ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే క్లారిటీకి వచ్చినట్టే వస్తారు.. ఇంతలోనే కొత్త స్టేట్మెంట్ ఇస్తారు. ఎదుటివారికే కన్ఫ్యూజన్. ఇప్పుడు మరింత స్పష్టత కోసం ఫోకస్ పెట్టారట. కలిసి నడుస్తారో లేక.. కాదూ కూడదనే అంటారో కానీ.. ఢిల్లీ భేటీలతో పార్టీలో చర్చగా మారారు.
ఢిల్లీ డెవలప్మెంట్తో చర్చల్లోకి వచ్చిన రాజగోపాల్రెడ్డి!
రాజకీయ వ్యూహాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ ఎత్తుగడ ఎవరికీ అంతు చిక్కదు. వాళ్ల వరకు క్లారిటీతో ఉంటారో లేదో.. కేడర్ మాత్రం కన్ఫ్యూజ్లో ఉంటుంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఇటీవల మునుగోడులో జరిగిన రభసతో కొంత స్పష్టత ఇచ్చారు. ఇన్నాళ్లూ బీజేపీని ఆకాశానికి ఎత్తుతూ.. కాంగ్రెస్పై విమర్శలు చేసిన ఆయన.. మంత్రి జగదీష్రెడ్డితో జరిగిన వివాదంలో కాంగ్రెస్ క్యాడర్ను మళ్లీ కదిలించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకువచ్చేలా పనిచేస్తామని కామెంట్స్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచారు. ఆ చర్చ జరుగుతుండగానే.. మునుగోడు నియోజకవర్గంలో షర్మిల చేసిన దీక్షకు మద్దతు పలికి.. ఆయనంతే ఎవరికీ అర్థంకారనే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇంతలో ఢిల్లీలో మరో డెవలప్మెంట్ జరగడంతో మళ్లీ చర్చలోకి వచ్చారు రాజగోపాల్రెడ్డి.
ఢిల్లీలో రేవంత్తో రాజగోపాల్రెడ్డి భేటీ?
తెలంగాణ కాంగ్రెస్కు కొత్త పీసీసీ వచ్చాక రాజగోపాల్రెడ్డి వైఖరి మార్చుకున్నట్టు అనుమానిస్తున్నాయి పార్టీ వర్గాలు. ఇటీవలే ఢిల్లీ వెళ్లిన ఆయన.. అక్కడ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డితో భేటీ అయ్యారట. కాంగ్రెస్లో కలిసి పనిచేయడానికి చర్చించినట్టు చెబుతున్నారు. సుదీర్ఘంగా సాగిన సమావేశంలో.. రాష్ట్ర, జిల్లా రాజకీయాలు వారి మధ్య చర్చకు వచ్చాయట. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మాజీ మంత్రి జానారెడ్డి ఒక్కరికే రేవంత్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాస్త దూరంగానే ఉంటున్నారు. మరో ఎంపీ.. పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కూడా సైలెంట్ అయ్యారు. మిగిలింది రాజగోపాల్ రెడ్డే. అందుకే ఢిల్లీలో రేవంత్… రాజగోపాల్ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.
బీజేపీ నాయకుడితోనూ రహస్య మంతనాలు?
సోదరులను వదులు కోకూడదన్న ఆలోచనలో పీసీసీ!
రేవంత్రెడ్డిలో భేటీ వరకు బాగానే ఉన్నా.. బీజేపీలో కీలకంగా పనిచేస్తున్న ఓ నాయకుడితోనూ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సమావేశం కావడం కలకలం రేపుతోంది. రేవంత్తో సమావేశం తర్వాత జరిగిన ఈ భేటీ కొత్త చర్చకు ఆస్కారం కల్పిస్తోంది. పాత పరిచయాలతో కలిశారా లేక.. ఇంకేదైనా రాజకీయ ఎత్తుగడ వేస్తున్నారా అన్నది తెలియడం లేదట. రాజగోపాల్ రెడ్డి టీం మాత్రం.. కాంగ్రెస్ తోనే కలిసి నడవడానికి సిద్ధమైనట్టు చెబుతోంది. ఇతర పార్టీల నాయకులతో జరిగిన భేటీలో రాజకీయ అజెండా లేదన్నది వారి వాదన. ఏదైనా రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ అడుగులు మిస్టరీగానే ఉండిపోయాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ సోదరుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. కాకపోతే పీసీసీ కొత్త టీమ్ మాత్రం సోదరులను దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేస్తోందట. అన్న బెట్టు వీడకపోయినా.. తమ్ముడు దారికొస్తారనే నమ్మకంతో ఉందట రేవంత్ అండ్ కో. మరి ఏం జరుగుతుందో చూడాలి.