ఎక్కడ…? మేడం ఎక్కడ…..? అసలేమైపోయారు? ఇలా వచ్చారు… అలా పదవి కొట్టేశారు.. ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయారు. ఎంత హైకమాండ్ కోటాలో పోస్ట్ వస్తే మాత్రం ఇలా గాయబ్ అయిపోతారా? ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో హాట్ హాట్గా జరుగుతున్న చర్చలివి. ఇంతకీ…. వాళ్ళంతా ఏ మేడమ్ కోసం వెదుకుతున్నారు? పార్టీ ఆమెను పట్టించుకోవడం లేదా? లేక ఆమే లైట్ తీసుకుంటున్నారా? లెట్స్ వాచ్. రాజ్యసభ అభ్యర్థి ఎంపిక గురించి ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో గట్టి చర్చే జరుగుతోంది. పార్టీ కోసం పనిచేసే నాయకులు, కష్టకాలంలో కూడా వదలకుండా జెండా మోసిన వాళ్లకు అవకాశం ఇవ్వాలన్న వాయిస్ పెరుగుతోంది. పార్టీ కోసం పనిచేసే వాళ్లకు పదవులు ఇస్తే ప్రయోజనం ఉంటుందిగానీ… పదవుల కోసమే వచ్చే వాళ్లవల్ల ప్రయోజనం ఏంటన్న వాదన తెరమీదికి వస్తోంది. ఈ క్రమంలోనే… ఇటీవల ఓ సీనియర్ నాయకుడు ఇంతకు ముందు పార్టీ నాయకత్వం ఇచ్చిన ఎమ్మెల్సీల లిస్ట్పై కామెంట్ చేయడం కాక రేపుతోంది.
విజయశాంతి లాంటి నాయకురాలిని పిలిచి ఎమ్మెల్సీ ఇవ్వటం తప్పు కాదుగానీ… ఎమ్మెల్సీ అవ్వడానికి ముందైనా, తర్వాత అయినా ఆమె పార్టీ కోసం ఏం చేశారో చూడాలని ప్రస్తావించారు సదరు సీనియర్ నేత. దీంతో అసలు ఆమె ఎక్కడున్నారన్న చర్చ మొదలైంది పార్టీ వర్గాల్లో. ప్రస్తుతం వివిధ సంక్షేమ కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ… వాటి గురించి ఇటు పార్టీగాని,అటు ప్రభుత్వంగానీ అనుకున్న స్థాయిలో ప్రచారం చేసుకోవడం లేదన్న అభిప్రాయం బలంగా ఉంది. విజయశాంతి లాంటి స్టార్డం ఉన్న నాయకురాలు ఈ బాధ్యత తీసుకుంటే బాగుంటుందన్నది గాంధీభవన్లో ఉన్న ఒక అభిప్రాయం. ప్రస్తుతం పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నారామె. ఢిల్లీ స్థాయి పలుకుబడితో ఎమ్మెల్సీ సీటు తెచ్చుకోగలిగారు. కానీ.. ఎన్నికయ్యాక పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు అస్సలు సమయం కేటాయించకపోవడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలంటూ ప్రశ్నిస్తున్నారు పార్టీ లీడర్స్. ప్రతిపక్షం నుంచి గట్టి సవాళ్ళే ఎదురవుతున్నాయి. అలాంటి వాటికి కూడా ఇప్పటివరకు కనీసం కౌంటర్ ఇవ్వలేదు విజయశాంతి. ఇటీవలి మున్సిపల్ ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకుంది ప్రభుత్వం. అలాంటి ఎన్నికల సందర్భంగా కూడా ఎక్కడా ప్రచారం చేయలేదు ఆమె.
గతంలో విజయశాంతికి ఏ పదవీ లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు కూడా పెద్దగా హాజరయ్యేవారు కాదు. కానీ ఇప్పుడు హై కమాండ్ పిలిచి మరీ… ఎమ్మెల్సీని చేసింది. అయినాసరే… ఆ తర్వాత కూడా పార్టీ కార్యక్రమాలను పట్టించుకోవడం లేదు. పార్టీ నాయకత్వం అయినా… ఆమెను పిలిచి ప్రభుత్వ పథకాలు, పార్టీ వ్యవహారాలపై మీడియా సమావేశాలు ఏర్పాటు చేయిస్తే ప్రయోజనం అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే… పార్టీ నుంచి విజయశాంతిని ఆహ్వానించడం లేదా..? లేక పిలిచినా ఆమె రావడం లేదా అనేది అసలు చర్చ. సహజంగా ఎమ్మెల్సీ పదవి ఉందంటే… ఒక బాధ్యత అప్పగించినట్టే… దాని దృష్టిలో ఉంచుకొని పనిచేయాలి కదా అనే వాదన కూడా కాంగ్రెస్ సీనియర్స్ మధ్య ఉంది. అటు విజయశాంతే గాక చాలామంది సీనియర్ నేతలు కూడా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలను ప్రచారం చేసే ప్రయత్నం కానీ.. మీడియా మీడియా మీటింగ్స్లో చెప్పడం కానీ చేయడం లేదు. ఇదే కాంగ్రెస్ పార్టీకి పెద్ద మైనస్. ఇప్పటికైనా పార్టీ నాయకత్వం వీటిపై ఫోకస్ చేస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు రాజ్యసభ అభ్యర్థులు ఎంపిక విషయంలో కూడా పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న రెండు ఎంపీ సీట్లలో ఒకటి హైకమాండ్ కోటాలోకి వెళ్తుంది.. మిగిలిన ఒక్క సీటు అయినా.. కష్టపడ్డ వాళ్ళకు ఇవ్వాలన్న వాదన బలంగా వినిపిస్తోంది.