రాజ్భవన్, ప్రగతిభవన్ మధ్య సయోధ్య కుదిరిందని అనుకుంటున్న తరుణంలో కొత్త చర్చ మొదలైందా? రాజ్భవన్ దర్బార్లపై పొలిటికల్ సర్కిళ్లలో చర్చ జరుగుతోందా? రాష్ట్ర సర్కార్ రియాక్షన్ ఏంటి?
రాజ్భవన్ దర్బార్లపై మళ్లీ రాజకీయ చర్చ
తెలంగాణకు గవర్నర్గా వచ్చినప్పటి నుంచి నిత్యం ఏదో ఒక కార్యక్రమంలో బిజీగా ఉంటున్నారు తమిళిసై. అందులో కొన్ని కార్యక్రమాలు రాష్ట్ర సర్కార్కు కంటగింపుగా మారడంతో రాజ్భవన్, ప్రగతి భవన్ మధ్య గ్యాప్ వచ్చింది. రెండు రాజ్యాంగ వ్యవస్థలు చర్చల్లో నలిగాయి. రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణ, బడ్జెట సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఏర్పాటు చేయడంతో రెండు వ్యవస్థల మధ్య వాతావరణం తేలికపడింది. రాజకీయ ఘర్షణకు ఫుల్స్టాప్ పడిందని రాజకీయ వర్గాలు భావించాయి. అయితే ఈ మార్పు మూణ్ణాళ్ల ముచ్చటేనా అని అధికారపార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. దీనికి రాజ్భవన్లో జరుగుతున్న దర్బార్లను వాళ్లు కారణంగా ప్రస్తావిస్తున్నారట.
కేంద్ర బడ్జెట్పై రాజ్భవన్లో చర్చా గోష్టిలు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై రాజ్భవన్లో చర్చాగోష్టిలు నిర్వహిస్తున్నారు గవర్నర్ తమిళిసై. ఈ సమావేశాలే చర్చగా మారుతున్నాయి. కేంద్ర బడ్జెట్పై రాష్ట్ర సర్కార్ పెదవి విరిచింది. రాష్ట్రానికి మళ్లీ మొండి చెయ్యే ఇచ్చారనేది గులాబీ నేతల ఆగ్రహం. అయితే అదే కేంద్ర బడ్జెట్పై రాజ్భవన్లో నిర్వహిస్తున్న దర్బార్లే గులాబీ శిబిరంలో గుసగుసలకు వేదికయ్యాయి. కేంద్ర బడ్జెట్ను రాష్ట్ర సర్కార్ విమర్శిస్తే.. ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ను అభినందించారు గవర్నర్. కేంద్ర చిట్టాపద్దును ఫ్యూచరిస్టిక్ బడ్జెట్గా ప్రశంసించారు కూడా. ఆ తర్వాత వరస సమావేశాలు పెడుతున్నారు తమిళిసై.
చర్చల్లో పాల్గొంటున్న నిపుణులు..!
కేంద్ర బడ్జెట్ 2023-24లో ఆరోగ్యరంగానికి కేటాయింపులు.. ఇచ్చిన ప్రాధాన్యాలపై గవర్నర్ అధ్యక్షతనే సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న వైద్య నిపుణులు పాల్గొన్నారు. హెల్త్కేర్కు భారీ కేటాయింపులు చేయడం వల్ల దేశంలో సుస్థిరమైన ఆరోగ్యం సంరక్షణ సాధ్యమనేది గవర్నర్ తమిళిసై అభిప్రాయం. విద్యా, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి ఇచ్చిన కేటాయింపులపైనా చర్చాగోష్టి నిర్వహించారు. రాజ్భవన్లో గతంలో ఈ విధమైన కార్యక్రమాలు జరగకపోవడంతో గులాబీ నేతలు అటెన్షన్లోకి వచ్చారు. రాజ్భవన్, ప్రగతిభవన్ మధ్య సామరస్య వాతావరణం నెలకొందని అనుకుంటున్న తరుణంలో తాజా దర్బార్లు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో అని సందేహిస్తున్నారట నేతలు. కేంద్ర బడ్జెట్ను కొనియాడుతూ నిర్వహించిన సమావేశాలపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు రియాక్ట్ అవుతారా లేక చూసీ చూడనట్టు వదిలేస్తారా అనేది ప్రశ్న.