టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలంటే.. ఉపాధ్యాయ సంఘాలు.. యూనియన్లదే కీలక పాత్ర. యూనియన్ నాయకులను కాదని టీచర్ల ఓటు ఒక్కటి కూడా అటూ ఇటూ కాదు. ఇది నిన్నటి వరకు ఉన్న చరిత్ర. ఇప్పుడు కొత్త హిస్టరీ క్రియేట్ చేశారు తెలంగాణలోని ఉపాధ్యాయులు. యూనియన్లను కాదని.. ఓ పార్టీకి పట్టం కట్టడం చర్చగా మారుతోంది.
తెలంగాణలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చివరి వరకు ఉత్కంఠ
హైదరాబాద్-మహబూబ్నగర్-రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ MLC ఎన్నికల్లో అనూహ్య ఫలితం వచ్చింది. BJP బలపర్చిన AVN రెడ్డి MLCగా గెలిచారు. మొత్తం 21 మంది బరిలో ఉంటే.. కాంగ్రెస్ పార్టీ హర్షవర్దన్రెడ్డికి మద్దతుగా నిలిచింది. PRTU నేత చెన్నకేశవరెడ్డి.. అధికార BRS మద్దతు తనకే అని ప్రచారం చేసుకున్నారు. వీరు కాకుండా సిట్టింగ్ MLC కాటేపల్లి జనార్దన్రెడ్డి సైతం బరిలో నిలవడంతో పోలింగ్ హోరాహోరీగా సాగింది. అదే ప్రభావం కౌంటింగ్పైనా పడింది. ఓట్ల లెక్కింపు చివరి వరకు ఉత్కంఠ రేకెత్తించింది.
యూనియన్లను కాదని బీజేపీ అభ్యర్థికి టీచర్లు పట్టం
టీచర్ల MLC ఎన్నికల్లో మొదటిసారి బీజేపీ తన అభ్యర్థిని బరిలో దించింది. గతంలో సంఘ్ పరివార్ క్షేత్రాల నుంచి అభ్యర్థి పోటీ చేసేవారు. గత ఎన్నికల్లో ఇదే స్థానంలో పోటీ చేసిన TPUS ఘోరంగా ఓడిపోయింది. TPUS.. ఆర్ఎస్ఎస్కు అనుబంధ సంఘం. బలమైన యూనియన్ కాకపోవడంతో.. పోటీ కూడా నామ్ కే వాస్తే అన్నట్టు సాగేది. ఇదే సమయంలో PRTU, UTF సంఘాలు కీలకంగా పనిచేసేవి. పోటీ ఈ రెండు యూనియన్ల మధ్యే ఉండేది. ప్రస్తుత ఎన్నికల్లో UTF నుంచి మాణిక్రెడ్డి బరిలో నిలిచారు. ఈ రెండు యూనియన్లకు తెలంగాణ శాసనమండలిలో ప్రాతినిథ్యం ఉంది. టీచర్లు కూడా ఈ రెండు సంఘాలను కాదని వేరే వారికి ఓటేసిన సందర్భాలు లేవు. కానీ.. తొలిసారి యూనియన్లను కాదని.. BJP బరిలో దించిన AVN రెడ్డికి మద్దతుగా నిలవడమే రాజకీయ వర్గాలను ఆశ్చర్య పరిచింది.
లెఫ్ట్ సంఘాలకు ఓటేసిన టీచర్లు బీజేపీని ఆదరించారా?
మొదటి ప్రాధాన్యత ఓటులోనే బీజేపీకి ఆధిక్యం లభించడంతో.. ప్రధాన సంఘాల అభ్యర్థులు ఒకింత విస్మయం చెందారు. చివరి వరకు AVN రెడ్డి ఆ ఆధిత్యత కొనసాగించలేరని గట్టి నమ్మకంతో ఉన్నారు కూడా. కానీ.. AVN రెడ్డి చివరి వరకు పట్టు నిలుపుకోవడంతో అందరికీ సీన్ అర్థమైపోయింది. వామపక్ష ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థులకు ఓటేసిన టీచర్లు సైతం ప్రాధాన్యత క్రమంలో బీజేపీ క్యాండిడేట్కు కూడా ఓటేశారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే UTF అభ్యర్థికి ఓటేసిన వారిలో ఎక్కువ మంది రెండో ప్రాధాన్యత ఓటును బీజేపీకి వేశారు.
యూనియన్లపై టీచర్లలో వ్యతిరేకత నెలకొందా?
టీచర్ల వైఖరిలో వచ్చిన ఈ మార్పు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. తమ సమస్యలపై ఉపాధ్యయ సంఘాలు ఆశించిన స్థాయిలో గళం ఎత్తడం లేదనే అభిప్రాయంలో టీచర్లు ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే యూనియన్లు కాదని.. ఓ పార్టీకి ఓటేశారని అనుకుంటున్నారు. పైగా సిట్టింగ్ MLC జనార్దన్రెడ్డి 15 వందల ఓట్లు కూడా పొందలేకపోయారు. మొత్తంగా యూనియన్లపై టీచర్లలో ఉన్న వ్యతిరేకత ఈ ఎన్నిక ద్వారా బయట పడిందనేవాళ్లూ ఉన్నారు. ఇక మునుగోడు ఉపఎన్నికలో ఓటమి తర్వాత డీలా పడ్డ బీజేపీ.. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. RSS, ABVP, TPUSలను సమన్వయం చేసుకుంటూ ఎన్నికల వ్యూహం రచించింది. ప్రతి 25 మంది ఓటర్లకు ఒక ఇంఛార్జ్ను పెట్టడంతోపాటు.. బీజేపీ కేంద్ర నాయకులు సైతం ప్రత్యేక పర్యవేక్షణ చేశారు. PRTU, UTFలు ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నాయనే తమ ప్రచారం వర్కవుట్ అయ్యిందని బీజేపీ వర్గాలు లెక్కలేస్తున్నాయి.