత్రి అనుచరగణం ప్రజలతో వ్యవహరిస్తున్న తీరు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించిందట. మొత్తమ్మీద కర్నూలు జిల్లాలో అన్ని నియోజకవర్గాలకంటే మంత్రి ప్రాతినిథ్యం వహించే ఆలూరుపైనే చర్చ జోరందుకుంది. టీడీపీ బలపడిందా? లేక టీడీపీని గెలిపించారా? మంత్రి పట్టుకొల్పోయారా ? అని వివిధ వర్గాలు ఆరా తీస్తున్నాయట.
మంత్రి ఇంకాస్త ఎఫర్ట్ పెడితే ఇంకోలా ఉండేదా?
జిల్లాలో పరిస్థితి ఎలా ఉన్నా.. ఆలూరులో అయినా కాస్త ఎఫర్ట్ పెట్టి ఉంటే ఈరోజు జయరాం చర్చల్లో ఉండేవారు కాదని వైసీపీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. వరుస వివాదాలు చుట్టుముడుతున్న సమయంలో పంచాయతీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు ఎటు నుంచి ఎటు దారితీస్తాయో అని అనుచరులు ఆందోళన చెందుతున్నారట. మరి.. మంత్రి అదృష్టం ఎలా ఉందో చూడాలి.