Off The Record: ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఆయన. కానీ… గెలుపు రుచి చూసి మాత్రం 20ఏళ్ళయింది. ఈసారి చచ్చీచెడీ టిక్కెట్ తెచ్చుకున్నా… ఎక్కడో తేడా కొడుతోందట. అందుకే ఫైనల్గా ఓ సెంటిమెంట్ అస్త్రాన్ని వదిలారాయన. ఆ దెబ్బకు జనం గింగిరాలు తిరిగి…. మండుటెండలో మంచుముక్కలా కరిగిపోయి మరో ఆలోచన లేకుండా తన కోసం మీట నొక్కేస్తారన్నది ఆయన అంచనా. ఇంతకీ ఎవరా లీడర్? ఏంటి ఆయన వదిలిన సెంటిమెంటాస్త్రం?
నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గానికి చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతల్లో ఒకరు. మేనమామ నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుంచి రాజకీయ ఓనమాలు నేర్చుకున్న సోమిరెడ్డి… నాలుగు దశాబ్దాల నుంచి యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటున్నారు. కానీ… గెలుపు రుచి చూసి 20ఏళ్ళు అయింది. వరుసగా నాలుగు విడతల నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోతున్నారాయన. ఈసారి కూడా తీవ్ర ఉత్కంఠ, రకరకాల ఆప్షన్స్ని చూసి అవి వర్కౌట్ అవ్వవని తెలిశాకే సర్వేపల్లి టిక్కెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. దీంతో గెలుపన్నది లైఫ్ అండ్ డెత్గా మారిపోయింది ఆయనకు. అందుకే రకరకాల అస్త్రాలను ప్రయోగిస్తూనే ఫైనల్గా బ్రహ్మాస్త్రాన్ని వదలడం నియోజకవర్గంలో హాట్ టాపిక్ అయింది.
1994 ఎన్నికలలో సర్వేపల్లి నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు సోమిరెడ్డి. చంద్రబాబు క్యాబినెట్లో ఐదు శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. 1999లో కూడా రెండోసారి గెలిచి మళ్ళీ మంత్రి పదవి చేపట్టారాయన. కానీ.. 2004 అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు సోమిరెడ్డి. అనంతరం టిడిపి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. పార్టీ పరంగా పదవులకు ఏ ఇబ్బంది లేకుండా ఎదిగిన మాజీ మంత్రితో ఎన్నికల విజయం మాత్రం దోబూచులాడింది. 2009 ఎన్నికల్లో కూడా అదే సర్వేపల్లిలో అదే ఆదాల చేతిలో ఓడిపోయారాయన. ఇక 2014, 2019లో వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్ రెడ్డి చేతిలోనూ పరాజయం తప్పలేదాయనకు. 2014లో తాను ఓడినా… టిడిపి అధికారంలోకి రావడంతో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రిని చేశారు చంద్రబాబు. చివరికి మంత్రిగా ఉంటూ కూడా 2019 ఎన్నికలలో ఓడిపోవడం చర్చనీయాంశం అయింది. ఇక ఈసారి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టిడిపి… గెలుపు గుర్రాలనే బరిలోకి దింపాలని డిసైడైంది.
వరుసగా మూడుసార్లు ఎన్నికల్లో ఓడిపోయిన వారికి టికెట్ ఇవ్వబోమని ముందే ప్రకటించారు లోకేష్. దీంతో సోమిరెడ్డికి టికెట్ పై అయోమయం నెలకొంది. తొలి రెండు జాబితాల్లో ఆయన పేరు ప్రకటించని అధిష్టానం రకరకాల ఆప్షన్స్ కోసం ప్రయత్నించింది. చివరికి సోమిరెడ్డి కోడలు శృతికి టికెట్ ఇవ్వాలని కూడా అనుకున్నారు. కానీ… వై.సి.పి అభ్యర్థి కాకానిని దీటుగా ఎదుర్కోవాలంటే ఆమె అనుభవం సరిపోదని తానైతేనే కరెక్ట్ అంటూ మాజీ మంత్రి నచ్చజెప్పుకోవడంతో…మరో గత్యంతరం లేక చివరికి ఆయన్నే ఫైనల్ చేసింది అధిష్టానం. టిక్కెట్ ఓకే అయినా… ఇప్పుడు గెలవడమన్నది సోమిరెడ్డికి జీవన్మరణ సమస్య. వరుసగా మూడు సార్లు ఓడిన వారికి టిక్కెట్ లేదని ఇప్పటికే విధాన నిర్ణయం తీసుకునిన టీడీపీ అధిష్టానం ఇంకోసారి ఓడితే ఇక సోమిరెడ్డిని పక్కన పెట్టడం ఖాయమన్న అభిప్రాయం బలంగా ఉంది. ఈ విడతలోనే మరో గత్యంతరం లేక నిక్కీ నీలిగీ టిక్కెట్ తెచ్చుకోగా… ఇప్పుడు తేడా పడితే…మరోసారి ఆ అవకాశం కూడా ఉండబోదు. అదే పాయింట్ మీద బ్రహ్మాస్త్రాన్ని బయటికి తీశారట ఆయన. తనకు ఇవే ఆఖరు ఎన్నికలని, మద్దతిచ్చి గట్టెక్కించమంటూ వేడుకుంటున్నారట. ఇటీవల పొదలకూరు బహిరంగ సభలో చంద్రబాబు సమక్షంలోనే సోమిరెడ్డి ఈ టాపిక్ తీసుకురావడంపై చర్చ జరుగుతోంది.
అలాగే ఇంతకు ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరిపోయిన స్థానిక నాయకుల ఇళ్ళకు వెళ్ళి మరీ రా.. రమ్మని బతిమాలుకుంటున్నట్టు తెలిసింది. మొత్తంగా తనకు ఇవే చివరి ఎన్నికలంటూ సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి చెబుతున్న మాటల్ని సర్వేపల్లి జనం ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారు? కనీసం ఐదోసారైనా ఆయన్ని గట్టెక్కిస్తారా? సెంటిమెంట్ అస్త్రం వర్కౌట్ అవుతుందా అన్నది చూడాలి.