మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్రావు.. మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి. ఇద్దరూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలు. వేర్వేరు వర్గాలు. తూర్పు.. పడమర ప్రాంతాలకు చెందిన నాయకులు. మహేశ్వర్రెడ్డి ప్రస్తుతం AICC కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్గా ఉన్నారు. ఇన్నాళ్లూ అంతర్గత కలహాలతో ఎడముఖం పెడముఖంగా ఉన్న ఇద్దరూ.. ప్రస్తుతం యుగళగీతం ఆలపించడం పార్టీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. అధిష్ఠానం ఒత్తిడో ఏమో ఇద్దరూ ఒకే లైన్లోకి వచ్చారు.
ఇలాంటి సమయంలో ప్రేమ్ సాగర్రావు చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇకపై గ్రూపులు ఉండబోవని.. ఉమ్మడి జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యమని చెప్పారు. ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న ఆదివాసీ మహిళలను పరామర్శించేందుకు ఎమ్మెల్యే సీతక్కతోపాటు మహేశ్వర్రెడ్డి, బలరాం నాయక్, ప్రేమ్సాగర్ రావు వర్గం కలిసి రావడం కొత్త పరిణామంగా చెబుతున్నారు. ఒకప్పుడు పేర్లు పలకడానికే ఇష్టపడని నాయకులు ఇప్పుడు దోస్త్ మేరా దోస్త్ అన్నట్టు కలిసిపోయారట.
ఇటీవల జరిగిన నవ సంకల్ప్ సమావేశంలో ప్రేమ్ సాగర్రావు, మహేశ్వర్రెడ్డి మధ్య సయోధ్య కుదిరినట్టు సమాచారం. ఆ తర్వాత ఇద్దరు నేతలు కలిసి ఉన్న ఫొటోలు వైరల్ అయ్యాయి. కలహాలు ఎందుకు.. కలిసి నడుద్దామని అక్కడే డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. సయోధ్యకు AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్తోపాటు AICC కార్యదర్శి శ్రీనివాస కృష్ణన్ చొరవ తీసుకున్నట్టు చెబుతున్నారు. తమ మధ్య ఎలాంటి పంచాయితీ లేదని మహేశ్వర్రెడ్డి ఆ తర్వాత చేసిన ప్రకటన.. ప్రేమ్ సాగర్రావు స్టేట్మెంట్ ఒకే టోన్లో ఉండటం చర్చగా మారింది.
పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డితోనూ ఇద్దరు నేతలకు గ్యాప్ ఉండటంతో.. శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సూత్రం వర్కవుట్ అయినట్టు మరికొందరు విశ్లేషిస్తున్నారు. ప్రేమ్సాగర్రావు, మహేశ్వర్రెడ్డి కలిసి మీడియా ముందుకు వస్తారని ప్రచారం జరుగుతోంది. ఆ దృశ్యం ఎలా ఉంటుందో అని రకరకాలుగా విశ్లేషిస్తున్నారు పార్టీ కార్యకర్తలు. ఈ మార్పు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్కు బలం చేకూరుస్తుందా? ఎన్నికల వరకు ఇలాగే కలిసి ఉంటారా అనే సందేహాలు కేడర్లో లేకపోలేదట. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.