Off The Record: ఎమ్మిగనూరు పాలిటిక్స్ కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే, వైసీపీ మాజీ మంత్రి మధ్య సవాళ్ళ పర్వం పీక్స్కు చేరుతోంది. అదీకూడా… నియోజకవర్గంలో అత్యంత కీలకమైన చేనేత వర్గాన్ని ప్రభావితం చేసేది కావడం, వంద కోట్లకుపైగా ఆస్తులతో ముడిపడ్డ వ్యవహారం కావడంతో…మేటర్ ఎట్నుంచి ఎటు టర్న్ అవుతుందోనన్న ఉత్కంఠ పెరిగిపోతోంది. ఎమ్మిగనూరు చేనేత సహకార ఉత్పత్తి , విక్రయ సంఘానికి దేశవ్యాప్తంగా వంద కోట్లకు పైబడి ఆస్తులు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో చేనేత సామాజికవర్గం బలంగా ఉంది. ఈ క్రమంలో… టీడీపీ ఎమ్మెల్యే జయనాగేశ్వర్రెడ్డి, వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక మధ్య మొదలైన వార్ ఇంట్రస్టింగ్ టర్న్ తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. పద్మశ్రీ మాచాని సోమప్ప ఆధ్వర్యంలో 1938లో ఏర్పాటైంది ఈ సహకార సంఘం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సొసైటీ లాభాల్లోనే ఉంది. ఇక్కడ తయారయ్యే చేనేత ఉత్పత్తులకు బాగా డిమాండ్ కూడా ఉంది. అయితే… ఇప్పుడీ చేనేత సొసైటీ దుకాణాలను ఆప్కోలో విలీనం చేయాలన్న ప్రతిపాదనలు కాక రేపుతున్నాయి.
దీనికి సంబంధించి బుట్టా రేణుక, జయనాగేశ్వర్రెడ్డి మధ్య ఆరోపణలు, సవాళ్ళు ఎమ్మిగనూరులో పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. చేనేత సహకార ఉత్పత్తి , విక్రయ సంఘం దుకాణాలలను ఆప్కోలో విలీనం చేయాలంటూ ఏపీ చేనేత, జౌళి శాఖ కమిషనర్ రాసిన లేఖపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు మార్చి 31న సొసైటీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఇక అక్కడి నుంచి తీవ్రత మరింత పెరిగిపోయింది. ఎమ్మిగనూరు సొసైటీకి దేశ వ్యాప్తంగా 16 ఔట్ లెట్స్ ఉన్నాయి. అలాగే భారీ ఆస్తులు కూడా ఉండడంతో… కొందరు టీడీపీ నాయకులు సొసైటీ ఆస్తులపై కన్నేశారంటూ చేనేత వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. మాజీ ఎంపీ బుట్టా రేణుక కూడా చేనేత సామాజికవర్గానికి చెందిన నాయకురాలే కావడంతో… ఆ ఆరోపణలకు ప్రాధాన్యం ఇంకా పెరిగింది. ఈ విలీన ప్రతిపాదన మొత్తం ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి కుట్ర అని ఆరోపిస్తున్నారు బుట్టా. ఎలాంటి దురుద్దేశ్యాలు లేకుంటే… రాత్రికి రాత్రే సొసైటీ సెక్రటరీని ఎందుకు బదిలీ చేశారని ప్రశ్నిస్తున్నారామె. లాభాల్లో ఉన్న సొసైటీని తీసుకెళ్ళి అప్పుల్లో ఉన్న ఆప్కోలో కలిపి ఆ అప్పుల్ని తీరుస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని అంటున్నారామె. ఎట్టి పరిస్థితుల్లో.. ఆప్కోలో విలీనాన్ని అడ్డుకుంటామని అన్నారు. సొసైటీ సర్వసభ్య సమావేశం జరుగుతున్న సమయంలోనే చేనేత శ్రేణులతో కలిసి కార్యాలయాన్ని ముట్టడించారు బుట్టా రేణుక. అయితే… అదే సమయంలో కారణం ఏదైనాగానీ… విలీనాన్ని వ్యతిరేకిస్తూ సొసైటీ సర్వసభ్య సమావేశంలో తీర్మానించారు.
కానీ… విషయం అక్కడితో సమసిపోలేదు. సొసైటీ దుకాణాల్ని విలీనం చేసే ప్రయత్నం జరుగుతోందన్న ప్రచారం టీడీపీని చిక్కుల్లో పడేస్తోందని అంటున్నారు. దాన్నుంచి బయటపడటానికా అన్నట్టు ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి బుట్టా రేణుకకు సవాల్ విసిరారు. మార్కెటింగ్ మెర్జర్ను విలీనం అంటూ తప్పుడు ప్రచారం చేశారని, చేనేత సహకార సంఘం ఆస్తులు మార్చడం లేదా ఆప్కోలో కలపడం, లేదా అమ్మకానికి సంబంధించిన ఏ ఒక్క డాక్యుమెంట్ అయినా చూపగలరా అంటూ ఛాలెంజ్ చేశారాయన. అలాంటి ఆధారాలు చూపితే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని, లేదంటే బుట్టా రేణుక తప్పుకుంటారా అంటూ ప్రశ్నించారు ఎమ్మెల్యే. చేనేతకు మంచి చేయడానికి ఒక నిర్ణయం తీసుకుంటే… వక్రీకరించారని, వ్యతిరేకించిన సొసైటీ సభ్యులనే ఒప్పించి తాను అనుకున్నది సాధిస్తానని అంటున్నారు జయనాగేశ్వర్రెడ్డి. చేనేత సొసైటీ దుకాణాల విలీనం వివాదం అటుంచితే… దానికి సంబంధించి జౌళి శాఖ కమిషనర్ పంపిన లేఖను బయట పెట్టకపోవడం అనుమానాలకు దారి తీస్తోందట. అందులోనూ సొసైటీ సెక్రటరీని రాత్రికి రాత్రే బదిలీ చేయడం పైనా డౌట్స్ పెరుగుతున్నాయంటున్నారు.