Off The Record: అమిత్ షా అంత సమయం ఎలా ఇచ్చారు?.. హాట్‌ టాపిక్‌గా మారిన రామచంద్రయాదవ్‌..

Ramachandra Yadav

Ramachandra Yadav

Off The Record: రామచంద్ర యాదవ్‌. 2019లో జనసేన పార్టీ అభ్యర్థిగా పుంగనూరులో పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు వచ్చిన ఓట్లు 16 వేల 452. ఓడినప్పటికీ జనసేనకు దూరం జరిగి.. పుంగనూరు వేదికగా తన రాజకీయ భవిష్యత్‌కు బాటలు వేస్తున్నారు. ఈ మధ్య కాలంలో రామచంద్రయాదవ్‌ చేస్తున్న కార్యక్రమాలు చినికి చినికి గాలివానగా మారుతున్నాయి. ఏ కార్యక్రమం తలపెట్టినా మలుపులు తిరుగుతూ హైటెన్షన్‌ క్రియేట్‌ చేస్తోంది. ఒకసారి జాబ్‌మేళ అని మరోసారి యోగా గురువు రాందేవ్‌బాబాతో గృహప్రవేశం అని తెగ హంగామా చేసిన రామచంద్రయాదవ్‌కు స్థానిక వైసీపీ నేతలు ఎప్పటికప్పుడు చెక్‌ పెడుతూనే ఉన్నారు.

Read Also: Off The Record: సీఎస్‌గా శాంతికుమారినే ఎందుకు ఎంపిక చేశారు?

గత నెలలో రామచంద్రయాదవ్‌ పుంగనూరులో రైతు సమస్యలపై రైతుభేరి నిర్వహించాలని అనుకున్నారు. రైతు భేరికి అనుమతి లేదని పోలీసులు చెప్పారు. కానీ.. ఆయన అనుచరులు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి.. LIC కాలనీలోని యాదవ్‌ కొత్త ఇంటికి వెళ్లారు. అంతవరకు బాగానే ఉంది. ర్యాలీ మొత్తం సీన్‌ మారిపోయింది. కొందరు వ్యక్తులు కర్రాలు, రాళ్లతో రాత్రివేళ రామచంద్ర యాదవ్‌ ఇంటిపై దాడి చేశారు. ఇంట్లోకి చొరబడి ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. ఇంటి ఆవరణలో ఉన్న కార్ల అద్దాలు పగులకొట్టారు. వైసీపీ కార్యకర్తలే ఈ విధ్వంసానికి పాల్పడ్డారని.. ఓ నేత ఆదేశాలతోనే ఈ దాడులు జరిగాయని.. పోలీసులు పట్టించుకోలేదని ఆయన ఫైర్‌ అయ్యారు. దీనికి రామచంద్ర యాదవ్‌ ప్రత్యర్థులు సోషల్‌ మీడియాలో ఝలక్‌ ఇచ్చారు.

ఎన్నికల సమయంలో రామచంద్రయాదవ్‌ ఓట్ల కోసం ఇచ్చిన టోకెన్స్‌ను డబ్బులు ఇస్తారంటూ ప్రత్యర్థులు ఫేస్‌బుక్‌లో ప్రచారం చేశారు. అలాగే మా టోకెన్స్‌కు డబ్బులు ఎప్పుడు ఇస్తారంటూ బోర్డులు, బ్యానర్లు వెలిశాయి. డబ్బుల కోసం భారీగానే రామచంద్రయాదవ్‌ ఇంటికి చేరుకున్న మహిళలు టోకెన్స్‌ చూపిస్తూ నిరసనకు దిగడంతో ఆయన అనుచరులకు మైండ్‌ పోయిందట. దీంతో వైసీపీనే తనపై అభాండాలు వేస్తోందని రామచంద్రయాదవ్‌ ఆరోపించారు. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించిన ఆయన అందరికీ షాక్‌ ఇస్తూ ఢిల్లీలో ప్రత్యక్షం కావడం… అదీ బీజేపీ అగ్రనేత.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను కలవడం చర్చకు దారితీసింది.

గల్లీలో జరిగిన గొడవను ఢిల్లీ దాకా తీసుకెళ్లడం.. అమిత్ షాకు అతను ఫిర్యాదు చేయడం ప్రశ్నగా మారింది. అసలు ఓ నియోజకవర్గంలో ఎదిగీ ఎదగని నేతకు అమిత్ షా అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం ఏంటి? అదీ 40 నిమిషాలు కావడం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదట. దేశంలో నెంబర్‌ 2గా ఉండే అమిత్ షాతో కలవడం అంటే అంత ఆషామాషీ కాదు. అలాంటిది నేరుగా ఆయన్ను యాదవ్‌ కలవడం ప్రశ్నగా మారింది. గమ్మత్తు ఏంటంటే.. ఈ భేటీ ఏపీ బీజేపీలో ఎవరికీ తెలియకపోవడం. ఎవరు ఎవరిని కలిసినా జనం వైసీపీ వెంటే ఉన్నారని పుంగనూరులోని పార్టీ కేడర్‌ ఢంకా బజాయిస్తోంది. యాదవ్‌ ఢిల్లీ టూర్‌ను లైట్‌ తీసుకుంటోందట.