ఆ ఎమ్మెల్యే వ్యూహం మార్చేశారా..? ముఖ్య నాయకత్వంతో గ్యాప్ పెంచుకోవడం ఎందుకు అని డిసైడ్ అయ్యారా..!? వీలైనంత వరకు తగ్గించుకుని, కుదిరితే ప్యాచప్ చేసుకుంటేనే ఉపయోగం తప్ప…. తెగేదాకా లాగితే ఉపయోగం ఏముందన్న రియలైజేషన్కు వచ్చారా? అందుకే కీలకమైన సమయంలో అత్యంత కీలకభేటా జరిపారా? ఎవరా శాసనసభ్యుడు? ఎవరితో కీలక భేటీ వేశారు? మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో ముఖ్యమంత్రితో సమావేశం అవడం ప్రస్తుతం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో చర్చకు దారితీసింది. 15 నిమిషాలకు పైగా ఇద్దరి భేటీ కొనసాగింది. దీంతో ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయి..? రాజగోపాల్ రెడ్డి రేవంత్ను ఏం అడిగారంటూ అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యేలు పరస్పరం ప్రశ్నించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. నియోజకవర్గానికి సంబంధించిన అంశాలతో పాటు… అభివృద్ధి పనులపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలిసింది. అయితే ఇద్దరి మధ్య కొంతకాలంగా గ్యాప్ ఉందన్న ప్రచారక్రమంలో… అంతకు మించి వేరే అంశాల గురించి కూడా మాట్లాడుకుని ఉంటారా అన్న చర్చ మొదలైంది. ఈసారి క్యాబినెట్ విస్తరణ జరిగితే కచ్చితంగా రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఉంటుందని ఆయన సన్నిహితులు చర్చించుకుంటున్నారు.
ఇదే విషయమై చాలా రోజులుగా రకరకాల ఎపిసోడ్స్ నడుస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డికి క్యాబినెట్ బెర్త్ ఉంటుందా, లేదా..? అనే చర్చ నడుస్తూనే ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే మునుగోడులో అనేకసార్లు రియాక్ట్ అయ్యారు రాజగోపాల్ రెడ్డి. మంత్రి పదవి వస్తే మంచిది… లేదంటే అంతకంటే పెద్ద పదవి తెచ్చుకుంటానని కూడా గతంలో కామెంట్స్ చేశారాయన. ఏప్రిల్ మొదటి వారంలో క్యాబినెట్ విస్తరణ ఉంటుందని చర్చ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో రాజగోపాల్ రెడ్డి భేటీ ఆసక్తికరంగా మారింది. కొద్ది రోజులుగా పొలిటికల్ హాట్ కామెంట్స్ను కాస్త తగ్గించారాయన. ఇప్పుడిక నేరుగా సీఎంతో భేటీ అయ్యారు. ఇలా రాజగోపాల్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా అనే డిస్కషన్స్ సైతం ఉన్నాయి. సీఎంతో తనకేం విభేదాలు లేవని… చెప్పే ప్రయత్నం జరుగుతోందా అన్న అనుమానాలు సైతం ఉన్నాయి. మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తో పాటు… పార్టీలో కీలక నాయకులు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. వోవరాల్గా కారణం ఏదైనా…. ఈ మీటింగ్ మాత్రం రాజకీయవర్గాల్లో హాట్ సబ్జెక్ట్ అయింది.