తమ్ముళ్ళు తమ్ముళ్ళు తన్నుకుని అసలు సీక్రెట్స్ అన్నిటినీ బయటపెడుతున్నారా? వాళ్ళ గొడవలతో…. కళ్ళు బైర్లుకమ్మే స్థాయిలో జరుగుతున్న ఇసుక దందా బయటికొచ్చిందా? మేం వాళ్ళ మనుషులం, వీళ్ళ మనుషులమని చెప్పి వాగులు, వంకల్ని సైతం దోచేస్తున్న తంతు ఎక్కడ జరుగుతోంది? టీడీపీలోని రెండు వర్గాలకు ఎప్పుడు? ఎక్కడ తేడా కొట్టింది? చిత్తూరు జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఇసుక సెగలు రేగుతున్నాయి. తెలుగుదేశం పార్టీలోనే ఓ వర్గం చేస్తున్న దందాకు సంబంధించిన సమాచారాన్ని మరో వర్గం లీక్ చేసి పట్టించిందన్న వార్తలు యమా హాట్హాట్గా మారాయి. చిత్తూరు, పూతలపట్టు కేంద్రంగా ఇసుక అడ్డగోలు వ్యాపారం హద్దులు దాటింది. ఈక్రమంలో ఓ వర్గానికి చెందిన మాఫియా పోలీసుల చేతిలో లాక్ అవ్వడంతో.. తమ్ముళ్ల మధ్య వర్గపోరు మొదలైందట. చిత్తూరు నియోజక వర్గం గుడిపాల మండలంలోని ఓ ఇద్దరు ఛోటా నేతలు స్థానిక ఎమ్మెల్యే సన్నిహిత బంధువు అండతో ఇసుక అక్రమ వ్యాపారంలో ఆరితేరినట్టు చెప్పుకుంటున్నారు.
తమిళనాడులో బ్రోకర్లను ఏర్పాటు చేసుకుని అటు తరలిస్తున్నారట. మంచినీళ్ల కుంట, సీఎం కండ్రిగ డంప్ల నుంచి కమ్మతిమ్మపల్లి మీదుగా తమిళనాడుకు తన్నుకుపోతున్నారు. ఎమ్మెల్యే అండతోనే అక్రమ వ్యాపారాన్ని రెండేళ్లుగా నడిపిస్తున్నారని సొంత పార్టీలోని ఓ వర్గం బహిరంగంగానే విమర్శిస్తోంది. ఆ అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోబోయిన వాళ్ళకు నరకం చూపిస్తున్నారని టీడీపీలోనే మాట్లాడుకుంటున్నారు. ఇక పూతలపట్టు మండలం వావిల్ తోట, చిత్తూరు బీఆర్పేట ప్రాంతాలు ప్రస్తుతం ఇసుక దందాకు అడ్డాగా మారాయి. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అనుచరులతో పాటు ఒక ప్రముఖ ఆలయ ట్రస్ట్బోర్డ్ ఛైర్మన్ బంధువులమని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా చెలరేగుతున్నారట. వావిల్ తోట నుంచి ఇసుక తోడి మురకంబట్టులో దాచిపెట్టి అమ్ముకుంటున్నారన్నది లోకల్ టాక్. అలాగే మంచినీళ్ల కుంట, సీఎం కండ్రిగ ప్రాంతాల్లో ఇసుక డంప్లు కొండల్ని తలపిస్తున్నాయి. నదులు, వంక నుంచి తవ్విన ఇసుకను ముందుగా ఇక్కడే నిల్వ చేసి తర్వాత లారీల్లో పంపుతున్నారు. సరిహద్దు ప్రాంతం కావడంతో తమిళనాడుకు ఇసుక రవాణా తేలికైంది.
ముఖ్యంగా రాత్రి వేళల్లో వరుసగా లారీలు బయలుదేరి సరిహద్దు దాటుతున్నాయి. లారీ ఇసుకను తమిళనాడులో లక్షా 20వేల నుంచి లక్షా 80వేల దాకా అమ్ముతున్నట్టు తెలిసింది. మురకంబట్టు నుంచి రోజూ 15 నుంచి 20 లారీలు, మంచినీళ్ల కుంట, సీఎం కండ్రిగ నుంచి 40 లారీల దాకా ఇసుక లోడ్తో రాష్ట్ర సరిహద్దు దాటుతున్నాయి. ఈ లెక్కన ప్రతిరోజూ 80 లక్షల నుంచి కోటి రూపాయల దాకా అక్రమ వ్యాపారం జరుగుతోందని స్థానికంగా చెప్పుకుంటున్నారు. ఈక్రమంలో… ఆ మధ్య మురకంబట్టు నుంచి ఇసుక తరలిస్తున్న ఓ లారీని చిత్తూరు తాలూకా పోలీసులు పట్టుకున్నారు. తాజాగా మరో రెండు లారీలను పట్టుకుని అరెస్ట్లు కూడా చూపించారు పోలీసులు. అదే సమయంలో మంచినీళ్ల కుంట, సీఎం కండ్రిగ సహా మరో రెండు ప్రాంతాల నుంచి వెళ్లే లారీలు మాత్రం అడ్డంకులు లేకుండా సాగిపోతున్నాయట. దీంతో ఒక రూట్ని వదిలేసి మరో రూట్ని టైట్ చేయడం ఏంటంటూ టీడీపీ నాయకులు కొందరు గుర్రుగా ఉన్నారు. వాళ్ళు చేసేది మంచిపని, మేం చేసేది చెడా అంటూ ప్రశ్నిస్తున్నారట.
అలాగే… పూతలపట్టుకు చెందిన ఓ ప్రజా ప్రతినిధి, ప్రముఖ ఆలయ ఛైర్మన్ బంధువులమంటూ మరికొందరు పోలీసులపై వత్తిడి తెచ్చినట్టు తెలిసింది. ఇలా ఓ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే అనుచరులు మరో ఎమ్మెల్యే అనుచరుల ఇసుక అక్రమాలపై సమాచారం ఇచ్చి పట్టిస్తుండడంతో స్థానిక టీడీపీలో విభేదాలు తారా స్థాయికి చేరుతున్నాయి. ఈ తీవ్రత మరింత పెరిగితే…పరిస్థితి ఎలా మారుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది కేడర్లో. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ పెద్దలకు స్థానిక సీనియర్ నేతలు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఇలా ఒకరిపై ఒకరు లీకులిచ్చి ఇన్నాళ్లు గుట్టుగా సాగిన మొత్తం దందాను బయటపెట్టారంటూ తలలు పట్టుకుంటున్నారట మరికొందరు తమ్ముళ్లు… అయితే ఈ వ్యవహారం స్థానిక ఎమ్మెల్యేలలు ఇద్దరికీ తలనొప్పిగా మారిందని టాక్ నడుస్తోంది. ఇందులో మా ప్రమేయం ఏమీ లేదని వాళ్ళు అంటున్నా…. దాన్ని మేం నమ్మాలా అంటూ సెటైర్స్ వేస్తున్నారు వైసీపీ నాయకులు.