OTR: తుపాకి వదిలి ప్రజాస్వామ్య బాటలో.. దేవ్ జీ పొలిటికల్ ఎంట్రీపై చర్చ

  • మాజీ మావోయిస్ట్‌లందర్నీ ఒకే వేదిక మీదికి తెచ్చే ప్లాన్‌
  • బ్యాలెట్‌ వార్‌లో ఐక్య పోరాటాలకు సమాయత్తం
  • సీపీఐ మావోయిస్ట్‌ పేరు మీద కొనసాగుతున్న నిషేధం
  • అదే పేరుతో రాజకీయ కార్యకలాపాలు ఎలా సాధ్యం?
  • ఇప్పటికీ మాది సీపీఐ మావోయిస్ట్‌ పార్టీ అంటున్న దేవ్‌జీ
Otr

Otr

OTR: బుల్లెట్‌ నుంచి బ్యాలెట్‌ వైపు మాజీ మావోయిస్టుల అడుగులు పడుతున్నాయా..? కొత్త పార్టీ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? మాది ఇప్పటికీ సీపీఐ మావోయిస్ట్‌ పార్టీనే అన్న దేవ్‌ జీ వ్యాఖ్యల ఆంతర్యం ఏంటి? సరెండర్‌ అయ్యాక కూడా ఇంకా మావోయిస్ట్‌ పార్టీ మాదేనని అనడాన్ని ఎలా చూడాలి? కేంద్ర కమిటీ మాజీ సభ్యుల ఆలోచన ఎలా ఉంది? ఆపరేషన్‌ కగార్‌ తర్వాత మావోయిస్ట్‌ల స్థితిగతులు పూర్తిగా మారిపోయాయి. భారీ లొంగుబాట్లు, కొన్ని ఎన్‌కౌంటర్స్‌తో మొత్తంగా ఉనికే ప్రశ్నార్ధకమైంది. అయితే… లొంగిపోయిన వాళ్లందర్నీ ఒకే వేదిక మీదకు తీసుకువచ్చేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇన్నాళ్లు బుల్లెట్‌ యుద్ధం చేసిన వాళ్ళతో ఇక మీదట రాజ్యాంగ బద్దంగా బ్యాలెట్‌ వార్‌కు సమాయత్తం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు. అందర్నీ ఐక్యం చేసి ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని ఇటీవల దేవ్ జీ ప్రకటించడం లొంగిపోయిన మావోయిస్టులతోపాటు రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చకు కారణమైంది. అదే సమయంలో దానికి అనుబంధంగా మరో డిస్కషన్‌ కూడా నడుస్తోంది. మావోయిస్టులు పొలిటికల్‌ ప్లాట్‌ఫామ్‌ కావాలనుకుని, పార్టీగా మారాలనుకుంటే.. ఏ పేరుతో వస్తారన్నది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఉన్న సీపీఐ మావోయిస్టు పేరు మీద నిషేధం కొనసాగుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో… అదే పార్టీ పేరుతో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడం సాధ్యమా..? లేక.. కొత్త పేరు.. కొత్త జెండా.. రాజకీయ అజెండాతో ముందుకు వస్తారా అంటూ… కొన్ని వర్గాల్లో రకరకాల విశ్లేషణలు నడుస్తున్నాయి. తాజాగా ఎన్‌టీవీతో మాట్లాడిన మావోయిస్ట్‌ పార్టీ కేంద్రకమిటీ మాజీ సభ్యుడు దేవ్ జీ ఈ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాము వేరే పార్టీ కాదని… త‌మది సీపీఐ మావోయిస్టు పార్టీనే అంటూ క్లారిటీగా చెప్పేశారాయన.

మావోయిస్ట్‌ పార్టీ మీద ఉన్న నిషేధాన్ని ఎత్తేస్తేనే… దేవ్‌జీ అనుకున్నట్టు సాధ్యమవుతుంది. లేకుంటే గనుక కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ కొత్త ప్లాట్‌ఫామ్ ద్వారా… ఒకప్పుడు ఎన్నికల్ని బహిష్కరించమని పిలుపు ఇచ్చిన వాళ్ళే.. ఇప్పుడు ఓట్లేయమంటూ ప్రజల్లోకి వెళతారు. అదే జరిగితే.. మావోయిస్ట్‌ ప్రస్థానంలో కీలక మలుపు అవుతుందని అంటున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జెన్ జీ ట్రెండ్‌ నడుస్తోంది. కాక్రోజ్ జనతా పార్టీ పోరాటాలు టాక్‌ ఆఫ్‌ది పాలిటిక్స్‌ అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో… జనజీవన స్రవంతిలోకి వచ్చిన మాజీ మావోయిస్ట్‌ నేత… ఇప్పటికీ మా పార్టీ సీపీఐ మావోయిస్టేనని ప్రకటించడం ఆసక్తి రేపుతోంది. దీని వెనకున్న ఆంతర్యం ఏంటంటూ రకరకాల విశ్లేషణలు నడుస్తున్నాయి. ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయడానికి కచ్చితంగా ఓ వేదిక కావాలి కాబట్టి…అది ప్రజాస్వామ్యబద్దంగా ఉంటే… ఎక్కువ మంది కలిసి వచ్చే అవకాశం ఉంటుందని లెక్కలేస్తున్నారట మాజీ మావోయిస్ట్‌ నాయకులు. ఇదే సమయంలో గతంలో జరిగిన నేపాల్‌ పరిణామాలు కూడా చర్చకు వస్తున్నాయి. అక్కడ సాయుధ పోరాట విరమణ తర్వాత… నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీని స్థాపించిన ప్రచండ… ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి వచ్చిన ఉదంతాన్ని గుర్తు చేస్తున్నారు కొందరు.

అక్కడి పరిస్థితులు, ఇక్కడ రాజకీయ వాతావరణం భిన్నంగా ఉన్నప్పటికీ… అలా కూడా చేయవచ్చుకాబట్టి… మాజీ మావోయిస్టులందర్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చి ఒక వేదిక సిద్ధం చేసే దిశగా దేవ్‌జీ చొరవ తీసుకుంటారని చెప్పుకుంటున్నారు. సమాజంలో అసమానతలు ఉన్నంతకాలం అసంతృప్తి రగులుతూనే ఉంటుందని, ఆ పోరాటాలకు ఏదో ఒక రూపంలో ఎప్పుడూ స్పేస్‌ ఉంటుందన్న విశ్లేషణలు సైతం ఉన్నాయి. అంత వరకు బాగానే ఉన్నా… అసలు సమస్య అక్కడే వస్తుందని అనే వాళ్ళు సైతం లేకపోలేదు. సిద్ధాంతపరమైన విభేదాలు, ఎన్నికలపై గతంలో వాళ్ల వైఖరి, రాజకీయ వ్యూహాలు, పార్టీ పేరు, గుర్తింపు.. లాంటి రకరకాల అంశాలను పరిగణనలోకి తీసుకుంటే… మాజీ మావోయిస్ట్‌లంతా ఒకే వేదిక మీదికి వస్తారా అన్న సందేహాలు సైతం ఉన్నాయట. అదే సమయంలో ఇంకా అడవుల్లో ఉన్న నాయకత్వం వైఖరి ఏంటన్నది కూడా ఇక్కడ పెద్ద క్వశ్చన్‌ మార్క్‌. అట్నుంచి రెడ్‌ సిగ్నల్‌ పడితే… లొంగిపోయిన వాళ్ళు ధైర్యంగా అడుగు ముందుకు వేయగలరా అన్న సందేహాలు సైతం ఉన్నాయి. ఇలా… బుల్లెట్‌ టు బ్యాలెట్‌ వార్‌ జర్నీలో రకరకాల సందేహాలు పెరుగుతున్నాయి. అయితే… దేవ్‌ జీ చెబుతున్నట్టు రాజకీయ వేదికను ఏర్పాటు చేయగలిగితే మాత్రం పొలిటికల్‌ స్క్రీన్‌ మీద సరికొత్త దృశ్యాలు కనిపించడం ఖాయం అన్న వాదన బలపడుతోంది.