Off The Record: జనసేనలో ఇద్దరి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందా..? తాడోపేడో తేల్చుకోవాలని డిసైడయ్యారా..?

  • ఉన్నట్టుండి ఎందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు?
  • జనసేనలో ఇద్దరి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందా?
  • ఉనికి కోసం తాడోపేడో తేల్చుకోవాలని డిసైడయ్యారా?
  • ఎమ్మెల్సీ, మంత్రి పదవిపై బాలినేని ఆశలు
  • అసలు పార్టీలో ఉనికే ప్రశ్నార్ధకం, వివాదాస్పద వ్యాఖ్యలు
  • తనను తొక్కేసే కుట్ర జరుగుతోందన్న బాలినేని
  • ప్రాధాన్యం దక్కడంలేదన్న అసంతృప్తితో సామినేని ఉదయభాను
  • పవన్‌ను కలిసే అవకాశం కూడా సామినేనికి దక్కడం లేదా?
  • కూటమిలోనే విభేదాలున్నాయన్న సామినేని వ్యాఖ్యల కలకలం..
Otr Balineni And Samineni

Otr Balineni And Samineni

Off The Record: కూటమి అధికార భాగస్వామి జనసేనలో ఉన్నప్పటికీ ఎలాంటి పదవి లేకుండా, రాజకీయంగా కూడా వెయిటింగ్ మోడ్‌లోనే ఉన్న ఇద్దరు సీనియర్ నేతల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పెద్దగా మార్పేమీ లేకున్నా… ఉన్నట్టుండి వాళ్లు యాక్టివిటీ పెంచడం వెనకున్న రీజన్‌ ఏంటంటూ పార్టీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. ఒకప్పుడు తమ నియోజకవర్గాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను. ఇప్పుడు జనసేనలో వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు రాజకీయంగా బలమైన పట్టున్న ఈ ఇద్దరు నేతల్లో ఇప్పుడు ఆ పట్టు జారిపోతుందన్న కంగారు పెరుగుతోందట. ఇంకా డిఫెన్సివ్ మోడ్‌లో ఉంటే రాజకీయంగా తమ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందన్న ఆందోళనతో ఇక తాడోపేడో తేల్చుకోవాలని డిసైడైనట్టు తెలిసింది. అందుకే దూకుడు చూపిస్తున్నారట సామినేని, బాలినేని. ఒకప్పుడు వైసీపీలో కీలక నేతగా ఉండి, రాజకీయంగా బలమైన స్థానం సంపాదించిన బాలినేని శ్రీనివాసరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత జనసేనలో చేరారు. కానీ… పార్టీలో ఆయన పాత్ర ఏంటి? స్థానం ఎక్కడన్నది ఇంతవరకు క్లారిటీ లేదు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా కనిపించని పరిస్థితిలోఅసలు బాలినేని జనసేనలో ఉన్నారా.. అనే ప్రశ్నలు సైతం వచ్చాయి ఒక దశలో. ఎమ్మెల్సీ పదవి వస్తుందని, అలాగే మంత్రి పదవిపై కూడా ఆయన ఆశలు పెట్టుకున్నట్టు చెప్పుకున్నారు. కానీ… అలాంటివేం లేకపోగా… ఇప్పుడసలు పార్టీలో ఆయన ఉనికే ప్రశ్నార్థకమైంది.

అందుకే పొలిటికల్‌ ఎగ్జిస్టెన్స్ కోసం ఇప్పుడు వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నట్టు అంచనా వేస్తున్నారు పొలిటికల్‌ పండిట్స్‌. వైసీపీ, టీడీపీ కలిసి తనను రాజకీయంగా తొక్కేసే కుట్ర చేస్తున్నాయంటూ బాలినేని చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యాయి. ఓ వైపు అధినేత పవన్ పవన్ కల్యాణ్ పార్టీ వ్యూహాల సంగతి నాకు వదిలేయండి, మీరు పని చేయండని చెపుతున్నారు. అంతే కాదు… ఎక్కడా కూటమిలో గ్యాప్ వచ్చేలా వ్యవహరించడానికి వీల్లేదంటూ…వార్నింగ్‌ ఇస్తున్నారు. కానీ…. బాలినేని మాటలు ఇప్పుడు బోర్డర్ దాటేశాయని పార్టీ నాయకులే అంటున్నారు. ఇటీవలి కీలక సమావేశాల్లో కూడా బాలినేని – సామినేని రాజకీయ భవిష్యత్తు, పదవుల గురించి మాట్లాడారు పార్టీ అధ్యక్షుడు పవన్‌. వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చి నిందలు మోస్తున్నారని కూడా అన్నారు. ఈ పరిస్థితుల్లో… పవన్ నోటీస్‌లో ఉండే బాలినేని ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారా..అనే సందేహాలు కూడా వస్తున్నాయట చాలామందికి. ఇక జనసేనలో ఉన్న మరో సీనియర్ నేత సామినేని ఉదయభాను పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉందట. పార్టీ ఆయనకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించినప్పటికీ ఆశించిన స్థాయిలో రాజకీయ ప్రాధాన్యం దక్కలేదనే అసంతృప్తి కనిపిస్తోంది.

జనసేనలో చేరిన తర్వాత కూడా అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసే అవకాశం పెద్దగా రాలేదన్న భావన ఆయన అనుచరుల్లో ఉంది. ఏదో…. పెద్ద రాజకీయ అవకాశం దక్కుతుందన్న అంచనాలు పెట్టుకున్న సామినేని…. ఇప్పుడు పరిస్థితులు మారిపోవడంతో తీవ్ర అసహనంగా ఉన్నట్టు సమాచారం. ఆ ఊపులోనే ఆయన కూడా వివాదాస్పద వ్యాఖ్యలతో పొలిటికల్‌ హీట్ పెంచుతున్నారు. కూటమిలోనే విభేదాలు ఉన్నాయంటూ సామినేని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారితీశాయి. బయటకు వచ్చి ఇలాంటి విషయాలపై మాట్లాడవద్దని పవన్‌ సూచించినప్పటికీ కావాలనే ఉదయభాను ఈ అంశాలను ప్రస్తావిస్తున్నారనే చర్చ జరుగుతోంది. మొత్తానికి బాలినేని, సామినేని ఇద్దరూ జనసేనలో ఉంటూనే వరుస వివాదాలకు కారణమవుతున్నారు అన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.