Off The Record: 2029 ఎన్నికలే టార్గెట్గా వైసీపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. 2024 ఓటమి తర్వాత పార్టీ లోపల పూర్తి రీస్ట్రక్చరింగ్ మొదలైంది. 2019 ఎన్నికలకు ముందులాగానే పార్టీ అధినేత జగన్ స్వయంగా ప్రతీ అంశాన్ని మానిటర్ చేస్తున్నారు. పొలిటికల్ గా పార్టీకి మైలేజ్ ఇచ్చే ఏ అంశాన్నీ వదిలిపెట్టకుండా కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. తమ కేడర్ తిరిగి యాక్టివ్ అయ్యిందని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. దీంతో ఈసారి దెబ్బతిన్న చోటే గట్టిగా కొట్టాలని డిసైడ్ అయ్యారట జగన్. ఇప్పటికే వచ్చే ఏడాది ప్లీనరీ తర్వాత పాదయాత్ర 2.0 ఉంటుందని ప్రకటించిన ఆయన.. కేడర్ తో సమావేశమైన ప్రతీసారి ఒక్కొక్క లీక్ ఇస్తూ మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు పీకే గురించి అలాంటి డిస్కషనే వైసీపీలో జరుగుతోంది. 2019లో వైసీపీ భారీ విజయం సాధించటంలో కీలకపాత్ర పోషించిన పీకే మళ్లీ రంగంలోకి దిగనున్నాడన్న చర్చ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
ఐ ప్యాక్ పేరుతో ఒకప్పుడు జగన్కు స్ట్రాటజీ ఇచ్చిన ప్రశాంత్ కిశోర్ 2024లో టీడీపీకి నేరుగా కాకపోయినా మార్గదర్శనం చేశారు. గత ఎన్నికల సమయంలో రిషీ సింగ్ నేతృత్వంలోని ఐ ప్యాక్ వైసీపీ కోసం పనిచేసినప్పటికీ ఘోర పరాజయం చవిచూసింది. దీంతో తిరిగి ప్రశాంత్ కిషోర్ టీం సిద్దమవుతున్నారని చెబుతున్నారు. తాను ఏ పార్టీకీ ఎలక్షన్ స్ట్రాటజీలు చేయనని చెప్పినా.. రాజకీయ పార్టీ పెట్టి చేతులు కాల్చుకున్న పీకే తిరిగి తన పనికి సిద్దమవుతున్నారని తెలుస్తోంది. అయితే ఆయన టీం ఈ విషయాన్ని అఫీషియల్గా ధృవీకరించడం లేదు.
ఇదే సమయంలో మరో కొత్త పేరు కూడా తెరమీదకు వస్తోంది. ఐ ప్యాక్ నుంచే బయటకు వచ్చిన ఇషా సింగ్ అనే కన్సల్టెంట్ వైసీపీకి పని చేయబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఐప్యాక్తో సంబంధం లేకుండా ఆమె స్వతంత్రంగా వ్యూహాలు సిద్ధం చేస్తారని, గతంలో రావాలి జగన్.. కావాలి జగన్ క్యాంపెయిన్ వెనుక కూడా ఈమెనే ఉన్నారని చెప్పుకొస్తున్నారు. అయితే ఇవన్నీ ఇప్పటికీ అధికారికంగా కన్ఫర్మ్ కాలేదని టాక్. జగన్ మాత్రం మరోసారి పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లి 2029లో తిరిగి అధికారంలోకి రావాలని గట్టిగా యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకుంటున్నారు. వచ్చే ఏడాది పార్టీ ప్లీనరీ తర్వాత పాదయాత్ర మొదలవుతుంది. దీంతో వచ్చే ఏడాది పాదయాత్రను.. ఆ తర్వాత ఎన్నికలను మానిటర్ చేసేందుకు వ్యూహకర్తల నియామకం ఉండవచ్చనేది పార్టీ వర్గాల టాక్. అప్పటి వరకూ జరిగేది కేవలం ప్రచారం మాత్రమేనని కొట్టిపారేస్తున్నారు. ఎన్నికల కన్సల్టెంట్లు పార్టీ అధినేతలను కలవటం.. తమ సంస్థల అనుభవాలు, విజయాలు చెప్పటంతో పాటు ఆయా పార్టీల కోసం తాము చేయబోయే యాక్షన్ ప్లాన్ రఫ్ డ్రాఫ్ట్ ను వివరించటం కామన్ గా జరగుతుంటాయి. కలిసిన ప్రతీ ఒక్కరికి బాధ్యతలు అప్పగించటం జరగదని.. కొన్ని సందర్బాల్లో కలిసిన వ్యక్తులే బయటకు లీకులు ఇస్తుంటారు తప్ప ఫైనల్ చేసినట్లు కాదని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నారు.
అయితే వ్యూహాలు మారొచ్చు.. వ్యూహకర్తలు మారొచ్చు కానీ లక్ష్యం మాత్రం అధికారం లోకి రావటమేనని చెబుతున్నారు పొలిటికల్ పండిట్స్. వైసీపీ కేడర్ మాత్రం ఐ ప్యాక్ మీద గుర్రుగా ఉండటంతో మరోసారి రిషీ సింగ్ అండ్ కో కు మాత్రం అవకాశం ఇవ్వక పోవచ్చని అంచనా వేస్తున్నారు. కన్సల్టెంట్లు ఒక్కోసారి కన్ఫర్మ్ అయినప్పటికీ హైప్ కోసం అఫీషియల్ గా అనౌన్స్ చేయటానికి సమయం పట్టవచ్చని చెప్పుకొస్తున్నారు. మరి ఈ స్ట్రాటజిస్ట్ల అంశంలో జరుగుతున్న ప్రచారాల్లో నిజమెంత? ప్రశాంత్ కిశోర్ రీఎంట్రీ ఖాయమా? లేక కొత్తగా ఎవరైనా వస్తారా.. వైసీపీ అధినేత జగన్ ఫైనల్ ప్లాన్ ఏంటి.. రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో చూడాలి.