కాంగ్రెస్లో అంతే..! ఒకరంటే ఇంకొకరికి గిట్టదు. నువ్వెంత అంటే.. నీకంటే తక్కువ..! నాకేంటి అనుకుంటారు. ఇప్పుడా ఆ సీన్ మారుతుందా? వస్తారని అనుకున్న వాళ్లు డుమ్మా కొడుతున్నారా? రారని అనుకున్నవాళ్లు వచ్చి ఆశ్చర్యపరుస్తున్నారా?
ఎంపీ కోమటిరెడ్డి వస్తారని ఎవరికీ తెలియదా?
తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన వరి దీక్ష కాంగ్రెస్లో అనేక రాజకీయాలకు వేదికైంది. దీక్షకు పీసీసీ కసరత్తు చేసినప్పుడు పార్టీ కార్యక్రమాలకు రెగ్యులర్గా వచ్చేవాళ్లు వస్తారు అని అనుకున్నారు.
ఈ జాబితాలో లేని వ్యక్తి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన రారనే అంతా భావించారట. దీక్ష మొదలయ్యాక కూడా ఎవరికీ క్లారిటీ లేదట. దీక్షా శిబిరంలో సీనియర్ నాయకుడు VH మాట్లాడుతున్నప్పుడు.. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వస్తారా.. లేదా? అనే చర్చ ఉంది కదా అని ప్రశ్నించారట. దాంతో వెంకన్న కూడా వచ్చేస్తున్నారు అని ఆయన ప్రకటన చేసే వరకు ఎవరికీ తెలియదట. చివరకు పీసీసీ రేవంత్రెడ్డికి కూడా…!
వరి దీక్షకు వచ్చి వెంకటరెడ్డి ట్విస్ట్ ఇచ్చారా..?
రేవంత్రెడ్డి పీసీసీ చీఫ్ అయిన సమయంలో కొత్త సారథితోపాటు పార్టీ ఇంఛార్జ్ ఠాగూర్పై వివాదాస్పద కామెంట్స్ చేశారు ఎంపీ వెంకటరెడ్డి. ఆ తర్వాత హుజురాబాద్ ఉపఎన్నిక పలితాలపై ఆయన చేసిన కామెంట్స్ సైతం పార్టీని ఇరకాటంలో నెట్టాయి. దీనికితోడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. పార్టీ నాయకులతో అంటీ ముట్టనట్టు ఉంటూ వచ్చారు. ఇకపై నియోజకవర్గానికే పరిమితం అని ప్రకటించేశారు కూడా. ఈ పరిణామాలతో రేవంత్రెడ్డి, కోమటిరెడ్డిలు కలిసి వేదిక పంచుకునే అవకాశాల్లేవని పార్టీ వర్గాలు డిసైడ్ అయ్యాయి. ఈ చర్చ జరుగుతున్న సమయంలో ట్విస్ట్ ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీ.
నాయకులంతా కలిసిపోయినట్టుగా ఫొటోలకు ఫోజులు..!
ఇందిరాపార్క్ దీక్షకు ముందు రోజు.. తన క్యాడర్కి smsలు పంపించారు ఎంపీ కోమటిరెడ్డి. అందరూ రావాలని కోరారట. ఆ విధంగా దీక్ష మొదటిరోజు 12 గంటల సమయంలో తన క్యాడర్తో ర్యాలీగా ఇందిరా పార్క్ దీక్ష వేదిక మీదకు వచ్చారాయన. రాత్రి బస కూడా ఇందిరా పార్క్లోనే. అప్పటి వరకు ఎడముఖం.. పెడముఖంగా ఉన్న రేవంత్.. కోమటిరెడ్డిలను ఫొటోలలో బంధించేందుకు అంతా పోటీపడ్డారు. నాయకులు సైతం అంతా కలిసిపోయినట్టుగా ఫొటోలకు ఫోజులిచ్చారు.
దీక్షా శిబిరం దగ్గర కూడా నేతల మధ్య పోటీ..!
దీక్షా వేదిక దగ్గర రిఫ్రెష్ అవ్వడానికి రేవంత్రెడ్డి కోసం కార్వ్యాన్ బుక్ చేశారు. రాత్రి అయ్యాక… రేవంత్కి ధీటుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కార్వ్యాన్ తెప్పించారు. ఇలా ఒకరికి ఒకరు పోటా పోటీగా ప్రదర్శన ఇచ్చినట్టు అయ్యింది. కేడర్ మాత్రం.. దీక్ష శిబిరం వద్ద కోమటిరెడ్డి జిందాబాద్ అని నినదిస్తూ కాసేపు హడావుడి చేసింది. దీక్ష ముగిశాక..వేదిక నుంచి ఇద్దరూ ఒకరి వెనక ఒకరు తమ కాన్వాయ్లో వెళ్లిపోయారు. వాస్తవానికి రారు అనుకున్న కోమటిరెడ్డి రావడం పార్టీలో పెద్ద చర్చగా మారింది. వస్తారు అనుకున్నవారు హ్యాండివ్వడమూ అంతే చర్చకు దారితీస్తోంది. ఎవరి వాదన ఎలా ఉన్నా.. ఇకపై గొడవలు పక్కనపెట్టి ఐక్యంగా పనిచేస్తామని ప్రకటించారు నాయకులు.మరి.. వారి మాటలు నీటిమీద రాతలావుతాయో.. నిజంగానే కలిసి పనిచేస్తారో చూడాలి.