కాంగ్రెస్ పార్టీకి రాజకీయ వ్యూహం లేదా..? ఆ పార్టీ పెద్దలు సైతం ఏది పడితే అది, ఎలా పడితే అలా మాట్లాడేస్తారా? తమకు అంతో ఇంతో సంబంధం ఉన్న ఇష్యూలోకి మొత్తంగా దూరేసి ముఖ్య నేతలే పార్టీని ఇరుకున పెట్టారా? లేక వీటన్నిటికీ మించి ఇప్పటిదాకా ఎవ్వరూ అంచనా వేయలేని, పార్టీ అమెను ఓన్ చేసుకునే స్కెచ్ దాగి ఉందా? ఇంతకీ ఏంటా వివాదం? కాంగ్రెస్ తీరుపై ఎందుకు చర్చ జరుగుతోంది? తొందరపడి మన కోయిల ముందే కూసిందా..? ఎవరో పాడిన రాగానికి మనం తాళం వేశామా? ప్రత్యర్ధి పార్టీ ఎపిసోడ్లో మనం మీద మీద పడి స్పందించడం ఎందుకు..? ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెదికే పనిలో బిజీగా ఉన్నాయట. ఇద్దరి మధ్య జరుగుతున్న రచ్చలో పార్టీ తొందర పడిందా..? అసలు వ్యూహమన్నదే లేకుండా పోయిందా..? అని పార్టీలో విస్తృత చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మీద మరో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్స్…తర్వాత జరిగిన ఎపిసోడ్పై పీసీసీ అధ్యక్షుడు మహేష్గౌడ్ స్పందించారు. తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్స్ తప్పే.. అలాగే కవిత వర్గం చేయించిన దాడి కూడా తప్పేనంటూ ప్రకటన చేసారాయన. అధికార పార్టీ అవడంతో….అలా మధ్యే మార్గంగా స్పందించి ఉండవచ్చని అనుకుంటున్నారు. ఐతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.
మల్లన్నపై దాడిని ఖండించారు. కవితను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు అభ్యంతర కరం ఐతే న్యాయపరంగా చూసుకోవాలిగానీ…. దాడులు సరికాదంటూ ఎక్స్లో మెసేజ్ పెట్టారు విజయశాంతి. ఐతే… దీనిపై కాంగ్రెస్ పార్టీలో భిన్నమైన చర్చ జరుగుతోందట. తీన్మార్ మల్లన్న… కవిత ఎపిసోడ్లో ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ నుంచి ఒక్క మధుసూదనా చారి మినహా ఎవ్వరూ స్పందించలేదు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కానీ… వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ రియాక్ట్ అవలేదు. ఈ విషయంలో ఇటు కుటుంబ బంధంగాని, అటు రాజకీయ బంధంగాని కవితకు సపోర్ట్గా రాలేదని, వాళ్ళ కంటే ముందే తమ పార్టీ నుంచి ఎందుకు రియాక్షన్ వచ్చిందని మాట్లాడుకుంటున్నాయట కాంగ్రెస్ వర్గాలు. అసలు ముందు రియాక్ట్ అవ్వాల్సింది వాళ్ళంతా కామ్గా ఉంటే… పీసీసీ అధ్యక్షుడు ఎందుకు తొందరపడ్డారన్న చర్చ జరుగుతోందట పార్టీ వర్గాల్లో.
సరే… మహిళకు మద్దతుగా మాట్లాడితే మాట్లాడారు గానీ… రాజకీయంగా బీఆర్ఎస్ని ఇరకాటంలోకి నెట్టకుండా…సొంత కాంగ్రెస్ పార్టీనే ఇబ్బంది పడేట్టు చేశారన్న అభిప్రాయంవ్యక్తం అవుతోందట పార్టీ సర్కిల్స్లో. అధికార పార్టీగా స్పందించాల్సిన దాని కంటే ఎక్కువగా…. ఓ అడుగు ముందుకు వేశారన్న టాక్ నడుస్తోంది కాంగ్రెస్ వర్గాల్లో. ఇదే సమయంలో పొలిటికల్ సర్కిల్స్ మాత్రం దీన్ని ఇంకోలా విశ్లేషిస్తున్నాయి. పేరుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయినా… కవితకు ప్రస్తుతం ఆ పార్టీ మద్దతు లేదని, అదే సమయంలో ఆమెను ఓన్ చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించి ఉండవచ్చన్న మాటలు వినిపిస్తున్నాయి కొన్ని సర్కిల్స్లో. అటు తీన్మార్ మల్లన్న మాత్రం తాను చేసిన కామెంట్స్ను సమర్థించుకున్నారు. తెలంగాణలో అలాంటి పదజాలాన్ని చాలా సహజంగా వాడుతుంటారని, అందులో దురుద్దేశాల్ని వెదకాల్సిన అవసరం లేదన్నది ఆయన వాదన. అటు బీసీ సంఘాలు మల్లన్నకు మద్దతుగా నిలబడ్డాయి. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిసైడైన రేవంత్రెడ్డి సర్కార్… ఆర్డినెన్స్ కోసం కసరత్తు చేస్తోంది. ఇలాంటి సమయంలో.. ఆయా వర్గాల్లో ఈ అంశాన్ని చర్చకు పెట్టి ప్రభుత్వానికి మైలేజ్ తీసుకు రావాల్సింది పోయి…. అనవసరంగా పార్టీ సస్పెండ్ చేసిన ఎమ్మెల్సీ ఇష్యూలో తలదూర్చి మొత్తం సైడ్ ట్రాక్ పట్టించారనిన అభిప్రాయం ఉందట కొందరు కాంగ్రెస్ నాయకుల్లో. ఏం మాట్లాడాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో అర్ధంగాక బీఆర్ఎస్ మల్లగుల్లాలు పడుతున్న టైంలో… కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అయి పెద్దన్న పాత్రలోకి వెళ్లి ఇద్దరిదీ తప్పేనని తేల్చేసింది. అధికార పార్టీ కాబట్టి స్పందన ఉండాలిగానీ…. ఒక వ్యూహమంటూ లేకుండా పోతే ఎలాగన్నది హస్తం నేతల క్వశ్చన్.