ఈ మధ్యకాలంలో పరస్పరం ఫిర్యాదులు.. ఆరోపణల డోస్ తెలంగాణ కాంగ్రెస్లో ఎక్కువైంది. పార్టీ అధిష్ఠానం కూడా రాష్ట్రంలో ఏం జరుగుతుందో.. వాస్తవాలు తెలుసుకునే పనిలో పడింది. ఇందుకు ప్రియాంకగాంధీ చొరవ తీసుకోవడం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ క్రమంలో వారిని పిలవడం వెనక వ్యూహం ఏంటనే చర్చ సాగుతోంది.
తెలంగాణ కాంగ్రెస్లో మొన్నటి వరకు ఆరోపణలు.. విమర్శలు చేసుకున్న నేతల నోళ్లు సడెన్గా మూత పడ్డాయి. AICC ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎంట్రీ ఇవ్వడమే దానికి ప్రధాన కారణమన్నది పార్టీ వర్గాల వాదన. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టేందుకు అవసరమైతే మరింత సమయం కేటాయిస్తానని ఆమె చెప్పడంతో.. మున్ముందు మరిన్ని కీలక పరిణామాలు ఉంటాయనే చర్చ నడుస్తోంది.
సీనియర్ కాంగ్రెస్ నేతలతో భేటీ తర్వాత.. రాష్ట్రంలో అసలేం జరుగుతుందో తెలుసుకునే పనిలో ఉన్నారట ప్రియాంక గాంధీ. ఇటీవల ఢిల్లీలో ఎనిమిది మంది సీనియర్ నేతలతో జరిగిన సమావేశంలో ఒక్కో నాయకుడికి 10 నుంచి 15 నిమిషాల సమయం కేటాయించారట. అందరూ తన సమస్యలు చెప్పుకున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఆ జాబితాలో ఉన్నారు. అన్నీ విన్నాక… ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకొంటున్నారని గ్రహించిన ఆమె.. రాష్ట్ర పార్టీ ఇంఛార్జులుగా ఉన్న ముగ్గురు AICC కార్యదర్శులు నదీం జావెద్, రోహిత్ చౌధరి.. బోసురాజులను ఢిల్లీకి పిలిచారట ప్రియాంక గాంధీ.
నదీంజావెద్, రోహిత్ చౌధరి ఇటీవలే ఇంఛార్జులుగా తెలంగాణకు వచ్చారు. వచ్చీ రావడంతోనే కొందరు కాంగ్రెస్ నేతలతో మాట్లాడారు. ఆపై ఒక నివేదికను కూడా ప్రియాంక గాంధీకి అందజేసినట్టు తెలుస్తోంది. ముగ్గురు AICC కార్యదర్శుల్లో బోసురాజు సీనియర్. ఎవరినీ నొప్పించకుండా పని చేసుకుపోతున్నారు. అందుకే నదీం జావెద్, రోహిత్ చౌధరిలు ఇచ్చిన నివేదికను విశ్వాసంలోకి తీసుకున్నట్టు సమాచారం. వారికే కూపీ లాగే బాధ్యతలు కూడా అప్పించారట.
తెలంగాణ కాంగ్రెస్లో సమన్వయ లోపంపైనే ఎక్కువ ఫోకస్ చేశారట. సీనియర్ల మధ్య సమన్వయం లేకపోవడం ఒకటైతే.. పీసీసీ చీఫ్కు వారి నుంచి సహకారం లేదని ప్రియాంక గాంధీకి అందజేసిన నివేదికలో తేల్చారట. పార్టీలో కొందరు నాయకులు.. పీసీసీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్టు రిపోర్ట్లో ప్రస్తావించారట. తెలంగాణలో కాంగ్రెస్కు సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ.. నాయకులే ఎవరికి వారు యమునా తీరే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారని AICC కార్యదర్శులు తేల్చేశారట. పార్టీ కూడా మూడు గ్రూపులుగా చీలిపోయిట్టు తెలిపారట. పీసీసీకి అనుకూల వర్గం.. పీసీసీని వ్యతిరేకించే వర్గం.. పీసీసీ చీఫ్ పదవి ఆశించి భంగపడిన వర్గం ఇలా ఎవరికివారు చీలిపోయినట్టు గుర్తించారట.
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్పై కూడా అన్ని వివరాలు నివేదిక రూపంలో ప్రియాంకగాంధీకి అందజేశారట. పార్టీ నేతలను సమన్వయం చేయడంలో ఠాగూర్ వైఫల్యం చెందారనే ఫీలింగ్ నేతల్లో ఉంది. దానికితోడు ఆయన తీరు కూడా ఇబ్బందిగా ఉందనేది చాలా మంది నాయకుల అభిప్రాయం. AICC కార్యదర్శుల ముందు ప్రధానంగా రెండు అంశాలను బలంగా ప్రస్తావించారట రాష్ట్ర నేతలు. అందులో ఠాగూర్ ఇంఛార్జిగా వ్యవహరించాల్సిన స్థాయిలో ఆయన తీరు లేదనే అభిప్రాయం వ్యక్తమైందట. పార్టీ నేతల మధ్య పంచాయితీలు పూసగుచ్చినట్టు చెప్పేశారట. దీంతో మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహం మొత్తం ప్రియాంకగాంధీ రెడీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. పీసీసీతోపాటు.. ఢిల్లీ భేటీకి వెళ్లిన 8 మంది సీనియర్లకు ప్రియాంకగాంధీ పని విభజన చేస్తారని తెలుస్తోంది. అప్పుడే ఎవరి సత్తా ఏంటీ? పనిచేస్తోంది ఎవరు? పంచాయితీ పెడుతోంది ఎవరో తేలిపోతుందనే లెక్కల్లో ఉన్నారట ప్రియాంకగాంధీ. మరి ఈ చికిత్స ఏ మేరకు ఫలితాన్నిస్తుందో చూడాలి.