అమ్మ పలుకు.. జగదాంబ పలుకులపై వైసీపీ నేతలకు గురి పెరిగిందా? మంత్రి పదవి ఆశిస్తున్నవారంతా ఉత్తరాంధ్రలో ఎక్కడో మారు మూల ప్రాంతంలోఉన్న ఓ పల్లెటూరుకు క్యూ కడుతున్నారా? ఇంతకీ ఆ గ్రామంలో ఏముంది? వైసీపీ నేతలకు ఎందుకంత నమ్మకం?
దేవుడమ్మ లలిత ఆశీసుల కోసం రోజా రాక..!
ఎక్కడో చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యేగా ఉన్న రోజా.. ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లా మక్కువ మండలం పాపయ్య వలస గ్రామంలో ఒక్కసారిగా తళుక్కుమన్నారు. పార్టీ ప్రచారానికి వచ్చారని అనుకోవడానికి ఇప్పుడేమీ విజయనగరం జిల్లాలో ఎన్నికలు లేవు. కానీ.. రోజా వచ్చిన ఉద్దేశం వేరు. పాపయ్య వలసలో దేవుడమ్మ లలిత అనే మహిళ ఆశీసుల కోసం వచ్చారమె. ఒక్క రోజానే కాదు.. వైసీపీలో ముఖ్యులు అనుకున్నవారికి ఈ ప్రాంతం సుపరిచితమే. ఇక్కడ దేవుడమ్మ లలిత ఆశీసులు తీసుకుంటే రాజకీయంగా ఉన్నత పదవులు పొందొచ్చన్నది వారి నమ్మకం. అందుకే రోజాతోపాటు మంత్రి పదవి ఆశిస్తున్న వైసీపీ కీలక నాయకులు ఇటీవల పాపయ్య వలసలో వాలిపోతున్నారు.
2019 ఎన్నికల్లో వైసీపీకి 150 సీట్లు వస్తాయని చెప్పారట..!
దేవుడమ్మ లలితకు అమ్మవారు ఆవహిస్తారని.. ఆ సమయంలో ఆమె చెప్పింది నిజం అవుతుందని స్థానికులు అనుకుంటూ ఉంటారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మను పార్టీ నేతలు ఇక్కడికి తీసుకొచ్చారట. ఎన్నికల్లో వైసీపీ 150 సీట్లు వస్తాయని దేవుడమ్మ లలిత చెప్పడం.. ఫలితాలు కూడా అదే విధంగా ఉండటంతో.. వైసీపీ నేతలకు పాపయ్య వలసపై నమ్మకం కుదిరింది. అప్పటి నుంచి అధికారపార్టీ నేతల రాక పెరిగింది. మంత్రి పదవి కావాల్సిన వారు.. రాజకీయంగా మంచి పొజిషన్ ఆశిస్తున్న వారు ఈ గ్రామానికి వచ్చి దేవుడమ్మ లలితను ప్రశ్న అడుగుతున్నారట.
దేవుడమ్మ లలిత ఆశీసులకోసం నేతల ఆరాటం..!
మంత్రి పదవి ఆశిస్తున్న స్పీకర్ తమ్మినేని సీతారాం.. బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి.. ఇలా చాలా మంది దేవుడమ్మ లలిత ఆశీసులు పొందినవారేనట. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కూడా వస్తుంటారని చెబుతున్నారు. వైసీపీ నుంచి గెలిచి.. టీడీపీలో చేరి.. రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిడ్డి ఈశ్వరి రాజకీయ భవిష్యత్పై ఒకింత ఆందోళనతో ఉన్నారట. అందుకే దేవుడమ్మ లలిత ఆశీసులు తీసుకున్నట్టు సమాచారం.
ఆశీసులు తీసుకుని నవ్వుతూ వెళ్తున్న నేతలు..!
దసరా ఉత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రం రోజున స్పీకర్ తమ్మినేనితోపాటు.. ఎమ్మెల్యే రోజా కూడా పాపయ్య వలసకు వచ్చారు. మరి.. అమ్మ ఆశీసులు ఏంటో.. తెలియదు కానీ.. నవ్వుతూ బయటకొచ్చి.. కారెక్కి వెళ్లారని చెబుతున్నారు స్థానికులు. మొదటి విడతలోనే కేబినెట్లో చోటు దక్కుతుందని ఆశించిన రోజా, తమ్మినేనిలు ఈసారి ఛాన్స్ వస్తుందలే అని కామ్గా ఉంటే లాభం లేదనుకున్నారో ఏమో.. దేవుడమ్మ లలిత వాక్కుపై నమ్మకం పెట్టుకున్నారు. మరి.. అంబ పలుకుల వల్ల ఎంత మందికి కేబినెట్ బెర్త్ దొరుకుతుందో చూడాలి.