OFF THE RECORD: కేంద్రమంత్రి కిషన్రెడ్డిని ఉద్దేశించి కిషన్రావు అని ఎందుకు అన్నారు సీఎం రేవంత్రెడ్డి? ఒక ముఖ్యమంత్రి సెంట్రల్ మినిస్టర్ మీద ఆ స్థాయి కామెంట్ చేయడం వెనకున్న బలమైన కారణాలేంటి? ఎవరు ఎవర్ని టార్గెట్ చేస్తున్నారు? మధ్యలో ఉన్నదెవరు? అసలు తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ ఇప్పుడెలా కనిపిస్తోంది?
Off The Record : వైసీపీలో అంబటి ఒంటరి అయ్యారా? కీలక నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు?
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం పీక్స్కు చేరడం, పోలింగ్ దగ్గర పడుతున్న టైంలో… నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పట్టణ ఓటర్ల నాడి పట్టేందుకు, బుట్టలో వేసుకునేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు నాయకులు. తమ వ్యాఖ్యలతో ప్రత్యర్థుల్ని ఉక్కిరి బిక్కిరి చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల గురించి ఆసక్తిగా మాట్లాడుకుంటున్నాయి రాజకీయవర్గాలు. అందుకు అనుసరిస్తున్న ప్లానింగ్ చూసి వార్నీ… అంటూ బుగ్గలు నొక్కుకుంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని బీజేపీ అంటుంటే … బీజేపీ, బీఆర్ఎస్ ఒక గూటి పక్షులేనని విమర్శిస్తోంది కాంగ్రెస్. దాన్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి సహా… హస్తం లీడర్స్. గులాబీ, కాషాయం ఒక్కటేనని చెప్పడమేకాకుండా ఆ విషయాన్ని వీలైనంత గట్టిగా ప్రజల్లోకి తీసుకువెళ్ళే ప్లాన్లో ఉన్నారు అధికార పార్టీ నాయకులు. ఈ క్రమంలోనే… కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మీద తీవ్ర స్థాయిలో మాట్లాడారు సీఎం రేవంత్రెడ్డి. కేంద్ర మంత్రి పేరు కిషన్ రెడ్డి కాదని, కల్వకుంట్ల కిషన్రావ్ అని, కేసీఆర్ దత్త పుత్రుడు అంటూ తీవ్రంగానే టార్గెట్ చేశారు సీఎం.
దీంతో… ఇదేదో ఆషామాషీ వ్యవహారం కాదని, ఒక కేంద్ర మంత్రిని పట్టుకుని సీఎం స్థాయి నాయకుడు అలా అన్నారంటే… వ్యూహం గట్టిగానే ఉండిఉంటుందన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రకరకాల వాదనలు తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో చాలా చోట్ల ముస్లిం ఓట్లు కీలకమైనందున వాటన్నిటినీ గంపగుత్తగా కొల్లగొట్టేందుకే ముఖ్యమంత్రి అలా మాట్లాడి ఉండవచ్చని విశ్లేషిస్తున్నారు కొందరు. నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు పలు మున్సిపాలిటీల్లో ముస్లిం ఓట్లు కీలకంగా ఉన్నాయి. అవి చీలిపోయి కొన్ని బీఆర్ఎస్కు పడకుండా ఉండాలంటే… ఆ పార్టీ అంతర్గతంగా బీజేపీతో అంటకాగుతోందని చెప్పాలని, అందుకే ముఖ్యమంత్రి కిషన్రెడ్డిని అలా అటాక్ చేసి ఉండవచ్చని అంటున్నారు పరిశీలకులు.
ఇదే సమయంలో కేవలం ఒక్క ఓటటింగ్ టార్గెట్గానే అంతలా మాట్లాడి ఉండకపోవచ్చని, దాంతోపాటు అంతకు మించిన వ్యూహం కూడా ఉండి ఉండవచ్చన్నది ఇంకొందరి వాదన. బీజేపీ భుజం మీద తుపాకీ పెట్టి కేసీఆర్ని ట్రిగ్గర్ చేసే ప్లాన్ కూడా ఉండి ఉండవచ్చంటున్నారు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన పరిణామాలపై విచారణ జరిపించి కేసీఆర్ను జైలుకు పంపుతామని తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నారు రేవంత్రెడ్డి. ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా… అలాంటిదేం జరగలేదని, విచారణల పేరుతో కాలయాపన తప్పచర్యలు లేవనే విమర్శలు పెరుగుతున్నాయి. అప్పుడు చేసినవన్నీ కేవలం ఆరోపణలేనా, కేసీఆర్ హయాంలో అంతా బాగానే జరిగిందా అన్న వాదనలు సైతం పెరుగుతున్నాయి.
అలా ఓవైపు ప్రభుత్వం మీద పెరుగుతున్న వత్తిడి, మరోవైపు కేసీఆర్ ఫ్యామిలీలో ఎవరినైనా అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుందేమోనన్న రాజకీయ భయాలు కలగలిసి సీఎం కిషన్రెడ్డిని టార్గెట్ చేసి ఉండవచ్చంటున్నారు. బంతిని కేంద్ర ప్రభుత్వం కోర్ట్లోకి నెడుతూ… కేసీఆర్, కేటీఆర్ని అరెస్ట్ చేయండని బీజేపీని సవాల్ చేసి… ఒకవేళ అదే జరిగితే తలెత్తే పరిణామాల నుంచి తాము తప్పించుకోవచ్చన్నది రేవంత్ వ్యూహంగా చెప్పుకుంటున్నారు. కల్వకుంట్ల కిషన్రావు అనడం ద్వారా…. ఆ రెండు పార్టీలు ఒకటేనని, అందుకే కేసీఆర్ మీద యాక్షన్ తీసుకోవడంలేదని సీఎం చెప్పాలనుకుంటున్నట్టు కవిపిస్తోందని విశ్లేషిస్తున్నారు చాలా మంది. మరో వైపు బీజేపీ కూడా తగ్గకుండా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి రేవంతుద్దీన్ అంటూ….తమ హిందూ ఓట్ బ్యాంక్ని కాంగ్రెస్ చీల్చకుండా జాగ్రత్తపడుతోంది. మొత్తం మీద మున్సిపల్ ఎన్నికల ప్రచారం అసెంబ్లీ రేంజ్లో జరుగుతూ తెలంగాణ పాలిటిక్స్లో కాక పుట్టిస్తోంది.