తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ మీద సరికొత్త సీన్స్ని చూడబోతున్నామా? ఇప్పుడిప్పుడే ఒక డిఫరెంట్, ఇప్పటి వరకు అసలు ఊహకు కూడా అందని వాతావరణం నెలకొంటోందా? ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు నాయకులు ప్రస్తుతం బీజేపీ రాడార్ పరిధిలో ఉన్నారా? ఈ పరిణామం వెనుకున్న పొలిటికల్ కేలిక్యులేషన్స్ ఏంటి? రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో… మాజీ ఎర్రన్నలు కాషాయ కలర్లో కనిపించబోతున్నారా? వెనకున్న కథేంటి? వచ్చే ఎన్నికల్లో తెలంగాణ మీద ఫుల్ ఫోకస్ పెట్టాలనుకుంటోంది బీజేపీ అధినాయకత్వం. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి రాష్ట్రంలో పాగా వేయాలన్న పట్టుదలగా ఉన్నారట పార్టీ పెద్దలు. కోరికలు ఉండటం సహజమేగానీ… అందుకు వాస్తవ పరిస్థితులు కూడా సహకరించాలి కదా…? ఇక్కడే సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారట కాషాయ పెద్దలు. తెలంగాణలో గ్రౌండ్ లెవెల్ కనెక్ట్ కోసం ఇప్పటికీ తహతహలాడుతోంది రాష్ట్రంలోని బీజేపీ కొత్త నాయకత్వం. కానీ… పట్టు మాత్రం చిక్కడం లేదు. దీంతో….సాధారణ రాజకీయ నాయకులకంటే…, ప్రజల మధ్య సుదీర్ఘంగా పనిచేసిన, సామాజిక ఉద్యమాల నుంచి వచ్చినవారిని ముందుకు తేవడం ద్వారా బీజేపీ అంటే ప్రజల పక్షం అనే కొత్త ఇమేజ్ సృష్టించాలనుకుంటున్నారట. ఈ క్రమంలోనే.. ఇటీవల లొంగిపోయిన మావోయిస్ట్లు బీజేపీ మిషన్లో కీలక పాత్ర పోషించబోతున్నారని, ఎర్రజెండా వదిలేసిన వాళ్ళతో కాషాయ జెండా పట్టించే ప్రత్నాలు జరుగుతున్నాయని చెప్పుకుంటున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాల ముందు మావోయిస్ట్ అగ్ర నేతలతో పాటు కొంత కేడర్ లొంగిపోయింది.
అలాంటి వాళ్ళలో కొందరికి ప్రజా మద్దతు ఉన్న ప్రాంతాల్లో అసెంబ్లీ లేదా లోక్సభ టికెట్లు ఇవ్వాలని బీజేపీ పెద్దలు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇన్నాళ్ళు బుల్లెట్ వార్ చేసిన వాళ్ళతో ఇక నుంచి బ్యాలెట్ వార్ చేయించి… వారికి గుర్తింపు తీసుకురావడంతోపాటు బలహీనంగా ఉన్న ఏరియాల్లో తాము బలపడాలనుకుంటున్నారట కాషాయ లీడర్స్. మావోయిస్టు ప్రభావం ఎక్కువగా ఉన్న పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ ప్రాంతాల్లో బీజేపీకి ఇప్పటివరకు బలం లేదు. అయితే…ఈ ఏరియాల్లో ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న మాజీ మావోయిస్టు నాయకులను తెర మీదికి తీసుకురావడం ద్వారా, సామాజిక మార్పు రాజకీయ మార్పు అనే నినాదంతో ప్రజల్లో కొత్త విశ్వాసం కలిగించే ప్రయత్నం జరుగుతోందట. రకరకాల ఈక్వేషన్స్, కేలిక్యులేషన్స్ చూసుకున్నాకే… బీజేపీ ఈ వ్యూహం సిద్ధం చేస్తున్నట్టు అంచనా వేస్తున్నారు పొలిటికల్ పండిట్స్. పార్టీ బలోపేతం, లొంగిపోయినవారికి కొత్త జీవితం అంటూ… ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టే ప్లాన్ ఉందట. మరీ ముఖ్యంగా తమ గ్రౌండ్ కనెక్ట్ టాస్క్కు ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని భావిస్తున్నారట కమలం పెద్దలు. బీజేపీ ప్లానింగ్ ఎలా ఉన్నా… అసలు ఈ ప్రతిపాదనే కొత్తగా, వినడానికి డిఫరెంట్గా ఉందని అంటున్నారు పరిశీలకులు.
ఇన్నాళ్ళు రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళను ఇప్పుడు అందులోనే భాగస్వాముల్ని చేయాలనుకోవడం చిన్న విషయమేం కాదని, అది వర్కౌట్ అయి కాషాయ ప్లాన్ సక్సెస్ అయితే… దేశ రాజకీయాల్లోనే ఇదో సరికొత్త అధ్యాయం అవుతుందని అంటున్నారు పరిశీకులు. పరస్పర సిద్ధాంత వైరుధ్యాలున్న వాళ్ళు ఒక్కటవుతారన్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. ఈ కొత్త ఎపిసోడ్కు తెలంగాణ రాజకీయాలు వేదిక కాబోతున్నాయన్న వార్తలు ఇంకా ఇంట్రస్టింగ్గా ఉన్నాయంటున్నారు. ఇన్నాళ్ళు రాజ్యానికి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళని ఇప్పుడు అదే రాజ్యాంగ పరిధిలోకి తీసుకొచ్చి ఎన్నికల్లో నిలబెట్టాలనుకుంటున్న బీజేపీ వ్యూహం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.