Off The Record: తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు ఎవర్ని కదిలించినా ఒకటే టాపిక్. అదే…. కేబినెట్ విస్తరణ గురించి. సీఎం రేవంత్ రెడ్డి, PCC చీఫ్ మహేష్ గౌడ్ ఒకేసారి ఢిల్లీ వెళ్ళడం, అంతకు ముందు రోజే కో ఆర్డినేషన్ కమిటీ ప్రకటన రావడం, అటు పీసీసీ చీఫ్ గా జగ్గారెడ్డి ఉంటే 100 సీట్లు వస్తాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కామెంట్ చేయడం… ఇలా ఒకదాని వెంట ఒకటిగా వరుస పరిణామాలు జరుగుతున్నాయి. వీటన్నిటిని కలిపి చూస్తున్నవాళ్ళు మాత్రం ఏదో జరగబోతోంది, అది కేబినెట్ విస్తరణే అయి ఉంటుందని మాట్లాడుకుంటున్నారు. వాస్తవానికి…అంతకు ముందు పార్టీ సీనియర్ నేతలు, మంత్రులను ఢిల్లీ పిలిచి ఏర్పాటు చేసిన సమావేశంలోనే…కేబినెట్ విస్తరణ గురించి చర్చించినట్టు తెలిసింది. అప్పుడే పార్టీ పెద్దల దగ్గర ఈ ప్రస్తావన తీసుకొచ్చారట సీఎం రేవంత్. మార్పులు చేర్పుల గురించి అప్పుడే మాట్లాడుకున్నారట. అసెంబ్లీ సమావేశాల తర్వాత కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు ప్రచారం జరిగింది. అది మనసులో ఉండగానే… ఇప్పుడు వరుసగా అన్ని అంశాలు కలిసి రావడంతో ఇక మంత్రివర్గంలో మార్పులు చేర్పులు తధ్యమని మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు.
ప్రభుత్వ చీఫ్విప్తో పాటు కేబినెట్ విస్తరణ ప్రక్రియ మొత్తం…. ఈ నెలాఖరు.. లేదంటే ఏప్రిల్ మొదటి వారంలో ఉంటుందని గట్టిగా నమ్ముతున్నారు కాంగ్రెస్ నాయకులు. ఐతే.. రెండు రోజుల్లో ప్రభుత్వ విప్ పోస్టులు భర్తీ కాబోతున్నాయి. నకిరేకల్ MLA వేముల వీరేశం, మహబూబ్నగర్ శాసనసభ్యుడు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, పెద్దపల్లి MLA విజయ రమణా రావుకు విప్ పదవులు ఇచ్చే అవకాశం ఉంది. ఇక కేబినెట్ విస్తరణ ఈక్వేషన్కు అనుగుణంగా చీఫ్ విప్ పదవి ఉండవచ్చంటున్నారు. రేవంత్ కెబినెట్లో ప్రస్తుతం 15 మంది మంత్రులు ఉన్నారు. మరో ఇద్దరికి అవకాశం ఉంటుంది. ఆ ఇద్దరితో పాటు… ఇప్పుడున్న మంత్రుల శాఖలను మార్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మంత్రివర్గంలో కూడికలు, తీసివేతలపై ఇప్పటికే చర్చ జరుగుతోంది. ఎవరిని తొలగిస్తారు… ఎవరిని కొత్తగా తీసుకుంటారన్న విషయంలో ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. మంత్రి పదవి ఆశిస్తున్నవాళ్ళలో రంగారెడ్డి జిల్లా నుంచే ఎక్కువగా ఉన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో పాటు.. మల్ రెడ్డి రంగారెడ్డి.. పరిగి రామ్మోహన్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. ఇక లంబాడా సామాజిక వర్గం నుంచి దేవరకొండ MLA బాలు నాయక్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇక అదే జిల్లాకు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేబినెట్లో చోటు కోసం సీరియస్గా వర్కవుట్ చేస్తున్నారు. నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, మంచిర్యాల ప్రేమ్ సాగర్ రావు కూడా ఆశతో ఉన్నారు. ఇక శాఖల మార్పుల్లో భాగంగా కీలకమైన మంత్రుల పోర్ట్ఫోలియోలు కూడా మారవచ్చని అంటున్నారు. సీనియర్ మినిస్టర్స్ శాఖలు సైతం మారతాయన్న చర్చ కూడా గట్టిగానే ఉంది. సీఎం రేవంత్ మనసులో ఏముంది..? అధిష్టానం ఆయనకు ఏం చెప్పిందన్నది చూడాలి..!?