డైలీ సీరియల్ టైప్ సాగదీతలు, అంతకు మించిన ట్విస్టులు… థ్రిల్లర్ సినిమాను తలపించే సస్పెన్స్… మధ్య మధ్యలో కండువాతో కళ్ళు తుడుచుకునే సెంటిమెంట్ సీన్స్. దాదాపుగా నవరసాలు పండిస్తూ… జీవన తరంగాలు డ్రామా రసవత్తరంగా సాగుతోంది. క్రోథి నామ సంవత్సరంలో ప్రారంభమైన పొలిటికల్ సీరియస్ పరాభవ నామసంవత్సరంలో పరిసమాప్తవుతుందా? లేక మేటర్లో ఇంకా మలుపులు ఉన్నాయా? ఇంతకీ ఎవరా నేత..? ఏంటా జీవన తరంగాల కత…. తాటిపర్తి జీవన్రెడ్డి… తెలంగాణలో ఉన్న అన్ని పార్టీల్లోని అత్యంత సీనియర్ నాయకుల లిస్ట్ టాప్ ఫైవ్లో ఉంటారు. వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఆ వెంటనే ఎంపీగా పోటీచేసి ఓడిపోయినప్పటికీ… తగ్గేదే లే అంటూ… 75ఏళ్ల వయసులోనూ పొలిటికల్గా అటెన్షన్ గ్రాబ్ చేస్తున్నారాయన. రెండేళ్లుగా సొంత కాంగ్రెస్ పార్టీ పైనే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు జీవన్. సొంత నియోజకవర్గం జగిత్యాలలో తనను ఓడించిన ఎమ్మెల్యే సంజయ్ని పార్టీ దగ్గరకు తీయడం ఆయనకు ఎంత మాత్రం నచ్చడం లేదట. తొలినాళ్లలో జగిత్యాల ఫిరాయింపుల గురించి మాట్లాడి పార్టీని ఇరుకున పెట్టిన మాజీ మంత్రి…. ఇప్పుడు టోటల్ జంపింగ్ జపాంగ్ ఎపిసోడ్ని ప్రతిపక్షాల కంటే ఎక్కువగా తప్పుపడుతున్నారు.
ఆరంభంలో కాస్త పట్టించుకున్న హైకమాండ్ ఆ తర్వాత లైట్ తీసుకోవడంతో ఇప్పుడు డోస్ పెంచి పార్టీ నుంచి వెళ్లిపోతానని సంకేతాలిచ్చేశారు. ఆయన్ని బుజ్జగించేందుకు కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ ప్రయత్నించినా వర్కౌట్ కాలేదట. ఆ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మరీ…. తాను పార్టీలో ఉండాలనుకోవడం లేదు, నలభై ఏళ్ల అనుబంధాన్ని వదులుకోవడానికి సిద్దపడుతున్నట్టు ప్రకటించేశారు జీవన్రెడ్డి. దాంతో పాటే తాను పార్టీ మారకుండా ఉండాలంటే బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరిన వారిని వెంటనే బయటకు పంపాలని షరతు విధించారాయన. ఈ తరుణంలో శ్రీధర్ బాబు సహా పలువురు మంత్రులు… సీనియర్ నేతలు జీవన్రెడ్డిని పార్టీ వీడకుండా చూడాలని పీసీసీని కోరడంతో ఓ లీడర్ను దూతగా పంపారు. అయినా తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని తేల్చి చెప్పేశారట ఎక్స్ మినిస్టర్. పార్టీ మార్పు ప్రకటన చేసిన జీవన్ తన ఆవేదనను వెళ్లగక్కారట… అధికారంలోకి వచ్చాక పీసీసీ చీఫ్ రేవంత్ సీఎం అయ్యారు. సీఎల్పీ లీడర్గా పనిచేసిన భట్టి డిప్యూటీ సీఎం అయ్యారు. అయినా…
మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న తనకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదంటూ సెంటిమెంట్ వర్డ్స్ కోట్ చేశారు. అదంతా ఒక ఎత్తయితే…. ఇప్పుడాయన పార్టీ మారితే ఎటువైపు వెళతారన్న చర్చ ఆసక్తికరంగా జరుగుతోంది. అదే మాట ఆయన్ని అడిగితే….. అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో మంచి సంబంధాలే ఉన్నాయని,ఇటు బీజేపీలోనూ ఆప్తులు ఉన్నారంటూ సరికొత్త చర్చకు తెరలేపారు. కానీ… సన్నిహితులతో మాత్రం బీఆర్ఎస్ వైపే వెళదామంటూ ఇండికేషన్ ఇచ్చేశారు. ఆ విషయం బయటికి తెలిసి…. ఇంకేముంది రేపోమాపో ఆయన కారెక్కడం ఖాయం అని అనుకుంటున్న తరుణంలో అనూహ్య ప్రచారం తెర మీదికి వచ్చింది. రెండో ఆప్షన్గా ఉన్న బీజేపీ వైపు కూడా చూస్తున్నట్టు చర్చలు మొదలయ్యాయి. జీవన్రెడ్డితో మంచి సంబంధాలే ఉన్నాయని ముద్రపడిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఆయనకు టచ్లోకి వచ్చారట… బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో ఇదే విషయాన్ని అర్వింద్ చర్చించినట్టు టాక్ నడుస్తోంది. ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పనిచేసిన జీవన్రెడ్డి చేరితే… ఈ ఏరియాలో పార్టీ మరింత బలపడుతుందన్న నిర్ణయానికి బీజేపీ నాయకత్వం వచ్చినట్టు సమాచారం. ఆయన కాషాయ తీర్థం పుచ్చుకుంటే రెండు మూడు నియోజకవర్గాల్లో ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు కమలనాథులు… దానికి ఊతమిచ్చేలా జీవన్రెడ్డి కూడా సడన్గా తన కార్యాలయంలోని బ్యానర్లలో ఎన్నడూ లేని విధంగా రామలక్ష్మణుల ఫోటోలు పెట్టించారనే టాక్ నడుస్తోంది.
అయితే… జగిత్యాలలో మైనారిటీ ఓట్లు గెలుపు ఓటములపై ప్రభావం చూపుతాయి. సుదీర్ఘ కాలంగా జీవన్రెడ్డికి ఆ వర్గాల్లో మంచి పట్టుంది. ఇప్పుడాయన బీజేపీకి దగ్గరైతే ఆ ఓట్ బ్యాంక్ పరిస్థితి ఏంటన్న అనుమానాలు ఉన్నాయి. మాజీ మంత్రి సన్నిహితులు కొందరు మాత్రం బీజేపీలో చేరితేనే బాగుంటుందని సూచిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ఆయన కూడా ఇక్కడ బీజేపీకి క్రేజ్ ఉందని.. గత ఎన్నికల్లో నలభైవేలకు పైగా ఓట్లు సాధించిన విషయాన్ని గుర్తు చేశారట. యూత్ అంతా అటువైపు మొగ్గుతోందని తన వర్గంతో అన్నట్టు తెలిసింది. మరోవైపు కాంగ్రెస్ నేతలతో సహా… ఎమ్మెల్యే సంజయ్ కూడా జీవన్రెడ్డి పార్టీని వీడరని చెబుతున్న క్రమంలో పెద్దాయన ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఆయన కారెక్కుతారా? కమలాన్ని పట్టుకుంటారా? రెండూ కాదని కాంగ్రెస్లో కాంప్రమైజ్ అంటారా అన్నది చూడాలి.