Om Prakash Chautala : అందరి టార్గెట్ 2024 ఎన్నికలే. ఢిల్లీ పీఠం లక్ష్యంగా ఐక్యతా రాగం ఆలపించేందుకు విపక్ష పార్టీలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీకి అడ్డుకట్ట వేయడానికి వ్యూహాలు పదునెక్కుతున్నాయి. ఈ నెలలోనే ఓ భారీ కార్యక్రమానికి హర్యానా వేదిక కాబోతోంది. ఆ ప్రోగ్రామ్కు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేదెవరు? ఎవరికి ఆహ్వానాలు అందాయి?
కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు భారత్ జోడో పేరుతో రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీయేతర పక్షాల్లో ఐక్యత తీసుకొచ్చేందుకు బీహార్ సీఎం నితీష్కుమార్ వివిధ పార్టీల నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యామ్నాయ అజెండా పేరుతో జాతీయ పార్టీ ఏర్పాటుకు తెలంగాణ సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు. అందరి లక్ష్యం ఒక్కటే. కేంద్రంలో బీజేపీని అడ్డుకోవడం.. 2024లో బీజేపీ యేతర ప్రభుత్వాన్ని ఢిల్లీ గడ్డపై ఏర్పాటు చేయడం. ఇంత వరకు మాటలు.. మంత్రాంగాలతో కాలం గడిచిపోయింది. వచ్చే ఎన్నికల నాటికి ఈ ప్రయత్నాలు ఎంత వరకు కొలిక్కి వస్తాయో ఏమో.. ఈలోగా విపక్షాలకు హర్యానా పెద్ద పరీక్ష కాబోతుందనే చర్చ మొదలైంది. ఈ నెల 25న హర్యానాలో INLD అధ్యక్షుడు, మాజీ సీఎం ఓంప్రకాష్ చౌతాలా నిర్వహించే సమ్మాన్ దివస్ ర్యాలీపై అందరి దృష్టీ నెలకొంది. దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీయేతర పార్టీలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు చౌతాలా. ఆహ్వానాలు అందుకున్న పార్టీలు ర్యాలీకి వస్తాయా? తెలుగు రాష్ట్రాల నుంచి ఏ పార్టీలు హాజరు కాబోతున్నాయి అనేది ప్రస్తుతం చర్చగా మారింది.
సమ్మాన్ దివస్ ర్యాలీలో పాల్గొనాలని తెలంగాణ సీఎం కేసీఆర్తోపాటు.. టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా ఆహ్వానాలు పంపారట చౌతాలా. ఈ ఇద్దరిలో సీఎం కేసీఆర్.. బీజేపీపై తీవ్రస్థాయిలో పోరాటం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ పలువురు ముఖ్యమంత్రులను, మాజీ సీఎంలను, జాతీయ పార్టీల నాయకులను కలిసి మాట్లాడుతున్నారు. సమ్మాన్ దివస్ ర్యాలీకి టీఆర్ఎస్ వెళ్తుందా లేదా అనే చర్చ ఉంది. ఇక టీడీపీ విషయానికి వస్తే.. 2018లో NDAకు గుడ్బై చెప్పింది. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించిన దాఖలాలు లేవు. NDAలో టీడీపీ చేరుతుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో హర్యానాలో నిర్వహించే సమ్మాన్ దివస్ ర్యాలీకి టీడీపీ వెళ్తుందా.. లేదా అనే ఆసక్తి ఉంది.
దేశవ్యాప్తంగా బీజేపీ యేతర పార్టీలను ఏకం చేసేందుకు రాష్ట్రపతి ఎన్నికల సమయంలో బెంగాల్ సీఎం మమతాబెనర్జీ కొంత ప్రయత్నించారు. ఆ తర్వాత NCP చీఫ్ శరద్ పవార్ దానిని కొనసాగించారు. ఆనాటి సమావేశాల్లో ఐక్యతారాగం ఆలపించిన కొన్ని పార్టీలు వివిధ సమీకరణాల వల్ల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైఖరి మార్చుకున్నాయి. ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్, బీహార్ సీఎం నితీష్కుమార్ విపక్షాల ఐక్యతకు కృషి చేస్తున్నారు. ఈ ప్రయత్నాలను ఏకతాటిపైకి తెచ్చే పనులు సాగుతున్నాయట. నితీష్కుమార్, చౌతాలా ఇటీవల ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. మమతా బెనర్జీ కూడా కొన్ని సూచనలు చేసినట్టు సమాచారం. కేవలం ఇద్దరు ముగ్గురితో కాకుండా అందరితో సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చిందట. అలా పుట్టుకొచ్చిందే సమ్మాన్ దివాస్ ర్యాలీ. హర్యానాలో నిర్వహించేందుకు చౌతాలా ముందుకు కావడంతో.. 25న జరిగే ఆ కార్యక్రమంపై ఆసక్తి పెరుగుతోంది. మరి… తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరు వెళ్తారో చూడాలి.